టమాటా రైతు కంట నీరు

తెలంగాణలో గిట్టుబాటు ధర దొరకక పంటను అక్కడే వదిలేస్తున్న రైతన్న

-పెట్టిన పెట్టుబడులు కూడా దక్కించుకోలేని దైన్యం -లాక్ ఔట్ దెబ్బకు టమాటా రైతు విలవిల కనీస మద్దతు ధర రూ.2 కూడా దక్కని పరిస్థితి పొరుగు రాష్ట్రాలకు నిలిచిపోయిన పంట ఇళ్లనుంచి బయటకు రాని జనాలు అటు హెల్ సేల్ ఇటు రిటైల్ అమ్మకాలపై ప్రభావం దిగుబడి పుష్కలం అమ్మకాలు నిల్

హైదరాబాద్: గ్రేటర్ సిటీ చుట్టుపక్కల జిల్లాలలో కూరగాయల సాగుకు పెట్టింది పేరు. ముఖ్యంగా టమాట గణనీయంగా సాగవుతోంది. అక్కడి టమాట రైతులను కదిలిస్తే కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. మూడు నెలలపాటు శ్రమిస్తే.. వారికి నష్టాలే మిగిలాయి. టమాటను తెంపినా.. తెంపకపోయినా పెట్టుబడులూ వెళ్లని దుర్భరస్థితి. కరోనా కాటు నేపథ్యంలో విధించిన లాక్ డౌన్.. అమాంతం టమాట రైతుల పొట్టకొడుతోంది. ఎంతో ఆశతో పంట సాగుచేసిన రైతులు ధరలు లేక దిగాలు చెందుతున్నారు. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే రబీ సీజన్లో సుమారు 20 వేల ఎకరాల్లో వివిధ రకాల కూరగాయల పంటలను రైతులు చేశారు. ఇందులో ఎక్కువ భాగం టమాటదే. 7,752 ఎకరాల్లో ఆరు వేల మంది రైతులు టమాట సాగు చేశారు. గరిష్టంగా 8 టన్నుల దిగుబడి వస్తుంది. కనిష్టంగా ఆరు టన్నుల పంట తీయవచ్చు. ఇలా ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 62 వేల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ప్రస్తుతం పెద్ద ఎత్తున పంట మార్కెట్ కు వస్తోంది. అయితే, ధర లేకపోవడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. కిలో టమాటకు కనీసం రూ.3 కూడా దక్కడం లేదు. 25 కిలోలు ఉండే బాక్సును మార్కెట్లోకి తీసుకెళ్తే… కనీసం రూ.40 కూడా దక్కని దయనీయ పరిస్థితులు ఉన్నాయి. రూ.40 వేల పెట్టుబడి పెట్టి ఒక్కో ఎకరాలో సాగు చేసిన రైతుకు.. పెట్టుబడుల్లో కనీసం నాలుగో వంతు కూడా రావడం లేదు. తెంపిన కూలీ, మార్కెట్‌కు రవాణా ఖర్చులు కూడా వెళ్లడం లేదు. దీంతో చాలా మంది రైతులు తెంపకుండా పంటను వదిలేశారు. షాబాద్ మండలం కేశవగూడలో చేనులోనే టమాటాలను రైతులు వదిలేసి వెళ్లిపోవడం అక్కడి వారి దైన్య స్థితిని తెలియజేస్తోంది. ఎందుకీ పరిస్థితి..? సాధారణంగా వేసవిలో టమాటకు చెప్పుకోదగ్గ రీతిలో ధర ఉంటుంది. లాక్ డౌన్ కొనసాగుతుండటమే ధరలు లేదని మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలో వచ్చిన దిగుబడిలో 50 శాతం నగరంలోని గుడిమల్కాపూర్, బోయినపల్లి, కొత్తపేట రైతుబజార్, ఎన్టీఆర్ నగర్ మార్కెట్ కి వెళ్తుంది. ఇక్కడ నగర అవరాలకుపోను మిగిలింది ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. మిగిలిన 50 శాతం పంటలో కొంత జిల్లా ప్రజల అవసరాలకుపోను.. తక్కింది నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు రైతులు తీసుకెళ్తారు. లాక్ డౌన్ కావడంతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. నగరంలో నివసించే వారిలో చాలామంది తమ సొంతూళ్లకు వెళ్లారు. అలాగే శుభకార్యాలు కూడా వాయిదా పడ్డాయి. అంతేగాక గత రబీ సీజన్లో పోల్చితే ఈ సారి దాదాపు 1,300 ఎకరాల్లో అధికంగా పంట సాగైంది. దీంతో డిమాండ్ తక్కువగా ఉండి.. దిగుబడి ఎక్కువైంది. పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదు చేవెళ్ల మండలం కుమ్మెర గ్రామానికి చెందిన రైతు వీరేశం ఎకరం విస్తీర్ణంలో వంకాయలు, రెండు ఎకరాల్లో టమాట పంట సాగుచేశాడు. రూ.50వేలకు పైగానే పెట్టుబడికింద ఖర్చు చేశాడు. వేసవి కాలం పెళ్లిళ్లు ఎక్కువగా ఉంటాయని, ఈ సీజన్లో కూరగాయలకు మంచి డిమాండ్ ఉంటుందని భావించాడు. బోరుబావిలో నీళ్లు తగ్గుతున్నా రోజు విడిచి రోజు ఎంతో కష్టపడి పంటలను బతికించుకుంటూ వచ్చాడు. ప్రస్తుతం దిగుబడులు వస్తున్నాయి. కానీ, మార్కెట్లో ధరలు లేవు. వంకాయ కిలో రూ.5లోపే పలుకుతోంది. టమాటలు సైతం కిలో రూ.3 నుంచి రూ.5 పలుకుతున్నాయి. కూరగాయలను మార్కెట్‌కు తీసుకువస్తే కనీసం రవాణా ఖర్చులు కూడా రావటం లేదు. లాక్ డౌన్ కారణంగా కూరగాయలు బయట మార్కెట్లకు పోవటం లేదు. వ్యాపారులు కూడా రావటం లేదు. స్థానిక మార్కెట్లో కొంత మంది రైతులవి చిరువ్యాపారులు కొంటున్నారు. దీంతో కొన్ని మాత్రమే అమ్ముడుపోతున్నాయి. ఎంతో కష్టపడి పంట సాగుచేస్తే ఖర్చులు కూడా రావడం లేదని వీరేశం ఆవేదన వ్యక్తం చేశాడు. బాక్స్ ధర రూ.150 పలికితేనే రైతుకు ఊరట నందిగామ మండలం శ్రీనివాసులగూడెం గ్రామానికి చెందిన రైతు ఎల్.మల్లారెడ్డి రెండు ఎకరాల్లో టమాట పంట సాగు చేశాడు. ప్రస్తుతం దిగుబడి వస్తోంది. చేవెళ్ల మార్కెట్ కు గురువారం 57 టమాట బాన్లను తీసుకొచ్చాడు. మార్కెట్లో ఒక బాక్స్(25కిలోలు) రూ.60కి అమ్ముడుపోగా.. మార్కెట్ ఫీజులు, హమాలీపోను ఆయన చేతికి రూ.3వేలు వచ్చాయి. ఇంకా ఆటో కిరాయి వెయ్యి రూపాయలు, టమాటలు తెంపిన కూలీలకు వెయ్యి రూపాయలు పోతే మిగిలింది చివరకు ఆయన మిగిలింది వెయ్యి రూపాయలే. రెండు ఎకరాల టమాట పంటను సాగు చేసేందుకు దాదాపు 30 వేలకుపైగా ఖర్చుచేశాడు. ఇవే ధరలు ఉంటే అతని చేతికి వచ్చేది దాదాపు 5వేలే. ఈ ఐదు వేలలో.. తాను పెట్టిన పెట్టుబడులు రావాలి, కుటుంబం గడవాలి. ఎలా సాధ్యమవుతుందని మల్లారెడ్డి వాపోయాడు. బాక్స్ టామాట ధర కనీసం రూ.150 పలికితే పెట్టిన పెట్టుబడులైనా వస్తాయని అన్నాడు.