పేదలకు ఉపయోగపడే పరిజ్ఞానం కావాలి : కేటీఆర్
హైదరాబాద్,జ్యోతిన్యూస్ :
ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానమైనా సమాజానికి, ముఖ్యంగా పేదలకు ఉపయోగపడాలనేదే సీఎం కేసీఆర్ అభిమతమ ని రాష్ట్ర ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న బయో ఆసియా సదస్సులో భాగంగా మంగళవారం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో వర్చువల్గా జరిగిన చర్చావేదికలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సామాన్యుల జీవితాలను ప్రభావితం చేయగలిగే సాంకేతికత అవసరమన్నారు. ఈ విషయంలో ఎటువంటి చొరవ అవసరమని సత్యనాదెళ్లను ప్రశ్నించారు. నాలెడ్జ్ వర్కర్లతో పాటు ఫ్రంట్ లైన్ వర్కర్లకు సాంకేతికత ఎనేబుల్ చేయటం సవాళ్లతో కూడుకుందని సత్యనాదెళ్ల సమాధానమిచ్చారు.ఈ తరుణంలో కొలాబరేషన్, వెల్ బీయింగ్, లర్నింగ్ ప్రాసెస్ మనల్ని మరింత సమర్థులుగా నిలబెడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్టార్టప్ ఎకో సిస్టం, ఆ దిశగా టీహబ్ చేస్తున్న కృషిని సత్యనాదెళ్ల ప్రశంసించారు. వేగంగా విస్తరిస్తోన్న సాంకేతిక విప్లవంలో ప్రైవసీ, సెక్యూరిటీ ఏవిధంగా ప్రొటెక్ట్ చేయాలని అడిగిన మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఇందుకు నాదేళ్ల సమాధానమిస్తూ ఇంటర్నెట్ సేఫ్టీ, ఏఐ ఎథిక్స్లో రాజీపడితే పెనుముప్పు వాటిల్లు తోందన్నారు. నియంత్రణ సంస్థలు ఈ అంశాలపై క్రమశిక్షణ పాటించాలన్నారు. ప్రైవేటు ప్లేయర్లైనా, ప్రభుత్వ సంస్థలైనా పౌరుల ప్రైవసీ హక్కును పరిరక్షించాలని వెల్లడించారు. వైద్య రంగంలో కృత్రిమ మేధస్సు (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ముఖ్యంగా ఇన్పేషెంట్ విభాగంలో కృత్రిమ మేధస్సుది కీలకపాత్రగా ఉందన్నారు. తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు సత్య నాదెళ్ల వివరించారు.కొవిడ్ నేపథ్యంలో జీవనశైలిపై కరోనా విసిరిన సవాళ్లు, సాంకేతికత తోడుగా సమస్యలను ఎదుర్కొ నేందుకు ఉన్న పరిష్కా రాలపై మంత్రి కేటీఆర్ ప్రశ్నించగా సత్యనాదెళ్ల సమాధానమిస్తూ వైరస్ చర్యలకు వ్యాధి నిరోధక శక్తి ఏవిధంగా స్పందిస్తుందనే సమాచారం వ్యాక్సిన్ అభివృద్ధిలో ఏవిధంగా కీలకమో.. ప్రపంచం ఎదుర్కొనే అనేక సవాళ్లకు అందివచ్చిన నూతన టెక్నాలజీ పరిష్కారాలు చూపెడుతుందన్నారు. ఈ సదస్సులో భాగంగా ప్రపంచ ఆరోగ్య రంగాన్ని, మానవ జీవనశైలిని సాంకేతికత ఏవిధంగా ప్రభావితం చేస్తుందనే అంశంపై ప్రధానంగా చర్చించారు.