మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్‌

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ శ్రీ మహంకాళీ అమ్మవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన ఆయన అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. క్యూలో నిల్చున్న భక్తులకు అభివాదం చేశారు. అంతకుముందు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలతోపాటు అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి మంత్రి అమ్మవారిని దర్శించుక్నారు.

తెల్లవారు జాము నుంచే అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దాదాపుగా క్యూ లైన్లన్నీ నిండిపోయి ఆలయ ప్రాంగణం భక్తులతో కోలాహలంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయం వద్ద పోలీసులు పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బోనాలను తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు..భారీగా వర్షాలు కురిసి పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా వుండాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు.

కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి , కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, మల్లారెడ్డి, తెలంగాణ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు.కేపి