వార్తలు రాస్తే… వెతలేనా !!

జర్నలిస్టుల గోడు పట్టించుకోని ప్రభుత్వాలు

  • మీడియాకూ పాకిన కరోనా వైరస్
  • దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు
  • జర్నలిస్టుల సంక్షేమం పట్టని ప్రభుత్వాలు
  • కనీస సదుపాయాలు కల్పించని దైన్యం
  • కవరేజీకి వెళితే క్వారంటైన్ కేనా?
  • అరకొరగా నిత్యావసరాల సరఫరా
  • అదీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలోనే 

హైదరాబాద్: కరోనా ప్రభావం అన్ని రంగాల పైనా పడుతోంది. దీని ప్రభావం పత్రికల పై దారుణంగా ఉందన్న సంగతి ఇప్పటికే చర్చించుకున్నాం. ఇక ఇప్పుడు జర్నలిస్టుల పైనా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 100 మంది వరకూ పాత్రికేయులు కరోనా పాజిటివ్ గా తేలారు. ఎక్కువగా ముంబైలో జర్నలిస్టులకు కరోనా వచ్చింది. ఆ తర్వాత తమిళనాడులో ఓ ఛానల్లో ఏకంగా 50 మంది వరకూ కరోనా పాజిటివ్ గా తేలిందట. దీంతో ఆ ఛానల్ ను తాత్కాలికంగా మూసేశారు. ఇక ఇప్పుడు ఈ కరోనా ప్రభావం తెలుగు జర్నలిస్టుల పైనా పడుతోంది. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్టీవీతో పాటు మరికొందరు కొందరు రిపోర్టర్లకు కరోనా వచ్చిందని వార్తలు వచ్చాయి. అందుకే ఇక తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే జర్నలిస్టులకు కరోనా వచ్చినా పట్టించుకునే స్థాయిలో యాజమాన్యాలు లేవు. ఇలాంటి విపత్కాలాల్లో జర్నలిస్టులు తమ గురించి తామే ఆలోచించుకోవడం బెటర్. అందుకే టీవీ జర్నలిస్టులు, పత్రికల జర్నలిస్టులు రిస్కు తీసుకోవడం మానేయాలి. క్వారంటైన్ కేంద్రాలకూ, కోవిడ్ ఆసుపత్రుల రిపోర్టింగ్ కూ వెళ్లడం మానేస్తే మంచిది. ఈ వివరాలను ఎలాగూ వైద్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు మీడియాకు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఆ సమాచారంతో సరిపుచ్చుకోవడం బెటర్. అదే సమయంలో పనికిమాలిన నాయకుల ప్రెస్ మీట్లను కూడా ఎవాయిడ్ చేయడం మంచిది. ఈ కరోనా సమయంలో చిన్నా చితకా వార్తలకు ఎలాగూ టీవీల్లోనూ, పత్రికల్లోనూ చోటు దక్కదు. అందుకే అత్యవసరం అయితే తప్ప ప్రెస్ మీట్లను కూడా పక్కకు పెట్టడం బెటర్. అత్యవసరం కొద్దీ వెళ్లినా తగు జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకండి. జర్నలిస్టుల సంక్షేమం ప్రభుత్వాలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇలాంటి సమయంలో రిస్కు తీసుకుని మీ కుటుంబాలను ఆపదలోకి నెట్టకండి. ప్రపంచానికి పెను సవాల్ గా మారిన కరోనా సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు. మానవజాతి ఎప్పుడూ చూడని పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. రాజు, పేద, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఎవరినైనా ఈ మహమ్మారి కలుపుకొని పోతోంది. దీనిని నిరోధించేందుకు పోరాడుతున్న యోధుల్లో వైద్య సిబ్బందితోపాటు పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది ముందు వరుసలో ఉన్నారు. వీరినే ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటున్నారు. వీరితోపాటు కనిపించిన నాలుగో సింహం కూడా ఒకటి ఉంది. వారే పాత్రికేయులు. అందరూ ఆ ముగ్గురి గురించే మాట్లాడతారు తప్ప వీరి గురించి ఎవరూ మాట్లాడే పరిస్థితే ఉ ండదు. లాక్ డౌన్ విధించినా, కర్ఫ్యూ పెట్టినా పాత్రికేయులు మాత్రం పని చేయక తప్పదు. అందరికీ పండగ రోజుల్లో సెలవు ఉంటుంది. కానీ జర్నలిస్టులకు మాత్రం ఉండదు. ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వెళతారో, తిరిగి ఎప్పుడు వస్తారో కూడా చెప్పలేని పరిస్థితి. ఇంత చేస్తున్నా కనీస భద్రత కూడా లేని బతుకులు వారివి. ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఊడుతుందో కూడా తెలియని దుస్థితి. అయినప్పటికీ విధి నిర్వహణలో పలువురు పాత్రికేయులు చూపించే చిత్తశుద్ధిని ఏ మాత్రం తక్కువ చేయలేం. అన్నిచోట్లా మంచి, చెడు ఉన్నట్టే… జర్నలిజంలోనూ ఈ రెండూ ఉన్నాయి. దీపం ఉ న్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా చాకచక్యంగా నాలుగు రాళ్లు వెనకేసుకునేవారు కూడా ఈ రంగంలో ఉన్నారు. అదే సమయంలో రెక్కలు ముక్కలు చేసుకుని నాలుగు రాళ్లు కొడితే ఎంత వస్తుందో అంత కూడా సంపాదించలేని వారూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇలాంటివారే ఎక్కువ. ప్రస్తుత కరోనా కాలం పాత్రికేయులకు మరిన్ని కష్టాలు తెచ్చి పెట్టింది. వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి ప్యాకేజీలు, ప్రోత్సాహకాలు ప్రకటించిన ప్రభుత్వాలు.. పాత్రికేయులను మాత్రం తమకు సంబంధం లేనివారిగా పక్కన పెట్టేశాయి. . ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ధీటుగా తమ విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు కనీసం బీమా సౌకర్యం కూడా కల్పించకపోవడం వారి దుస్థితికి నిదర్శనం. కరోనాకు చికిత్స చేసే ఆస్పత్రులతోపాటు రెడ్ జోన్లు, హాట్ స్పాట్ల వంటి ప్రాంతాల్లో జర్నలిస్టులు విధి నిర్వహణలో భాగంగా తిరగాల్సి వస్తోంది. దీంతో కరోనా బారిన పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే తమిళనాడులోని ఓ ఛానల్ కు చెందిన 27 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఫీల్డ్ లో తిరిగి వచ్చిన రిపోర్టర్ల కారణంగా డెస్క్ సిబ్బందీ వైరస్ బారిన పడ్డారు. అలాగే ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా వచ్చింది. తాజాగా తెలంగాణలోనూ పలువురి పాత్రికేయులను క్వారంటైన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో పాత్రికేయుల్లోనే కాస్త కదలిక వచ్చింది. మనల్ని ఎవరూ కాపాడరు.. మనల్ని మనమే కాపాడుకోవాలని జర్నలిస్టు సర్కిళ్లలో మెసేజ్ లు సర్క్యులేట్ అవుతున్నాయి. మనకు ఏమైనా అయితే, ఎవరూ ఆదుకోరనే విషయం గుర్తుంచుకోవాలంటూ పలువురు తమ తోటి పాత్రికేయులను హెచ్చరిస్తున్నారు. “రోజూ విధి నిర్వహణ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లి వస్తుంటే చుట్టుపక్కలవారు అభ్యంతరం చెబుతున్నారు. కొంతమంది ఇంటి యజమానులు అయితే గేటుకు తాళాలు వేసేస్తున్నారు. పోనీ ఇంట్లోనే ఉ నే ందామంటే కుదరని పరిస్థితి. అసలే ప్రస్తుతం మీడియాలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో వేళకు ఆఫీసుకు వెళ్లకపోతే ఏమవుతుందనే భయం. వెళ్తే… ఇంటి యజమానులు, చుట్టుపక్కలవారి అభ్యంతరాలు. ఏం చేయాలో అర్థం కావడంలేదు” అన్న ఓ మీడియా మిత్రుడి ఆవేదన చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఆంధ్రజ్యోతి, వెలుగు వంటి పత్రికల్లో సిబ్బందికి ‘సెలవులు’ ఇచ్చేశారు. అవసరమైతే మళ్లీ పిలుస్తాం… ప్రస్తుతానికి రావొద్దని సాగనం పేశారు. ఒకటి రెండు టీవీ ఛానళ్లు పలువురి కొలువులకు నేరుగానే ఉద్వాసన పలకగా.. మరొకొన్ని చిన్న ఛానళ్లు వేతనాల్లో 25 శాతం కోత పెట్టాయి. దీంతో రాబోయే కాలంలో ఎంతమందికి ఉద్యోగాలు ఉంటాయో, ఎంతమందికి ఊడతాయో అని పాత్రికేయులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నిజానికి కాస్ట్ కటింగ్ లో భాగంగా ఉద్యోగులు తొలగింపు ప్రక్రియను చేపట్టాలని పలు సంస్థలు గతంలోనే భావించాయి. అలాంటివారికి కరోనా అనుకోని వరంలా వచ్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ సాకుతో తాము చేయాలనుకున్న పనులన్నీ ఇప్పుడు చేస్తున్నాయని జర్నలిస్టు వర్గాలే ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. మొత్తానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్ గా విరజిల్లాల్సిన మీడియాలో ఎవరికీ పట్టని నాలుగో సింహంలా పాత్రికేయుల పరిస్థితి మారిపోయింది.