బడ్జెట్‌పై ఎవరేమన్నారు..

నిరుద్యోగుల ఊసేది?: రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ: శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పెదవి విరిచారు. దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య నిరుద్యోగం అని, అయితే కేంద్ర బడ్జెట్‌లో నిరుద్యోగానికి ప్రాధాన్యతే లేదని రాహుల్‌ అన్నారు. నిర్మలా బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ”దేశం ముందు అతిపెద్ద సవాల్‌ నిరుద్యోగం. అయితే దీన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద ఒక్క వ్యూహాత్మక ఆలోచన లేదు. కేంద్ర ప్రభుత్వ ధోరణి ఇదే. ఈ బడ్జెట్‌ ప్రభుత్వ పని తీరుకు అద్దం పడుతోంది. ప్రభుత్వంలో ఉన్నవారంతా మాట్లాడే వారే. కానీ పని చేసే వారే లేదు” అని రాహుల్‌ అన్నారు.
బడ్జెట్‌ చాలా నిరాశపరిచింది: విజయసాయి
దిల్లీ: తాజా బడ్జెట్‌ చాలా నిరాశ పరిచిందని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మొండిచేయి చూపించిందన్నారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్‌లో కొన్ని సానుకూల, ప్రతికూల అంశాలున్నట్లు చెప్పారు. ప్రత్యేకహోదా కోసం ఎదురుచూసినప్పటికీ నిరాశే ఎదురైందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు త్వరితగతిన నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. బడ్జెట్‌ ప్రసంగంలో వెనుకబడిన 7 జిల్లాల నిధుల ప్రస్తావన లేదని, ఏపీకి జరిగిన అన్యాయాన్ని బడ్జెట్‌ సమావేశాల్లో ప్రస్తావిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.
సవతి తల్లి ప్రేమను చూపించారు: కేజ్రీవాల్‌
”ఈ బడ్జెట్‌పై దిల్లీ చాలా అంచనాలు పెట్టుకుంది. కానీ మా పట్ల మరోసారి సవతి తల్లి ప్రేమను చూపించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్‌ తీవ్ర నిరాశకు గురి చేసింది. దిల్లీ ముఖ్యం కాదని భాజపా నిరూపించింది”.- దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌
సమతుల్య బడ్జెట్‌: కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సమతుల్యంగా ఉందని మరో మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. శనివారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. తాజా బడ్జెట్‌ వచ్చే దశాబ్ద కాలంలో భారత్‌ను 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ముందుకు తీసుకెళ్తుందని అభిప్రాయపడ్డారు. అటు ఆర్థికంగా, ఇటు సంక్షేమపరంగా భారీగా ఉందన్నారు. ఎల్‌ఐసీ లిస్టింగ్‌కు వెళ్లడం వల్ల పారదర్శకత, బాధ్యత మరింత పెరుగుతుందని అన్నారు.
ఆదాయపన్ను చట్టంలో మార్పులు చేశాం: రెవెన్యూ కార్యదర్శి
తాజా బడ్జెట్‌లో ఆదాయపన్ను చట్టంలో మార్పులు చేసినట్లు కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఒక వ్యక్తి 182 రోజుల పాటు విదేశాల్లో ఉంటే ఆ వ్యక్తిని ఎన్‌ఆర్‌ఐగా పరిగణిస్తున్నారని ఇప్పుడు ఆ వ్యవధిని 240రోజులకు పెంచినట్లు తెలిపారు. కొందరు వ్యక్తులకు స్థిరమైన నివాసం అంటూ ఏదీ ఉండదని, కొన్ని రోజులు వాళ్లు వివిధ దేశాల్లో ఉంటారని తెలిపారు. అలా ఒక భారతీయ పౌరుడు ఏ దేశానికీ చెందిన వాడు కాకపోతే అలాంటి వ్యక్తులను భారతీయ పౌరులుగా గుర్తించి, ప్రపంచవ్యాప్తంగా వారికి వచ్చే ఆదాయంపై పన్ను వేస్తామని తెలిపారు.
జగన్‌ చర్యల వలనే నిధులు రాలేదు: యనమల
సీఎం జగన్‌ తుగ్లక్‌ చర్యల వల్లే కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు నిధులు కేటాయించలేదని తెదేపా నేత యనమల రామకష్ణుడు ఆరోపించారు. ‘వైకాపా అవినీతి, అసమర్థ నిర్వాకాలతో రాష్ట్రానికి తీరని నష్టం కలిగింది. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో జగన్‌ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది. కేంద్రం నుంచి నిధులు రాబట్టే సామర్థ్యం సీఎం జగన్‌లో కొరవడింది. కేంద్రాన్ని మెప్పించి నిధులు రాబట్టడంలో ఘోరంగా విఫలం చెందారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకాల వల్లే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి రిక్తహస్తం. విభజన చట్టం ప్రకారం నిధులు కూడా తెచ్చుకోలేకపోయారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి సంజాయిషీ ఇవ్వాలి” అని యనమల వ్యాఖ్యానించారు.
కీమోథెరపీ కాదు.. ఇమ్యూనోథెరపీ కావాలి: కిరణ్‌ ముజుందార్‌ షా
వరుసగా రెండోసారి కేంద్రంలో కొలువుదీరిన నరేంద్ర మోదీ సర్కారు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆవిష్కరించింది. కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ రెండోసారి బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక దిగ్గజం, బయోకాన్‌ చీఫ్‌ కిరణ్‌ ముజుందార్‌ షా నూతన బడ్జెట్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను కాన్యర్‌తో పోలుస్తూ వైద్య పరిభాషలో ఆసక్తికర ట్వీట్‌ చేశారు.
ఈ మేరకు… ”మన ఆర్థిక క్యాన్సర్‌కు కీమోథెరపీ కాదు.. ఇమ్యూనోథెరపీ కావాలి. మనం గాయాల గురించి కాదు… దానికి కారణమైన వాటి గురించి ఆలోచించాలి. బడ్జెట్‌ 2020 ఇలాంటి విధానాన్ని కలిగి ఉంటుందని ఆశిస్తున్నా. మన ఆర్థిక నిరోధక వ్యవ్యస్థలో సంపద స ష్టి అనేది కీలకమైనది! ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఏం చెబుతారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఆర్థిక క్యాన్సర్‌పై ద్రవ్య విధానం కచ్చితంగా ప్రభావం చూపుతుంది. మౌలిక వసతులు, ఆరోగ్యం, విద్య తదితర అంశాలు ఇమ్యూనోథెరపీలో టీ సెల్స్‌ వంటివి” అని కిరణ్‌ ముజుందార్‌ షా ట్విటర్‌లో పేర్కొన్నారు.