ఓటేద్దాం రండి..!
- పోలింగ్కు సర్వం సిద్ధం
- నేడే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు
- భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు
- పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత
- డిస్టిబ్య్రూషన్ సెంటర్ వద్ద పోలింగ్ సామాగ్రి అందచేత
- పోలింగ్ సామాన్లతో కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది
- ఉదయం మాక్ పోలింగ్..తరవాత పోలింగ్కు అనుమతి
- పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
హైదరాబాద్,జ్యోతిన్యూస్ :
ప్రత్యేక తెలంగాణలో మూడోసారి ఎన్నికలు జరుగబోతున్నాయి. గురువారం జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఒకేదఫాలో జరుగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు పోలింగ్ జరుగనుంది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలో పోలింగ్ జరుగునుండా… అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్దం చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో రాష్ట్ర పోలీసులు లక్షమంది సిబ్బందితోపాటు కేంద్ర బలగాలను కూడా రంగం లోకి దించారు. సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఎన్నికల విధుల్లో 375 కంపెనీల కేంద్ర బలగాలు విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4,400 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి అదనంగా సిబ్బందిని నియమించారు. అస్సాం రైఫిల్స్, బోర్డర్స్ సెక్యూరిటీ ఫోర్స్,సెంట్రల్ ఇండస్టియ్రల్ సెక్యూరిటీ ఫోర్స్ , సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ సెక్యూరిటీ గార్డస్ ఎన్నికల విధుల్లో ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లను బద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. ఇక్కడ విధులు నిర్వహించేందుకు ఇతర రాష్టాట్ర నుంచి హోంగార్డు సిబ్బంది వచ్చారు.కాగా ఇప్పటికే ఎన్నికలు బహిష్కరణ కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. దీంతో ఏజన్సీ ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు.కేంద్ర బాలగాలు ఏజెన్సీ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. మద్యం, డబ్బులు పంపిణిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే సిసిటీవీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. తెలంగాణలో పోలింగ్కు సర్వం సన్నద్ధం కాగా పోలింగ్ సామాగ్రిని తీసుకుని అధికారులు తమకు కేటాయించిన కేంద్రాలకు ప్రత్యే వాహనాల్లో వెళ్లారు. దీని కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక డిస్టిబ్యూష్రన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. అక్కడికే సిబ్బంది చేరుకొని తమకు కేటాయించిన సామగ్రిని కలెక్ట్ చేసుకుని బయలుదేరారు.ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును ఫెసిలిటీ సెంటర్లో కూడా వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. అక్కడే ఎన్నికల సామగ్రి కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి ఏర్పాటు చేసిన వెహికల్స్లో పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. ఎన్నికల సామగ్రి, సిబ్బందిని చేరవేసేందుకు ఉంచిన వాహనాలకు ముందే రూట్ మ్యాప్ ఇచ్చారు. ఆ ప్రకారమే వెహికల్స్ మూమెంట్ ఉంటుంది. వేరే దారిలో వెళ్లే పరిస్థితి ఉండకూదు. మార్గ మధ్యలో ఆప కూడదని కూడా ఆదేశాలు ఉన్నాయి. వాటికి జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుందని ఏ జరుగుతుందో స్పష్టంగా తెలిసిపోతుందని ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారులు అక్కడకు చేరుకుంటారని పేర్కొన్నారు. గురువారం ఉదయం ఐదున్నరకే మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఆటైంకు అభ్యర్థుల ఏజెంట్లు పోలింగ్ కేంద్రంలో ఉండాలని అధికారులు ఆదేశించారు. పోలింగ్ ఏజెంట్లు ఈవీఎంలను టచ్ చేయడానికి వీల్లేదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అందరి సమక్షంలో మాక్ పోలింగ్ జరిగిన తర్వాత ఉదయం ఏడు గంటలకు సాధారణ పోలింగ్ పక్రియ మొదలు కానుంది. గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం ఐదు వరకు పోలింగ్ జరగనుంది. నక్సల్స్ ప్రభావిత 13 నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిస్తారు మిగతా ప్రాంతాల్లో ఐదు గంటల వరకు పోలింగ్ పక్రియ కొనసాగనుంది. ఐదు గంటల వరకు క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసుకునే హక్కు ఉంటుంది.పోలింగ్ కోసం ఎన్నికల సంఘం ఈసారి విస్తృత ఏర్పాట్లు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడ దివ్యాంగుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంది. వారు ఓటు వేసి వెళ్లేందుకు వీలుగా 21 ,686 వీల్ఛైర్లు ఏర్పాటు చేసింది. 80 ఏళ్లుపైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం కూడా కల్పిస్తోంది. ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు పంపిణీ చేసింది. దివ్యాంగుల కోసం బ్రెయిలీ లిపి ఉన్న ఓటరు స్లిప్లను పంపిణీ చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 644 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 120పైగా కేంద్రాలను దివ్యాంగులే నిర్వహించనున్నారు. మరో ఆరువందల కేంద్రాలను మహిళలు నిర్వహించనున్నారు. ఎన్నికల కోసం 375 కంపెనీల సాయుధ బలగాలు, 50వేల మంది స్థానిక పోలీసులను ఎన్నికల సంఘ వినియోగిస్తోంది. ఓటరు స్లిప్లను మాత్రం గుర్తింపు కార్డుగా పరిగణలోకి తీసుకోమని… ఓటరు ఐడీ కానీ వేరే ఇతర 12 రకాల ఐడీలు కానీ ఉండాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటరు స్లిప్పులపై ఎలాంటి గుర్తులు ఉండటానికి వీల్లేదని చెప్పింది. అలాంటి వాటిని మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి అనుమతి ఇస్తామని లేకుంటే తిరస్కరిస్తామని పేర్కొంది. ఓటు వేసేందుకు వచ్చిన వాళ్లు ఎవరూ ఫోన్లు తీసుకురావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఓట్లు వేసినప్పుడు సెల్ఫీలు, ఇతర ఫొటోలు తీయడానికి కూడా వీల్లేదని చెబుతున్నారు. అలాంటి ప్రయత్నాలు చేసిన వాళ్లు కచ్చితంగా శిక్షార్హులు అవుతారని హెచ్చరిస్తున్నారు.