మీ సంగతి మీరు చూసుకోండి

పాక్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలకు భారత్ హెచ్చరిక

న్యూఢిల్లీ: మైనారిటీలపై భారత్ పక్షపాత వైఖరిని అవలంబిస్తోందన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను భారత ప్రభుత్వం తిప్పికొట్టింది. ఇది, పాక్ అంతర్గత సమస్యల నుంచి దృష్టి మళ్లించటానికి ఆ ప్రభుత్వం చేస్తున్న అసంబద్ధమైన ప్రయత్నమని భారత్ పేర్కొంది.“తమ కొవిడ్-19 విధానం పై చెలరేగుతున్న విమర్శల నుంచి తప్పించుకొనేందుకు మోదీ ప్రభుత్వం ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వక, హింసాత్మక వైఖరిని అవలంబిస్తోంది. దీనితో వేల మంది ఆకలితో, నిరాశ్రయులై భాధపడుతున్నారు. ఇది జర్మనీలో నాజీలు యూదుల పై అవలంబించిన విధానం మాదిరిగా ఉంది. ఇది మోదీ ప్రభుత్వ హిందుత్వ విధానానికి మరో ఉదాహరణ” ఇటీవల పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ట్విటర్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందుకు విదేశీ వ్యవహారాల శాఖ అధికారిక ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ స్పందిస్తూ… “పాక్ నాయకత్వం వారి అంతర్గత సమస్యలను ఎదుర్కోవటంతో విఫలమైంది. కొవిడ్- 19ను ఏ విధంగా నివారించాలి అనే అంశం పై దృష్టి సారించటం మాని… పొరుగు దేశాల పై ఈ విధంగా ఆధారంలేని ఆరోపణలకు దిగుతోంది” అని జవాబిచ్చారు. పాక్ లో మైనారిటీలుగా ఉన్న హిందువులను గురించి మాట్లాడుతూ… “ఇక మైనారిటీల విషయానికి వస్తే… వారి దేశంలో ఉన్న మైనారిటీలే నిజంగా వివక్షకు గురవుతున్నారు. కనుక పాక్ ప్రభుత్వం వారి కష్టాల పట్ల శ్రద్ధ వహిస్తే బాగుంటుంది.” అని శ్రీవాత్సవ తిప్పికొట్టారు. దేశంలోని ముస్లింల పట్ల భారత ప్రభుత్వ వైఖరి పై ఇమ్రాన్ ఖాన్ ఇటీవల అదేపనిగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ విధమైన పాక్ వైఖరి భారత అంతర్గత వ్యవహారంలో అనవసర జోక్యమేనని భారత్ దీటుగా జవాబిస్తూ వస్తోంది. అంతేకాకుండా, పాక్ గడ్డపై పుట్టి పొరుగు దేశాల్లో విస్తరిస్తున్న సరిహద్దు ఉగ్రవాదాన్ని మొదట అరికట్టాలంటూ పాకిస్థాన్‌కు భారత్ ఈ సందర్భంగా హితవు పలికింది.