మిద్దెలపై పండించేద్దాం

ఒకప్పుడు డాబా మీదికి వెళ్తే… ఓ పక్కన మెట్ల మీదుగా పైకి పాకిన సన్నజాజి తీగ విరబూసి కన్పించేది. పెరటి వైపునుంచీ సపోటా చెట్టు కొమ్మో, జామచెట్టు కొమ్మో పలకరించేవి. కొబ్బరాకులు గాలికి ఊగుతూ చీకట్లో భయపెట్టేవి. పక్కింటి వారి మామిడి కొమ్మ ఒకటి అలా అందీ అందనట్లు పిట్టగోడను తాకుతుంటే లేత పిందెలు ఊరించేవి. చాపో పరుపో వేసుకుని పడుకుంటే పైన చందమామా చుట్టూ చల్లని గాలీ… హాయిగా నిద్రపట్టేసేది. ఇప్పుడో… నీళ్ల ట్యాంకులకు తోడు రకరకాల సైజుల్లో డిష్‌ యాంటెన్నాలూ, స్విచ్‌బాక్సులూ, సెల్‌ఫోన్‌ టవర్లూ, కేబుల్‌ వైర్లతో గందరగోళానికి అర్థంలా ఉంటాయి డాబాలు. అక్కడికి వెళ్లి ప్రకతిని ఆస్వాదించే తీరికా, శుభ్రంచేసి ఉపయోగించుకునే ఓపికా ఉన్నవారు అద ష్టవంతులే. ఇక అపార్ట్‌మెంట్లకైతే పైకప్పు మీద ఏ ఒక్కరి హక్కూ ఉండదు. అది సమష్టి సొత్తు కావడంతో ఎవరికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తోంది అన్నట్లు తయారైంది నగరాల్లో డాబాల పరిస్థితి.

ఒక్క హైదరాబాదునే తీసుకుంటే అక్కడ ఉన్న భవనాల పైకప్పు దాదాపు 40వేల ఎకరాల వైశాల్యం ఉంటుందట. అందులో సగం విస్తీర్ణాన్ని కూరగాయల పెంపకానికి ఉపయోగించినా ఎన్నో సమస్యలు తీరతాయంటున్నారు ఉద్యానవన నిపుణులు. రసాయన ఎరువులూ క్రిమిసంహారకాలూ వాడని తాజా కూరగాయలు తక్కువ ఖర్చులో లభిస్తాయి. కేవలం 200చ.మీ. స్థలం ఉంటే అందులో ఒక్క కూరగాయలే కాదు, పండ్లూ, పూలూ చాలా పండించవచ్చు.

క్రీస్తు పూర్వమే… డాబాపైన మొక్కలు పెంచడమనేది ఇప్పుడు కొత్తగా కనిపెట్టిన విషయమేమీ కాదు. క్రీస్తుపూర్వం మెసపొటేమియా నాగరికత నాటికే ఈ పద్ధతి ఉందట. భవనం అందంగా కనిపించడం కోసం రోమన్లు ముందువైపు ఇంటి పైకప్పు ప్రత్యేకంగా కట్టించి దాని మీద మొక్కలు పెంచి పూల తీగెలు కిందికి వేలాడేలా చేసేవారట. రోమ్‌, ఈజిప్టు లాంటి చోట్ల పురావస్తు తవ్వకాల్లో బయటపడిన పలు భవనాల్లో ఇలాంటి పైకప్పు తోటలు కన్పించాయని చరిత్ర చెబుతోంది. పురాతన ప్రపంచానికి చెందిన ఏడు వింతల్లో ఒకటైన హ్యాంగింగ్‌ గార్డెన్స్‌ కూడా ఎత్తైన భవనాల మీద పెంచిన తోటలే. ఇప్పటికీ చాలా దేశాల్లోని నగరాల్లో చల్లదనం కోసమూ, మొక్కలు పెంచాలన్న కోరిక ఉండీ స్థలం లేనప్పుడూ డాబాలనే ఆశ్రయిస్తున్నారు. అయితే ఎక్కువగా లతలూ పూల మొక్కలకూ ప్రాధాన్యమిస్తున్నారు. గుబురుగా పచ్చని పొదలుగా ఎదిగే మొక్కల్నే పెంచుతున్నారు. ఆసక్తి ఉన్నవాళ్లు సరదాగా ఒకటీ అరా హైబ్రిడ్‌ పండ్లమొక్కలను పెంచినా కూరగాయల పెంపకానికి డాబాలను వాడడం అంతగా లేదు. అలాంటిది వాటి మీద కూరగాయలను పెంచడం ఈ మధ్య కాలంలోనే మొదలైంది. కొంతకాలం క్రితం వరకూ అక్కడక్కడా మాత్రమే కన్పించిన ఈ మిద్దె తోటలు సోషల్‌ మీడియావల్ల త్వరగా ప్రాచుర్యం పొందాయి. హైదరాబాద్‌, వైజాగ్‌ లాంటి నగరాల్లోనే కాక భద్రాచలం, కొత్తవలస లాంటి పట్టణాల్లోనూ వందలాది ఔత్సాహికులు మిద్దెతోటలను పెంచుతున్నారు.

పచ్చని పంటపొలాలను చూసినా.. ఆకుపచ్చని ఆకుకూరల తోటలు కనిపించినా.. రంగురంగుల పళ్లున్న చెట్లను చూసినా.. స్పందించని మనిషి ఉండడు. అలాంటి ఆకుపచ్చని వనాలను చూడగానే మనిషి మనసు ఎక్కడికో వెళ్లిపోతుంది. అయితే ఇదంతా పల్లెల్లోనే సాధ్యం.. పట్టణాల్లో ఇది సాధ్యం కాదు అన్నది నిన్నటి వరకూ వినిపించిన మాట. కానీ నేడు పట్టణాల్లో కొన్ని బాల్కనీల్లో పెరుగుతున్న మిద్దె తోటలను చూస్తే ఆ మాటే కాదు.. అసలు ఏ మాట నోటి వెంట రాదు. ఎందుకంటే.. ఇప్పుడు పట్టణాల్లోని అనేక రూఫ్‌లు పచ్చని మొక్కలతో కళకళలాడుతున్నాయి. టెర్రస్‌ ఫార్మింగ్‌ పేరుతో ఇంటిపైనే అన్ని పంటలనూ సాగు చేస్తున్నారు. అంతేకాదు.. రసాయనిక అవశేషాలు లేని ఆకుకూరలు, కాయగూరలు, పండ్లను పండిస్తూ ఆరోగ్యంగా జీవించవచ్చు.. ఏ నగరంలోనైనా వేల ఎకరాల మిద్దె ఉంటుంది. ఈనాడు గ్రామాల్లో కూడా మిద్దె విస్తీర్ణం తక్కువేమీ కాదు. మరి ఈ మిద్దెలన్నీ పచ్చగా మారితే.. ఇంటికి అవసరమైన, ఆరోగ్యకరమైన కూరగాయలు, పండ్లు ఉత్పత్తి చేస్తే లాభమే కాదు, నగర జీవితానికి సంబంధించిన అనేక సమస్యలను, ఒత్తిళ్లను కూడా అధిగమించవచ్చు. ప్రతి ఇంటివారు పూనుకోవాలే కానీ పెద్ద కష్టమేమీకాదు. సంపూర్ణ ఆరోగ్యానికి మంచి పోషకాలు ఉన్న పండ్లు, కూరగాయలు తీసుకోవడం తప్పనిసరి. రోగనిరోధకశక్తిని పెంచడానికి అవసరమైన పోషకాలను అందించడంలో పండ్లు, కూరగాయలు ప్రాముఖ్యతను వహిస్తాయి. బయట కొ నే కూరగాయలు, పండ్ల ధరలు ఎక్కువే కాదు.. ఇవి చాలా పెస్టిసైడ్స్‌తో నిండి ఉంటాయి. ఇలా కాకుండా కూరగాయలు, పండ్లను ఇంటిపైనగానీ, పెరడులో కానీ పెంచుకోవచ్చు. దీనివల్ల రసాయనాలు లేని తాజా రుచికరమైన కూరగాయలు, పండ్లను అతి తక్కువ ఖర్చుతో పొందవచ్చు. పెరటి తోటల పెంపకం వల్ల ఆరోగ్యమే కాకుండా, ఇంటి వారందరికీ తీరిక వేళలో మొక్కల మధ్య పనిచేయడం వల్ల మనోల్లాసం, ఆహ్లాదం లభిస్తుంది. చిన్నపిల్లలు కూడా పెరటి తోటలో పనిచేయడం ద్వారా క్రమశిక్షణ లభిస్తుంది. ముందుగా ఇంటిపైన స్థలాన్ని చెత్తా చెదారం లేకుండా శుభ్రం చేసుకోవాలి. నేల సారవంతం కోసం ఎర్రమట్టికానీ, నల్లమట్టి కానీ వేయించాలి. నేలను మడులుగా కట్టి మడుల మధ్య పార సహాయంతో మెత్తగా తవ్వాలి. ఇందులో ఒక చ.మీ.కి 25:500:125 గ్రాముల అమ్మోనియం సల్ఫేట్‌, సూపర్‌ ఫాస్పేట్‌, పొటాష్‌ ఎరువులను వేయాలి. యూరియా రెండు లేదా మూడు దఫాలుగా మొక్కల ఎదుగుదల దశలో 50 గ్రాముల చొప్పున వేయాలి. నేలకు వాతావరణానికి అనుకూలమైన మొక్కలను, కూరగాయలను ఎంచుకోవాలి. ఏక వార్షికాలు, తక్కువ స్థలంలో పెరిగే మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నీడనిచ్చే చెట్లను మిద్దెలపై పెంచుకోకూడదు. ఇలాంటివాటిని పెరడులో పెంచాలి. లెట్యూస్‌, స్పినాచ్‌, బీట్రూట్‌, టొమాటో, క్యాబేజీ, బెండ, టర్నిప్‌, ర్యాడిష్‌ మొదలైన మొక్కలు తక్కువ స్థలంలో పెరుగుతాయి.

ఎక్కువ పోషక విలువలు, రుచినందించే మొక్కలకు మిద్దెతోటలో ప్రాధాన్యం ఇవ్వాలి.

ఒకే కాలంలో వేయాల్సిన, ఏక వార్షికాలైన మొక్కలను ఒక సమూహంగా ఒక స్థలంలో వేరు వేరు మళ్ళల్లో వేయాలి. బహువార్షికాలైన మామిడి, ఆస్పరాగస్‌, రూబర్న్‌, మునగ వంటి వాటిని తోటలో మరొక వైపు స్థలంలో అంటే పెరడులో నాటుకోవాలి. దీనివల్ల చెట్ల నీడన ఇతర మొక్కలపై పడకుండా కాపాడవచ్చు. మొక్కల వరుసల మధ్య ఖాళీలు, మొక్కల పెరుగుదలకు సాగునీటి సౌలభ్యం, స్థలం.. సమర్థవంతమైన వినియోగానికి వీలు కల్పించడం ముఖ్యం. ఇలా మిద్దెతోటను ఆకుపచ్చని లోకంగా మలచుకోవచ్చు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ మొదటి అంతస్తును చేరగానే అక్కడ ఆకుపచ్చని లోకం పలకరిస్తుంది. అందులో పందిళ్లకు పాకిన రకరకాల పాదులు, అక్కడక్కడా పూల మొక్కలు, మధ్యలో ఆకుకూరల మడులు.. ఇలా ఒక్కమాటలో చెప్పాలంటే అదో అందమైన పార్కుగా మారుతుంది. చెట్ల మధ్య కూర్చోవడానికి చిన్న ఏర్పాటు కూడా చేసుకుంటే ఇక ఆనందమే ఆనందం.