ఏడుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌

ఇస్లామాబాద్‌: కశ్మీర్‌ అంశంపై అంతర్గత సమాలోచనలు జరిపేందుకు పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చట్టపరంగా, రాజకీయంగా, ద్వైపాక్షికంగా ఎలా స్పందించాలన్నదానిపై ఈ కమిటీ సూచనలు చేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైనట్టు పాకిస్తాన్‌ స్థానిక మీడియా వెల్లడించింది. 
పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ, పాకిస్తాన్‌ అటార్నీ జనరల్‌ అన్వర్‌ మన్సూర్‌ ఖాన్‌, విదేశాంగ కార్యదర్శి సోహైల్‌ మహ్మద్‌, ప్రధానమంత్రి ప్రత్యేక రాయబారి అహ్మద్‌ బిలాల్‌ సూఫీలతో పాటు ఐఎస్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌, మిలటరీ వ్యవహారాలు, అంతర్గత ప్రజా సంబంధాల విభాగాధిపతులు ఈ కమిటీలో ఉంటారని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కాగా జమ్మూ కశ్మీర్‌ను అసెంబ్లీ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతంగానూ, లడఖ్‌ను అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగానూ మార్చుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌ కశ్మీర్‌పై కమిటీని వేయడం గమనార్హం. 
‘370 రద్దు’కు రాష్ట్రపతి ముద్ర