ఆగని కరాళ నృత్యం

విశ్వవ్యాప్తంగా 70 వేలకు చేరువైన కరోనా మరణాలు.. 

-208 దేశాలకు పాకిన మహమ్మారి వైరస్ -ప్రపంచ దేశాల్లో నమోదయిన12,73,990 కేసులు -చైనాలో మళ్లీ మొదలైన కరోనా వైరస్ -ఫ్రాన్స్ లో 24 గంటల్లో 357 మరణాలు – స్పెయిన్లో 12,418కి చేరిన మరణాల సంఖ్య -ఇటలీలో ఒక్క రోజే 525 మరణాలు

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా తన పంజా విసురుతున్న కరోనా వైరస్ ఇప్పటి వరకు 208 దేశాలకు విస్తరించింది. ప్రపంచ దేశాల్లో 12,73,990 కేసులు నమోదయ్యా యి. వీరిలో 2,60,247 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ఇక మృతుల సంఖ్య 70 వేలకు చేరువవ్వడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వైరస్ తొలుత వెలుగులోకి వచ్చిన చైనాలో ఆదివారం కొత్తగా 39 కేసులు నమోదయ్యా యి. వీటిలో 38 మంది విదేశాల నుంచి వచ్చినవారేనని అధికారులు తెలిపారు. మరోవైపు రాజధాని బీజింగ్ లో వైరస్ కట్టడి చర్యలు సుదీర్ఘకాలం కొనసాగుతాయని వెల్లడించారు. కొత్తగా ఒకరు చనిపోవడంతో మృతుల సంఖ్య ఇప్పటి వరకు 3,331కి చేరింది. ఇక బాధితుల సంఖ్య 81,708కి పెరిగింది. ఫ్రాన్స్ లో ఆదివారం మరణాల సంఖ్య తగ్గడం ఆ దేశవాసులకు ఊరట కలిగించింది. 24 గంటల వ్యవధిలో 357 మరణాలు సంభవించాయి. వారం రోజుల్లో ఇదే తక్కువ కావడం గమనార్హం. ఇప్పటి వరకు వైరస్ బారినపడి 8,078 మంది మ ృత్యువాతపడ్డారు. వీరిలో 2,189 మంది వృద్ధాశ్రమాలు, ఇతర వైద్య కేంద్రాల్లో మ రణించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 28,891 మంది ఆస్పత్రుల్లో చికిత్స  పొందుతున్నారు. ఆదివారం రోజు కొత్తగా 748 మంది వైరస్ బారిన పడ్డట్లు గుర్తించారు. నిన్న ఒక్కరోజే 140 మంది ఐసీయూలో చేరడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. స్పెయిన్లో వరుసగా మూడో రోజు మరణాల సంఖ్య తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం మరో 674 మంది మృతిచెందడంతో మరణాల సంఖ్య 12,418కి చేరింది. ఇక వైరస్ బారిన పడ్డవారి సంఖ్య 4.8 శాతం పెరిగింది. దీంతో బాధితుల సంఖ్య 1,30,759కి పెరిగింది. ఇప్పటి వరకు వైరస్ సోకిన వారిలో 11 శాతం మంది కోలుకున్నారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ఇటలీలోనూ ఆదివారం మరణాల సంఖ్య తగ్గింది. నిన్న 525 మంది మృత్యువాతపడ్డారు. మార్చి 19 తర్వాత నమోదైన మరణాల్లో ఇదే అత్యల్పం. దేశంలో మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పడిపోతుందని.. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా లాక్ డౌన్లో మగ్గిపోతున్న జనాలకు ఊరట కల్పించే దిశగా యోచిస్తున్నామని అధికారులు తెలిపారు. ఆంక్షల నుంచి కాస్త సడలింపునిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. దేశంలో ఇప్పటి వరకు 15,887 మంది మరణించగా.. 1,28,948 మంది వైరస్ బారినపడ్డారు. సింగపూర్ లో ఆదివారం ఒక్కసారిగా వైరస్ తీవ్రత పెరిగిపోయింది. నిన్న ఒక్కరోజే 120 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. దేశంలో ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఆ దేశంలో ఇప్పటి వరకు 1309 కేసుల్ని గుర్తించారు. వీరిలో ఆరుగురు మరణించారు. అమెరికాలో ఇప్పటి వరకు 16 లక్షల కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిగినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అక్కడ మృతుల సంఖ్య 10 వేల మార్క్ ను చేరుకోబోతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని పిలుపునిచ్చారు. సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. దేశంలో దాదాపు 95 శాతం జనాభాకు ఇంటికే పరిమితం కావాలన్న నిబంధనలు వర్తిస్తాయని గుర్తుచేశారు. అమెరికాలో మ ృతుల సంఖ్య 9,626కు చేరింది. 9/11 ఉగ్రదాడిలో చనిపోయిన వారితో పోలిస్తే ఇది మూడింతలు. ఆదివారం ఒక్కరోజే 1,188 మంది మృత్యువాతపడ్డారు. ఇక కొత్తగా దాదాపు 23 వేల మందిలో వైరస్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో వైరస్ బారిన పడ్డవారి సంఖ్య 3,36,958కి చేరింది. 29 లక్షల డోసుల హైడ్రాక్సీక్లోరోక్విన్… పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యల్ని ట్రంప్ వివరించారు. ప్రపంచదేశాల నుంచి మాస్కులు, చేతి తొడుగులు, ఇతర రక్షక సాధనాలను తెప్పించే ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపారు. అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో తాజా సంక్షోభాన్ని భారీ విపత్తుగా ప్రకటించారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. హైడ్రోక్లోరోక్విన్ ఉపయోగాన్ని మరోసారి ధ్రువీకరించిన ట్రంప్.. దాదాపు 29 లక్షల డోసుల ఔషధాన్ని తెప్పించినట్లు వెల్లడించారు. రానున్న రెండు వారాలు అత్యంత కఠినంగా గడవనున్నాయని ట్రంప్ ఇప్పటికే పలుసార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కమాండర్ పై వేటు… – మరోవైపు అమెరికా నావికాదళానికి చెందిన కమాండర్ క్లోజియర్ ని అమెరికా విధుల నుంచి తొలగించింది. ప్రస్తుతం యూఎస్ఎస్ రూజ్వెల్ట్ లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన నౌకలో ఉన్న బలగాలను వైరస్ ముప్పు నుంచి కాపాడాలంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. అది బయటకు రావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీని పై స్పందించిన రక్షణ విభాగం క్రోజియర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని వివరిస్తూ ఆయన్ని విధుల నుంచి బహిష్కరించింది. దీన్ని రక్షణశాఖ కార్యదర్శి మార్క్ ఎస్పర్ సైతం సమర్థించడం గమనార్హం. కానీ, దేశంలోని పలు వర్గాలు కమాండర్ బహిష్కరణ వేటును తప్పుబడుతున్నాయి.