షీటీమ్స్‌కు ధీటుగా మహిళా కమిటీలు

సత్ఫలితాలు ఇస్తున్న పోలీసుల నిర్ణయం 
వరంగల్‌,జూలై29: సమాజంలో ఆడవారి పై జరుగుతున్న అఘాయిత్యాలకు, ఆకాతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా వరంగల్‌ పోలీసులు తీసుకున్న నిర్ణయం సత్ఫలితం ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఆడవారికి ఆత్మరక్షణ కరువైందని గ్రహించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా షీ టీమ్స్‌ ద్వారా స్వశక్తి కార్యక్రమాన్ని తలపెట్టి ఆడవారు తమ ఆత్మరక్షణను ఎలా కాపాడుకోవాలో నేర్పుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దాని కోసం వరంగల్‌ కవిూషనరేట్‌ పరిధిలో ప్రత్యేకంగా ఒక టీంను ఏర్పాటు చేసి మెళకువులు నేర్పించారు. చారిత్రక నేపధ్యం కలిగిన ఓరుగల్లులో ఒక్కొక్కరిని ఒక్కో రుద్రమ దేవిగా తయారు చేయడమే లక్ష్యంగా స్వశక్తి కార్యక్రమాన్ని పెట్టి నూతన ఒరవడి సృష్టిస్తున్నారు. రోడ్డు భద్రత 
విషయంలో ఎన్నో కార్యక్రమాలు చేయడంతో పాటు డ్రైవర్ల ఆరోగ్యం కోసం సామాజిక సేవా కార్యక్రమాలు చేసి తనదైన ముద్రను వేసుకున్నారు. ఇదే రీతిలో ఆడవారికి మరింత ఆత్మస్ధైర్యం నింపేలా వారి ఆత్మరక్షణ వారి చేతిలోనే ఉందని నిరూపించే విధంగా స్వశక్తి కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రవేశపెట్టారు. దీనిని ఇంతటితోనే వదిలేయ వద్దనే లక్ష్యంతో వరంగల్‌ కవిూషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న మహిళా పోలీసులతో కలిసి ఒక స్వశక్తి టీంను ఏర్పాటు చేశారు. వారికి మార్షల్‌ ఆర్ట్స్‌, ఆడవారిపై ఆకతాయిలు వెంటపడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఎదిరించే సెల్ఫ్‌ డిఫెన్స్‌ స్కిల్స్‌, 12 రకాల ఆత్మరక్షణ టెక్నిక్స్‌ను పూర్తి స్థాయిలో శిక్షణ ఇప్పించారు. ఆడపిల్లల ఆత్మరక్షణకు, వారికి ఎలాంటి విషయంలోను వేదింపులు ఉండొద్దు అనే భావనతో గురుకుల సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో ఉండే విద్యార్థినిలకు స్వశక్తి ద్వారా మెళకువలు నేర్పించారు. స్వశక్తి షీ టీం ద్వారా సెల్ఫ్‌ డిఫెన్స్‌ టెక్నిక్స్‌లో శిక్షణ ఇచ్చారు. ఆకతాయిలు ఎదురైనపుడు ముఖం, మెడ, ఛాతి, పొట్ట లాంటి భాగాలలో ఎలా దాడి చేయాలో, దాడి చేసిన వారిని ఎలా ఎదుర్కోవాలో చేసి చూపించారు. ఎలాంటి ప్రమాదానికి భయపడకుండా ముందుకు వెళ్లాలని అప్పుడే మనం అనుకున్నది సాధించ వచ్చు అనే సంకల్పంతో ప్రతి అమ్మాయి ముందుకు అడుగు వేయాలని ఆకాంక్షించారు. భవిష్యత్తు సవ్యంగా ఉండాలని కోరుకోవడమే కాకుండా ఎలాంటి ఆపద ఉన్న పోలీసులం మేమున్నామని చెపుతూ వారిలో ఆత్మస్దైర్యాన్ని నింపడానికి ఇలాంటి శిక్షణ ఏర్పాటు చేసినట్లు పోలీసులు వివరించారు. ఇప్పుడా కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. చారిత్రక నగరంలో ఇప్పుడు షీ టీమ్స్‌ బాగా పనిచేస్తున్నాయి.