వాహనదారులకు ఉపశమనం

జూన్ 30 వరకు డ్రైవింగ్ లైసెన్సు, రూట్ పర్మిట్లకు అనుమతించిన రవాణా శాఖ

న్యూఢిల్లీ: వాహనదారులకు ఉపశమనం కలిగించే విషయాన్ని కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కాలం ముగిసిపోయే అన్ని వాహనాల పర్మిట్లు, ఫిట్ నెస్, డ్రైవింగ్ లైసెన్సులతో పాటు ఇతర డాకుమెంట్లు జూన్ 30వరకూ చెల్లుబాటు అవుతాయని ప్రకటించింది. దీంతో ఇప్పటికే గడువు ముగిసిన డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషతో పాటు మోటార్ వాహన చట్టం కింద వచ్చే అన్ని పత్రాలు జూన్ 30వరకు చెల్లుబాటు అవుతాయి. దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్ డౌన్ విధించడంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డ విషయం తెలిసిందే. ఈ సమయంలో వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్ల గడువు పొడగించుకునే అవకాశం లేదు. దీంతో సరుకు రవాణాతోపాటు వివిధ అత్యవసర సేవల వాహనాలకు అంతరాయం కలగకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల వాహనదారులకు ఇది వర్తిస్తుంది. వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు పాటించాలని రాష్ట్రాలకు సూచించింది.