బెయిల్ కావాలా..నాయనా!

పీఎం-కేర్స్ కు విరాళం ఇవ్వు… బీజేపీ మాజీ ఎంపీకి న్యాయమూర్తి షరతు

రాంచీ: పీఎం-కేరకు రూ.35వేల విరాళం ఇచ్చి మాజీ ఎంపీతో పాటు మరో ఐదుగురు బెయిల్ పొందిన ఘటన ఝార్ఖండ్ లో జరిగింది. బెయిల్ కావాలంటే విరాళం ఇవ్వాల్సిందేనని న్యాయమూర్తి షరతు విధించారు. దీన్ని అంగీకరించిన వారు ఇటు బెయిల్ పొందడంతో పాటు.. కరోనా పై పోరులో భాగం కావాలన్న ప్రధాని మోదీ పిలుపును సైతం అందిపుచ్చుకున్నారు. భాజపా మాజీ ఎంపీ సోమ్ మరండీ సహా మరో ఐదుగురు 2012లో నిర్వహించిన రైల్ రోకో కేసులో దోషులుగా తేలారు. దీని పై విచారణ చేపట్టిన సహిబ్ గంజ్ రైల్వే జుడీషియల్ మేజిస్ట్రేట్.. వారు ఒక సంవవత్సరం పాటు సాధారణ జైలు జీవితం గడపాలని శిక్ష ఖరారు చేశారు. దీంతో ఫిబ్రవరి నుంచి వారు జైలు జీవితం గడుపుతున్నారు. ఈ క్రమంలో తమకు విధించిన శిక్షను కొట్టివేయాలని కోరుతూ దోషులు ఝార?ండ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, లాక్ డౌన్ నేపథ్యంలో దీనిపై విచారణ జరిపే అవకాశం లేకుండా పోయింది. దీంతో కనీసం బెయిలైనా ఇవ్వాలని అభ్యర్థించారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ అనుభా రావత్ చౌదరి.. పీఎం-కేరకు రూ.35,000 విరాళం సహా, ఆరోగ్య – సేతు యాప్ డౌన్లోడ్ చేసుకుంటేనే బెయిల్ ఇస్తామని షరతు విధించారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు. న్యాయమూర్తి షరతులకు అంగీకరించిన వారు విరాళం ఇచ్చేసి బెయిల్ పొందారు. దీంతో జైలు జీవితం నుంచి విముక్తి తో పాటు కొవిడ్-19 పై పోరులో భాగమయ్యే అవకాశాన్ని దక్కించుకున్నారు.