నిధుల కోసం నిలదీద్దాం!!
కేంద్రం పై పెల్లుబుకుతున్న దక్షిణాది రాష్ట్రాల అసహనం
- రాష్ట్రాలకు రావలసిన పన్నుల వాటాలోనూ కోతలు
- తెలంగాణకు రూ.1,393 కోట్లు రావాల్సి ఉండగా రూ.982 కోట్లు విడుదల
- ఏపీకి రూ.2,686 కోట్లకు బదులు రూ.1892 కోట్లు విడుదల
- కర్ణాటక, తమిళనాడు, కేరళకూ అదే పరిస్థితి
- కరోనా కష్టకాలంలో అదనపు నిధులు నిల్
- రావలసిన నిధులకే కోతలు పెట్టిన కేంద్రం
హైదరాబాద్: కరోనా దక్షిణాది రాష్ట్రాల పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇలాంటి పరిస్థితిలో కేంద్రం తీసుకున్న నిర్ణయం గోరుచుట్టు పై రోకలిపోటులా తయారయంది. ఏప్రిల్ కు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటాగా రూ.1,393 కోట్లు రావాల్సి ఉండగా రూ.982 కోట్లు, ఆంధ్రప్రదేశ్ కు రూ.2,686 కోట్లకు బదులు రూ.1892 కోట్లు విడుదల చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. మరోపక్క కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. నోట్ల రద్దు తర్వాత ప్రారంభమైన ఎఫెక్ట్.. ఆ తర్వాత కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు కరోనా దెబ్బకు మరింత దిగజాయిపోయాయి. చివరికి ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. లాక్ డౌన్ తర్వాత వాణిజ్య వ్యాపారం ఆగిపోయింది. జీఎస్టీ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ డ్యూటీ, ట్రాన్స్ పోర్టు, ఎక్సైజ్ నుంచి వచ్చే ఆదాయం రాకపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉన్న వనరులతోనే నెట్టుకురావాల్సిన దారుణ పరిస్థితి. కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నుంచి కొంత మొత్తాన్ని కేంద్రం విడుదల చేసింది. అయితే, ఈ మొత్తం కొంత మాత్రమే. అది తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఒక్క గాంధీ ఆస్పత్రిని నిర్వహించడానికి కూడా సరిపోదు. సాధారణంగా అంచనా వేసినా కరోనాను ఎదుర్కొనేందుకు ఒక్కో రాష్ట్రానికి రూ.10 వేల కోట్లు కావాలి. కానీ, కేంద్రం నుంచి అందే సహాయం చాలా తక్కువ. జనవరి-మార్చి కాలంలో జీఎస్టీకి సంబంధించి కేంద్రం నుంచి రూ.5వేల కోట్లు రావాలి. అక్టోబరు- డిసెంబరు కాలానికి సంబంధించి కూడా కొంత మొత్తం కేంద్రం నుంచి రావాలి. వాటితో పాటు.. కొన్ని గ్రాంట్లు కూడా అందాలి. 2018, 2019 సంవత్సరాల్లో వచ్చిన వరదలతో ఆ రాష్ట్రానికి రూ.50వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఆ సందర్భంలో కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. తమిళనాడులో… తమిళనాడుది కూడా అదే పరిస్థితి. లా డౌన్ తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచేందుకు పథకాలు ప్రకటించింది. రూ.1000, బియ్యం , చక్కెర, నూనె, పప్పులు ప్రకటించింది. అమ్మ క్యాంటీన్లు నిర్వహిస్తూ వలస కూలీలకు అండగా నిలుస్తోంది. అయితే, ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.12,263 కోట్లు అందాలి. కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్రం రూ.10వేల కోట్లు ఇవ్వాలని సీఎం పళనిస్వామి డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో… ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టింది తొలుత తెలంగాణ ప్రభుత్వమే. రూ.3731 కోట్లు సహా.. రూ.20వేల కోట్లు పెండింగ్ బిల్స్ కేసీఆర్ సర్కారు చెల్లించాల్సిన పరిస్థితి. ఇంకా రైతులకు లోన్లు కూడా మాఫీ చేయలేదు. రైతు బంధు స్కీం కింద రూ.2వేల కోట్లు విడుదల చేయాలి. ఇవన్నీ రాష్ట్రానికి పెండింగ్ లోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో.. దక్షిణాది రాష్ట్రాల్లో కెల్లా దారుణ పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఏర్పడ్డ నాటి నుంచే ఈ రాష్ట్రం ఆర్థిక భారాన్ని మోస్తోంది. డెవొల్యూషన్ ప్యాకేజీ కింద ఈ రాష్ట్రానికి రూ.3500 కోట్లు అందాలి. అవి అందలేదు. అటు.. కరోనాను ఎదుర్కొనేందుకు ఏపీ ఖర్చు చేసేది రూ.408 కోట్లు మాత్రమే. కేరళలో.. కేరళకు కేంద్రం నుంచి రూ.7500 కోట్లు రావాలి. జీఎస్టీ, ఎంజీఎ 6ఎస్, ధాన్యం కొనుగోలు కింద అవి అందాలి. కరోనా ఇలాగే విజృంభిస్తే దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి దయనీయంగా తయారవుతుంది. దేశానికి ఆర్థిక దన్నుగా నిలుస్తున్న ఈ రాష్ట్రాలు సమస్య ఎదుర్కొంటే భవిష్యత్తులో దేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఇతర ఖర్చులు తగ్గించుకోవడం తప్ప మరే మార్గం లేదు. ధనిక రాష్ట్రాలు చేస్తున్నదదే. కానీ ఇది దౌర్భాగ్యం. ఇప్పుడున్న పరిస్థితులలో ఖర్చులు తగ్గించకూడదు. పెంచాలి. మాంద్యం నేపథ్యంలో అనేక రాష్ట్రాలు ఖర్చులు తగ్గించుకోవడం వెర్రితనం. నిజానికి కేంద్రం కోవిడ్ ని ఎదుర్కోవడానికి ప్రకటించిన రూ.లక్షా డెబ్బై వేల కోట్లలో సగం మాత్రమే ప్రత్యేక నిధి. మిగిలినదంతా బడ్జెట్ కేటాయింపులే. అంటే రూ.70,000 నుండి రూ.75,000 కోట్లు మాత్రమే కేటాయించినట్టు. ఇది అవసరానికి ఎంత మాత్రం సరిపోదు. ఏం చేద్దాం … ఇక రాష్ట్ర ప్రభుత్వాలు చేయగల్గినదల్లా అప్పులు తెచ్చుకుని ఖర్చులు చేసుకోవడమే. ఇప్పుడు మొదటి రెండు నుండి మూడు త్రైమాసికాలకు తెచ్చుకోగలిగిన అప్పుల పరిమితులలో కూడా సగానికి సగం అయిపోయాయి. మిగిలిన కాలంలో జీతాలెలా ఇవ్వాలి? ఇతర ఖర్చులు ఎలా భరించాలి? కేంద్రం భాగస్వామ్యం తీసుకోవడం తప్ప వేరే మార్గం లేనేలేదు. అదే అత్యంత కీలకం. కేంద్రం జిఎటి నష్టపరిహారం, సెస్ విడుదల చేయాలి. చట్ట ప్రకారం రాష్ట్రాలకు జిఎటి నష్టపరిహారం, సెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ కేంద్రం దానిని వెనక్కు నెడుతూనే ఉంది. రాష్ట్రాలకు నిధులు అవసరమైన ఈ క్లిష్ట పరిస్థితులలో…ఎటువంటి తచ్చాటలు లేకుండా రాష్ట్రాలకు అప్పులు తెచ్చుకునే పరిమితులన్నా పెంచాలి. లేదా కేంద్రమే అప్పు తీసుకుని రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జిఎస్ సెస్ నిధికి వనరులను సమకూర్చాలి. పూర్వ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వాగ్దానమిదే. డబ్బు ఇప్పుడు అత్యంత అవసరం. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఇప్పుటు రాష్ట్రాలు అర్థం చేసుకోలేకపోతున్నాయి. కేంద్రం రాష్ట్రాలను దూరంగా పెడుతోందనేది స్పష్టంగా తెలుస్తోంది. రెండో విషయం, కేంద్రం ఆదాయాలు కూడా తగ్గుతున్నాయి. అందువలనయినా వారు రాష్ట్రాలు అదనంగా అప్పులు సమకూర్చుకునే అవకాశాలు కల్పించాలి. ఇప్పడున్న స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో మూడు శాతం బదులుగా మరొక్క శాతం అదనంగా అప్పు చేసే వీలు కల్పించాలి. ప్రపంచమంతటా ఇలాగే జరుగుతున్నది. అమెరికన్ ప్రభుత్వం తమ స్థూల జాతీయోత్పత్తిలో 10 శాతం ఉద్దీపనను ప్రకటించింది. అందువలన వారి ఆర్థిక లోటు ఆమేరకు పెరగనుంది. ఈ ఏడాది ఇందుకు అనుమతిస్తే వచ్చే మూడేళ్ళలో క్రమంగా దానిని తగ్గించుకోవచ్చు. ప్రజలు అర్థం చేసుకుంటారు. కాగా తమిళనాడు కూడా ఇటువంటి మినహాయింపునే కోరింది. ఇతర రాష్ట్ర ఆర్థిక మంత్రులను కూడా ఏప్రిల్ మూడో వారంలో రాష్ట్రాలు నిర్వహించే ‘వెబినార్’ (ఈ విషయమై)లో చేరమని ఆహ్వానిస్తున్నాయి. ప్రముఖ ఆర్థికవేత్తలు, విద్యావేత్తలు, అధికారులు, జర్నలిస్టులను కూడా రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా కేరళ రాష్ట్రం ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఆ తరువాత ప్రశ్నలు అడిగి జవాబులు పొందవచ్చు. దీని ముఖ్య ఉద్దేశం ప్రజల దృష్టిని ఆకర్షించడం, జాతీయ మాధ్యమాలలో ఒక చర్చను లేవనెత్తడం. ప్రస్తుతం జరుగుతున్నది కేవలం అవివేకమని తెలియచేయడం. పార్లమెంటు సమావేశాలు అయిన వెంటనే (మార్చ్ 23న ముగిశాయి) రాష్ట్రాలకు అందించవలసిన పరిహారం గురించి చర్చించడానికి జిఎస్టి సదస్సు జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు భౌతికంగా ఒక చోటకు చేరుకుని సమావేశాలు జరుపుకునే పరిస్థితి లేదు. కేవలం వీడియో కాన్ఫరెన్స్ జరపవచ్చు. కానీ ఇప్పటివరకు ఆ విషయమై ఎటువంటి సమాచారం లేదు. రాబోయేది అతి పెద్ద మాంద్యం. మాకు సుప్రీంకోర్టును ఆశ్రయించడం మినహా మరో మార్గం లేదు. ఇతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులను కూడా ఒక చోటికి చేర్చడమే ‘వెబినార్’ ఉ ద్దేశం. అత్యంత ఎక్కువగా ఆర్థిక ఆదాయాలను కోల్పోతున్న రాష్ట్రాలలో కేరళ ఒకటి. ప్రస్తుతం కేరళలో అక్కడి సర్కారు సాధ్యమైనంత మేరకు అప్పులు తీసుకొచ్చారు. ఇప్పటికే మొదటి విడత రూ.6,000 కోట్లు తెచ్చుకున్నారు. రెండో విడత రూ.6,000 కోట్లను పండగ (విషు) తర్వాత వెంటనే తెచ్చుకుంటారు. వీటిని ఎస్ఎ ఆర్ బాండ్ల ద్వారా రిజర్వు బ్యాంకు నుండి తెచ్చుకున్నారు (రాష్ట్ర ద్రవ్య, ద్రవ్యేతర నిధుల మధ్య నిష్పత్తికి అనుగుణంగా పొందగలిగే నిధులు). కేరళ రాష్ట్రం ఎస్ఎ ఆర్ బాండ్ల ద్వారా రూ.25,000 కోట్లు పొందే అవకాశం ఉంది. రెండు సార్లు రూ.ఆరేసి వేల కోట్లు తెచ్చుకోవడం ద్వారా అందులో దాదాపు సగం నిధులను పొందినట్లు భావించాలి. ఏప్రిల్ నెలలో రాష్ట్రాలకు ఇవ్వవలసిన కేంద్ర పన్నుల వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ. 46038 వేల కోట్లను విడుదల చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే..తెలంగాణ రాష్ట్రానికి రూ. 982 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.1892.64 కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్ధిక సంఘం సిపార్సుల మే రకు ఈ నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్ధిక శాఖ వెల్లడించింది. ఈ నిధుల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రూ.8255.19 కోట్లు విడుదల చేయగా, అత్యల్పంగా గోవాకు రూ.177.72 కోట్ల విడుదల చేసింది.