భారత్ కు ప్రపంచ బ్యాంక్ సహాయం

రూ.7,600 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ (కొవిడ్-19) వ్యతిరేక పోరాటానికి గానూ ప్రపంచ బ్యాంకు 1 బిలియన్ డాలర్ల (రూ.7,600 కోట్లు) భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 25 అభివృద్ధి చెందుతున్న దేశాలకు కేటాయించిన అత్యవసర సహాయ నిధిలో తొలివిడతగా 1.9 బిలియన్ డాలర్లను సంస్థ విడుదల చేయనుంది. ఈ నిధులతో 40 దేశాల్లో కరోనా నిరోధక ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. కాగా, ఇందులో అధిక భాగం అంటే 1 బిలియన్ డాలర్లను భారత్ కు కేటాయించింది. భారత్ లో ఇప్పటివరకు సుమారు 2,100 కేసులు నమోదుకాగా… 56 మరణాలు సంభవించాయి. ఇక జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్న భారత్ లో కరోనా వ్యాప్తి మూడో దశకు చేరుకుంటే… ఆ ప్రభావం ఊహించలేనంత దారుణంగా ఉ ంటుంది. ఈ నేపథ్యంలో కొవిడ్-19కు సంబంధించి ఉత్తమ నిర్ధారణ, అనుమానితుల ఆచూకీ, ప్రయోగాలు, వ్యాధి నియంత్రణ సామగ్రి కొనుగోలు, కొత్త ఐసొలేషన్ వార్డుల నిర్మాణం వంటి పనులకు వాడేందుకు తాము ఈ నిధిని మంజూరు చేసినట్టు ప్రపంచ బ్యాంకు తెలిపింది. కరోనా వ్యాప్తి నివారణకు ప్రపంచ దేశాలు లాక్ డౌనను పాటిస్తున్న నేపథ్యంలో అనేక సేవలకు, సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో బాధితులకు ప్రభుత్వాల ద్వారా అత్యవసర వైద్య సామగ్రి అందించేందుకు కూడా ప్రపంచ బ్యాంకు కృషిచేస్తోంది. కొవిడ్ 19ను ఎదుర్కొనేందుకు 12 బిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రపంచ బ్యాంకు ఇటీవల ప్రకటించింది. సహాయం కోరిన దేశాలకు ఎనిమిది బిలియన్ డాలర్లు అందచేస్తామని సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, కరోనా ముప్పును ఎదుర్కోవటం కష్టసాధ్యంగా పరిణమించిన పేదదేశాలను గుర్తిస్తున్నామని ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు దేవిడ్ మలాస్ తెలిపారు.