ఉపవాసం.. లాభ – నష్టాలు

ఒక క్రమం ప్రకారం ఉపవాసం చెయ్యటం వల్ల ఆరోగ్యపరంగా గొప్ప ప్రయోజనాలున్నాయని ఇటీవలి కాలంలో వైద్యపరిశోధనారంగం బలంగా విశ్వసించటం ఆరంభించింది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అధ్యయనాలూ కొత్తవిషయాలను వెలుగులోకి తెస్తున్నాయి.
ఉపవాసం..
అనాది కాలంగా వస్తున్న ఈ ఉపవాసం అలవాటుకు ఇప్పుడు శాస్త్ర పరిశోధనలూ అండగా నిలబడుతున్నాయి. ఉపవాసం ఒంటికి మంచిదనీ, లంఖణం పరమౌషధమనీ చాలాకాలంగా వింటూనే ఉన్నాం. ముప్పూటలా సుష్ఠుగా తినే వారికంటే ‘అర్థాకలితో ఉండే వారికి ఆయుర్దాయం ఎక్కువని’ చెప్పుకోవటమూ తెలిసిందే. అయితే ఆధునిక శాస్త్ర పరిశోధనలు కూడా క్రమేపీ ఈ భావనలకు బలం చేకూరుస్తుండటం తాజా విశేషం. రోజులోనో, వారంలోనో అప్పుడప్పుడు.. ఒక క్రమం ప్రకారం కొన్ని గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండటం వల్ల (దీన్నే వైద్యపరిభాషలో ఇప్పుడు ‘ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ – ఐఎఫ్‌’ అంటున్నారు) శరీరంలో ఎన్నో మంచి మార్పులు చోటు చేసుకుంటున్నాయని, అలాగే జబ్బులను తెచ్చిపెట్టే దుష్ప్రభావాలూ తగ్గుతున్నాయని పరిశోధకులు ఇటీవలి కాలంలో నిర్ధారణకు వస్తున్నారు. అప్పుడప్పుడు చేసే ఉపవాసాల (ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌) వల్ల శరీరంలో ఎన్నో గుణాత్మకమైన మార్పులు వస్తున్నాయని నిర్ధారణకు వచ్చారు.
ఉపవాసం చెయ్యటం బరువు ఎక్కువగా ఉన్నవారు తగ్గేందుకు దోహదం చెయ్యటమేకాదు.. ఒంట్లో గ్లూకోజు నిరోధకత తగ్గి, మధుమేహం బారినపడే అవకాశాలు తగ్గుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. అలాగే అధిక రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం, కొలెస్ట్రాల్‌ స్థాయులూ తగ్గుతున్నాయని గ్రహించారు. వీటన్నింటి ఫలితంగా గుండె జబ్బు, పక్షవాతం వంటి వ్యాధుల బారినపడే అవకాశాలూ తగ్గుతున్నాయని వీరు క్రమేపీ గుర్తిస్తున్నారు. జంతువులపై చేసిన ప్రయోగాల్లో- ఉపవాసం వల్ల వాటి ఆయుర్దాయం పెరగటమే కాకుండా నాడీమండల వ్యాధులూ, ముఖ్యంగా ఆల్జిమర్స్‌, పార్కిన్సన్స్‌ వంటి వ్యాధులు దరిజేరే అవకాశాలూ తగ్గుతున్నాయని ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఏజింగ్‌’ పరిశోధనల్లో వెల్లడవటం విశేషం.
చాలామంది ఒకపూట ఆహారం తీసుకోకపోతే డీలాపడిపోతామని భావిస్తుంటారుగానీ వాస్తవానికి మనం తీసుకునే ఆహారం ఇప్పటికిప్పుడే శక్తిగా మారిపోయి, మనకు వెంటనే అందుబాటులోకి రాదు. మనం తిన్న ఆహారం రెండుమూడు గంటల్లో జీర్ణమై, రక్తంలో కలిసి ప్రయాణించి, కాలేయంలో గానీ, కండరాల్లో గానీ కొవ్వులా నిల్వ ఉంటుంది. ఎలాగంటే ఆహారంలోని పిండి పదార్ధాలు గ్లూకోజుగా మారి, రక్తంలోకి వెళ్లి కాలేయంలో గానీ, కండరాల్లో గానీ గ్లైకోజెన్‌గా నిల్వ ఉంటాయి. అలాగే కొవ్వు పదార్ధాలు ఫ్యాటీ ఆమ్లాలుగా మారి, అంతిమంగా ట్క్రెగ్లిజరైడ్లగానో, కొలెస్ట్రాల్‌గానో మారతాయి. మాంసక త్తులు అమైనో ఆమ్లాలుగా మారి, రక్తంలోకి వెళ్లి రకరకాల ప్రోటీన్లుగా మారతాయి. ఇలా మనం తీసుకున్నవన్నీ రకరకాల రూపాల్లో మారి, శరీరంలో నిల్వ ఉంటాయి. దీన్ని ‘పోస్ట్‌ అబ్జార్బిటివ్‌ ఫేజ్‌’ అంటారు. ఇలా నిల్వ ఉంచుకున్న వాటినే మన శరీరం శక్తి అవసరాలకు వాడుకుంటుంది. కాబట్టి కొన్ని గంటల పాటు మనం ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉంటే- మన శరీరం తన శక్తి అవసరాల కోసం కండరాల్లో, కాలేయంలో, కొవ్వులో అప్పటికే దాచుకున్న నిల్వలను కరిగించుకోవటం మీద ఆధారపడటం మొదలుపెడుతుంది. కాబట్టి శక్తి లభ్యతకు ఇబ్బందేమీ ఉండదు. రెండోది- ఉపవాసం ఆరంభమై, శరీరానికి ఆహార లభ్యత ఆగిపోగానే మెదడు దాన్నొక సవాల్‌గా స్వీకరిస్తుంది. వెంటనే ఈ ఒత్తిడి పరిస్థితిని నెగ్గుకొచ్చేందుకు తక్షణ చర్యలు తీసుకునే క్రమంలో ఒంట్లో వ్యాధుల ముప్పు తగ్గించే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పరిశోధనల్లో గుర్తించారు. మెదడులో ప్రోటీన్ల తయారీ మెరుగై, నాడీకణాల్లో మైటోకాండ్రియా కూడా పెరుగుతూ, నాడీకణాల మధ్య సంబంధాలూ మెరుగవుతున్నాయి. దీనివల్ల మెదడు పనితీరు, విషయగ్రహణ శక్తి మెరుగవ్వటమే కాదు, పార్కిన్సన్స్‌, ఆల్జిమర్స్‌ వంటి వ్యాధుల ముప్పూ తగ్గుతోందని డాక్టర్‌ మాట్‌సన్‌ బందం నిర్ధారణకు వచ్చింది.
వైద్య పరిశోధనా రంగం ఈ ఉపవాసం (ఐఎఫ్‌) అనేది ఎలా చేస్తే ఫలితాలు బాగుంటున్నాయన్న దానిపై ఇంకా ఒక కచ్చితమైన నిర్ధారణకు రాలేదనే చెప్పాలి. ఆహారాన్ని కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవటంమంచిదన్నది ప్రామాణికమైన సిఫార్సు. అందులో తేడా ఏమీ లేదు. రోజూ అలా పాటిస్తూ, మధ్యమధ్యలో ఒక రోజు 6, 12, 24.. ఇలా కొన్ని గంటల పాటు ఆహారం మానెయ్యటం లేదా వారంలో రెండు రోజులు బాగా తగ్గించెయ్యటం వరకూ.. రకరకాలుగా అధ్యయనాలు చేస్తున్నారు. మొత్తమ్మీద వారంలో 5 రోజులు సాధారణ ఆహారం తీసుకుంటూ 2 రోజులు చాలా పరిమితంగా తీసుకునే ఉపవాస విధానం ఎక్కువ ప్రాచుర్యంలోకి వస్తోంది. అలాగే ఉపవాస సమయంలో ఒంట్లో నీరు తగ్గకుండా చూసుకోవటం కూడా ముఖ్యమే.
ఉపవాసం మూలంగా రక్తంలో ఆక్సీకరణ ఒత్తిడి, వాపు ప్రక్రియల సూచికలు తగ్గుతున్నట్టు.. ఇవి వ ద్ధాప్యం, వద్ధాప్యంతో ముంచుకొచ్చే సమస్యల ముప్పు తగ్గుతుందనటానికి నిదర్శనాలని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మొదట్లో ఆహారం ఏకబిగిన అరపూట, పూట మానేసే కంటే కొద్ది గంటల పాటు మానేస్తూ క్రమేపీ శరీరానికి అలవాటు చెయ్యటం మంచిది. ఉపవాసం తర్వాత తీసుకునే ఆహారం తేలికగా ఉంటే మంచిది. ఎక్కువ పండ్లు, కూరగాయలు, తేలికపాటి మాంసం వంటివి ఉండేలా చూసుకోవాలి. ఉపవాసం ముగిస్తున్నామని ఆబగా తినెయ్యకుండా.. మిగతా రోజుల్లో ఎలా తీసుకుంటారో ఆ రోజూ అలాగే తినాలి. ఇలా నాలుగైదు వారాలు ప్రయత్నించే సరికి శరీరం ఉపవాసం, ఆ కొత్త దినచర్యకు అలవాటు పడుతుంది. ఆ తర్వాత ఉపవాసం ఉల్లాసంగా గడుస్తుంది.
వీరు వద్దేవద్దు
చిన్నపిల్లలు, అరవై ఏళ్లు పైబడిన వద్ధులు, గర్భిణులు, పాలిస్తున్న తల్లులు, బరువు తక్కువగా ఉన్నవాళ్లు, మధుమేహలు… వీరంతా ఉపవాసాలు చెయ్యకూడదు. అలాగే ఇతరత్రా ఆరోగ్య సమస్యలేవైనా ఉన్నవారు కూడా వైద్యులతో చర్చించిన తర్వాతే ఉపవాసం గురించి ఆలోచించాలి.
మధుమేహులకూ వద్దు! ఎందుకంటే…
మధుమేహం అనేది ఒక ప్రత్యేకమైన దేహస్థితి. మధుమేహం ఉన్నవాళ్లు అంతా సక్రమంగానే తింటున్నా కూడా వాళ్లు తీసుకున్న ఆహారం మొత్తాన్ని శరీరం పూర్తిగా వినియోగించుకునే పరిస్థితి ఉండదు. అందుకే మధుమేహులకు ఏదైనా సర్జరీ వంటివి చెయ్యాల్సి వచ్చి, గంటలతరబడి ఆహారం ఇవ్వకూడని పరిస్థితి ఎదురైనా కూడా ఒకవైపు నుంచి గ్లూకోజు ఎక్కిస్తూ, మరోవ్కెపు ఇన్సులిన్‌ ఇంజక్షన్లు ఇస్తారు. ఎప్పుడ్కెనా సరే, మధుమేహులు గంటల తరబడి ఆహారానికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఇలాంటి జాగ్రత్తలన్నీ అవసరం. కాబట్టి మధుమేహులు ఉపవాసం చెయ్యకుండా ఉండటం అవసరం. కాబట్టి మధుమేహం లేనివారు, త్వరలో మధుమేహం వచ్చే అవకాశం ఉన్నవారు.. అప్పుడప్పుడు ఒక క్రమపద్ధతిలో ఉపవాసం చెయ్యటం మంచిదని గుర్తించాలి.
—————————————————-