విక్రయాలకు ఇబ్బందులు కలిగించొద్దు
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆజాద్ పూర్ మార్కెట్ ను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి మంగళవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్ అధికారులతో సమావేశమై కరోనా నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ లో భౌతికదూరం, శానిటైజేషన్, కౌంటర్ల వివరాలు, కూరగాయలు, పండ్ల అమ్మకాలను అడిగి తెలుసుకున్న కేంద్రం మంత్రి… విక్రయాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కూరగాయలు, పండ్లు మార్కెట్ లోకి అనుమతి పై ఆంక్షలు విధించవద్దని ఆదేశించారు. అమ్మకందారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గూడ్స్ రైళ్లలోనూ రైతులు తమ పంటలు తీసుకురావచ్చని తెలిపారు. రైతులు అడిగితే కార్గో విమాన సేవలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని, మామిడి, బత్తాయి, ఇతర పండ్లు మార్కెట్ కు తీసుకు రావచ్చని సూచించారు. రైతుల ఉత్పత్తుల రవాణా ఇబ్బందులు పరిష్కరించేందుకు హెలైన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆసియాలోనే అతి పెద్దదైన ఆజాద్ పూర్ మార్కెట్ ను 24 గంటలూ తెరిచి ఉంచాలని ప్రధాని నిర్ణయించారని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. దేశంలో ఎక్కడైనా రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చని, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. వాహనాలు, గూడ్సు రైళ్ల రాకపోకలకు ఇబ్బంది లేదని, రైతుల ఉత్పత్తులను ఏ రాష్ట్రాలు ఆపవద్దని ఆదేశించారు. ఎక్కడైనా అడ్డుకుంటే హెల్ప్ లైన్ 14488 నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు పెంచొద్దు జీవో 46 విడుదల చేసిన తెలంగాణ సర్కారు హైదరాబాద్: తెలంగాణలోని పాఠశాలల్లో ఫీజులు పెంచవద్దని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. నెలవారీ ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని సూచించింది. జీవో 46ను ఉల్లంఘిస్తే పాఠశాల గుర్తింపు రద్దుచేస్తామని హెచ్చరించింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సహా అన్ని ప్రైవేటు బడులకూ ఈ జీవో వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. రాష్ట్రంలో 10 వేలకు పైగా ప్రైవేట్ పాఠశాలలున్నాయని, 30 లక్షల మంది పైగా విద్యార్థులున్నారని, ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఎట్టిపరిస్థితుల్లో ఫీజులు పెంచవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ‘ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించరాదు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఒక్క పైసా కూడా ఫీజులు పెంచరాదు. ఇది ప్రభుత్వ ఆదేశం. ట్యూషన్ ఫీజు కాకుండా ఒక్క పైసా అదనంగా వసూలు చేయవద్దు. పరిస్థితులు చక్కబడ్డాక చూసుకోవచ్చు. సంవత్సరం మొత్తం ఫీజు ఒకేసారి చెల్లించాలని జబర్దస్త్ చేయవద్దు. నెలవారీగా ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేసుకోవాలి. విద్యార్థులను, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టవద్దు. కష్ట పెడితే 100కు డయల్ చేయండి. వెంటనే యాక్షన్ ఉంటది. యాక్టివ్ గా చర్యలు తీసుకుంటాం. పర్మిషన్ గుర్తింపు రద్దుచేస్తాం. ప్రజలు తమ ఆదాయం కోల్పోయారు. పరిస్థితి ఇంకముందు దారుణంగా ఉంటుంది. మార్చిలోనైనా కొంత ఆదాయం ఉంది. కానీ, ఏప్రిల్ లో పనిలేక ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.