హైకోర్టులో..ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ

  • ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ
  • – జీవో నెం. 63ను నాలుగువారాలు సస్పెండ్‌ చేసిన హైకోర్టు
  • – కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచన
  • – తదుపరి విచారణ వచ్చేనెల 22కి వాయిదా

అమరావతి, జులై25 : టీడీపీ హయాంలో జరిగిన పవన, సోలార్‌ విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాలను సవిూక్షించేందుకు వైసీపీ ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీకి వ్యతిరేకంగా ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు హైకోర్టు ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీ నియమిస్తూ జారీచేసిన జీవో నెంబరు 63తోపాటు ఎస్పీడీసీఎల్‌ లేఖలపై న్యాయస్థానం నాలుగు వారాల స్టే విధించింది. అంతేకాదు ఈ అంశంపై కౌంటర్‌ దాఖలుచేయాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను ఆగస్టు 22కు వాయిదా వేసింది. ఏపీ ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీని రద్దుచేయాలని కోరుతూ ఒప్పందం కుదుర్చుకున్న 40 సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. తగ్గించిన ధరల ప్రకారం విద్యుత్‌ సరఫరా చేయాలని, లేని పక్షంలో తమ వైఖరిని కమిటీ ముందు వెల్లడించాలని పేర్కొంటూ ఏపీఎస్పీడీసీఎల్‌ జులై 12న రాసిన లేఖలనూ రద్దు చేయాలని తమ పిటిషన్‌లో కోరాయి. టారిఫ్‌ తగ్గింపు, పీపీఏల రద్దు విషయంలో నిర్ణయం తీసుకోకుండా అధికారులను ఆదేశించాలని ఆ సంస్థలు విజ్ఞప్తి చేశాయి. ధరల విషయంలో తాము చెప్పినట్టు చేయకపోతే 25 ఏళ్లపాటు కొనసాగేలా చేసుకున్న పీపీఏలను రద్దు చేస్తామని రాష్ట్ర ఇంధనశాఖ, ఎస్పీడీసీఎల్‌ అధికారులు బెదిరిస్తున్నారని ఇందన సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించారు. విద్యుత్తు చట్టం-2003లోని సెక్షన్‌ 63ను అనుసరించి ఏపీఈఆర్‌సీ టారిఫ్‌ను ఆమోదించినప్పటికీ.. అధికారంలేని ఇంధనశాఖ, ఎస్పీడీసీఎల్‌లు తగ్గించాలని కోరుతున్నాయని తెలిపారు.
ఈపథ్యంలో ఇంధనశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, ఎస్పీడీసీఎల్‌ సీఎండీ చర్యలను చట్ట విరుద్ధమైనవిగా
ప్రకటించాలని వారు కోరారు. 2015లో చేసుకున్న ఒప్పందంలో యూనిట్‌ విద్యుత్తుకు ఎంత టారిఫ్‌ చెల్లించాలనే అంశంపై ఓ అంగీకారానికి వచ్చినట్టు వివరించారు. ఆ ధరలను ఏపీఈఆర్‌సీ ఆమోదించిందని, వివిధ విద్యుత్తు సరఫరా సంస్థలకు ఏపీఎస్పీడీసీఎల్‌ చెల్లించాల్సిన బకాయిలు రూ.కోట్లలో ఉన్నాయని పేర్కొన్నారు. ఆ బకాయిలు చెల్లించరాదనే ఉద్దేశంతో వారు వివిధ ఎత్తుగడలు వేస్తోందని ఓ విద్యుత్తు సంస్థ తన పిటిషన్లో ఆరోపించింది.