హడలెత్తిస్తున్న సూర్యాపేట
మంగళవారం ఒక్క రోజులోనే 24 పాజిటివ్ కేసులు…మొత్తం 78 నమోదు
- అంతకంతకూ జిల్లాలో పెరిగిపోతున్న కేసులు
- రహస్యంగా జరిగిన పెళ్లి విందు కార్యక్రమం
- ఫంక్షన్ హాల్ లో చాలా మందికి పాజిటివ్ కేసులు
- ఇతర జిల్లాలనుంచీ హాజరయిన మరికొందరు
- కిరాణా దుకాణదారుడికి పాజిటివ్ నిర్ధారణ
- దుకాణదారుడి నుంచి ఎంత మందికి వ్యాపించిందో విచారణ
- తలలు పట్టుకుంటున్న అధికారులు
హైదరాబాద్: జిల్లాలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు సమాచారం. కరోనా వైరస్ గ్రామాలకు పాకింది. ఇప్పటికే జిల్లాలో 54 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మూడు రోజుల తర్వాత ఒక్కసారిగా 24 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో 78 కేసులతో రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా రెండో స్థానంలో ఉంది. తాజాగా ఆత్మకూరు (ఎస్) మండలం ఏపూరులో 13, సూర్యాపేట కూరగాయల మార్కెట్, టౌన్లో 5, పోలుమళ్ల 1, తిరుమలగిరి 2, ఇంకా మరో మూడు కేసుల సమాచారం రావాల్సి ఉంది. ఇంకా 100కి పైగానే రిపోర్ట్స్ రావాల్సి ఉంది. దీంతో సూర్యాపేట జిల్లాలో అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. సూర్యాపేట జిల్లాలో కరోనా వ్యాప్తికి బీజాలు ఎక్కడ పడ్డాయి? అనే దిశగా విచారణ జరుపుతున్న అధికారులకు ఓ కొత్త విషయం తెలిసినట్లు సమాచారం. మార్చి 20న సూర్యాపేటలోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగిన పెళ్లి విందు(వలీమా) వేదికగా వైరస్ వ్యాప్తి జరిగిందని గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ విందులో పాల్గొన్న వ్యక్తు ల నుంచి ప్రైమరీ కాంటాక్టుగా పలువురికి కరోనా వ్యాపించి ఉండొచ్చని భావిస్తున్నారు. దీనికి ఇతర జిల్లాల నుంచి పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో ఒకే చోట కూర్చుని భోజనం చేయటంతో వైరస్ వ్యాప్తి చెందినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఆ విందుకు వెళ్లి వచ్చిన తర్వాతే సూర్యాపేటలోని కూరగాయల మార్కెట్ లో కిరాణ దుకాణం నిర్వహించే ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అతడు స్వయంగా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడంతో కరోనా పాజిటివ్ వచ్చింది. వెంటనే అధికారులు ఆ వ్యక్తి ప్రైమరీ కాంటాకులను గుర్తించి 60మందిని క్వారంటైన్ కు తరలించి పరీక్షలు చేయించారు. పరీక్షల్లో తొలుత 9మందికి పాజిటివ్ వచ్చింది. వీరితో కాంటాక్టు ఉన్న వారిని గుర్తించి పరీక్షలు చేయించారు. అందులో ముగ్గురికి, ఆ తర్వాత 16 మందికి, అనంతరం 15 మందికి వైరస్ వ్యాపించింది. ఈ విందుకు కూరగాయల మార్కెట్ నుంచి వివిధ సామాజిక వర్గాలకు చెందిన సుమారు 10మంది హాజరయ్యారు. వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ ఏడుగురి ద్వారా మార్కెట్ లో మరో 35మందికి వైరస్ వ్యాప్తి చెందింది. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన కొవిడ్-19 వ్యాప్తికి కారణమైన ఫంక్షన్హాల్ యజమాని పై సూర్యాపేట మునిసిపల్ అధికారులు కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 54 మందికి కరోనా పాజిటివ్ రాగా వీరిలో 42 మంది సూర్యాపేట మునిసిపాలిటీ వాస్తవ్యులే. మిగిలిన 12 కేసుల్లో ఆరు వర్ధమానుకోట, మూడు తిరుమలగిరి మునిసిపాలిటీ, నేరేడుచర్లలో ఒకటి, ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూరులో ఒకటి, పెన్పహాడ్ మండలం అనంతారంలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. కరోనా సోకిన వారిలో 22 మంది మహిళలు కాగా, 32 మంది పురుషులు. ఇక కేసులు పెరిగే అవకాశాలు లేవని అధికారులు భావిస్తున్నారు. ఈ కరోనా వైరస్ దోబులాడుతోంది. కొంత మందిలో ఎలాంటి లక్షణాలు బయటపడకుండానే పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ అని తేలుతోంది. ఈలోగా జరగాల్సిన నష్టం జరుగుతోంది. ఇక లక్షణాలు బయటపడుతున్న వారిలోనూ వైరస్ సోకిన తర్వాత నాలుగైదు రోజుల తర్వాత గానీ జ్వరం, జలుబు లాంటివి కనిపించడం లేదు. ఆ పాటికే మరింత మందికి వైరస్ సోకుతోంది. దక్షిణ కొరియాలో ఒకే ఒక మహిళ కారణంగా సుమారు 1200 మందికి ఈ ప్రాణాంతక వైరస్ సోకింది. సూర్యాపేటలోనూ ఓ మహిళ ఇలాగే వైరస్ వ్యాప్తికి కారణమైంది. సూర్యాపేట పట్టణంలో ఓ కిరాణా షాపు నిర్వాహకుడికి కరోనా వైరస్ ఎలా వ్యాపించిందనేది మిస్టరీగా మారింది. అతడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవడం, కరోనా రోగులతో డైరెక్ట్ కాంటాక్ట్ కూడా లేకపోవడంతో ఈ కేసు సవాల్ గా మారింది. దీంతో పోలీసులు విభిన్న మార్గాలను అన్వేషించారు. చివరికి సీసీటీవీ కెమెరాల ఆధారంగా మిస్టరీ చేధించారు. తెలియకుండానే ఒకరి నుంచి అనేక మందికి వైరస్ ఎలా సోకుతుందో, ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలో.. ఈ ఘటన గుణపాఠం నేర్పుతోంది. ఏప్రిల్ 2న సూర్యా పేటలో తొలి పాజిటివ్ కేసు గుర్తించారు. ఈ కేసులో బాధితుడు ఢిల్లీలో మర్కజ్ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చాడు. దీంతో అధికారులు అతడి కుటుంబసభ్యులు, అతడిని కలిసిన వారి నమూనాలను సేకరించి పరీక్షకు పంపారు. ఈ క్రమంలో స్థానిక మెడికల్ షాపులో పనిచేసే ఓ యువకుడికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఢిల్లీకి వెళ్లాచ్చిన వ్యక్తి సదరు మెడికల్ షాపునకు రెండుసార్లు వెళ్లి మందులు కొన్నట్లు తేలింది. చికిత్స కోసం గుంటూరు వెళ్లి ప్రాణం మీదకు… ఆ తర్వాత నాగారం మండలంలోని ఓ గ్రామంలో ఒకేసారి 6 కరోనా కేసులొచ్చాయి. వీరంతా మొదటి పాజిటివ్ కేసు వచ్చిన వ్యక్తి అత్తగారింట్లో వారు కావడం గమనార్హం. ఇక్కడి వరకు ఒకరి నుంచి ఇంకొకరికి వైరస్ ఎలా సోకిందో అధికారులు తేలిగ్గా చేధించగలిగారు. కానీ, సూర్యాపేట మార్కెట్ లో కిరాణా షాపు నిర్వహించే ఓ వ్యక్తి ఏప్రిల్ 5న తనకు జలుబు, జ్వరంగా ఉందని.. పరీక్ష నిర్వహించాలని స్వయంగా ఏరియా ఆసుపత్రికి వచ్చాడు. అక్కడ అతడి నమూనాలు తీసి పరీక్షకు పంపించగా పాజిటివ్ గా వచ్చింది. కిరాణా షాపు వ్యక్తిని కలిసిన 62 మందిని గుర్తించి క్వారంటైన్కు తరలించడంతో పాటు పరీక్షలు నిర్వహించారు. వీరిలో 8 మందికి పాజిటివ్ గా వచ్చింది. వీరిలో ఒకరు బాధితుడి కుమార్తె కాగా, ఏడుగురు వ్యక్తులు అతడి కిరాణా షాపు ఉన్న మార్కెట్ ప్రాంతంలో వివిధ వ్యాపారాలు చేసే వారిగా గుర్తించారు. ఇంత వరకూ ఎలాంటి గందరగోళం లేదు. అయితే, కిరాణా షాపు వ్యక్తికి కరోనా ఎలా సోకిందనేది ప్రశ్నార్థకంగా మారింది. తొలుత పాజిటివ్ వచ్చిన ఇద్దరు రోగులతో ఇతడికి ఎలాంటి సంబంధం లేదు. మెడికల్ షాపునకు వెళ్లలేదు. ఎలాంటి ప్రయాణ చరిత్ర లేదు. దీంతో అతడికి వైరస్ ఎలా వచ్చిందనేది చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాన్ని చేధించడానికి అధికారులు తీవ్రంగా శ్రమించారు. రెండో పాజిటివ్ వ్యక్తి పని చేసిన మెడికల్ షాపులో మందులు కొన్నవారికి ఇచ్చిన బిల్లులో ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగా అధికారులు ప్రయత్నించారు. కానీ, ఎలాంటి సమాచారం లభించలేదు. అన్ని ప్రయత్నాలు చేసిన అధికారులు చివరకు మెడికల్ షాపులో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఇదే కీలక ఆధారాన్ని పట్టించింది. కిరాణాషాపు నిర్వాహకుడి కాంటాక్టులుగా పరీక్షలు చేసిన వారిలో పాజిటివ్ వచ్చిన ఓ మహిళ మెడికల్ దుకాణానికి వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా తేటతెల్లమైంది. మార్కెట్ లో ఎండు చేపలు విక్రయించే ఈమె ఇక్కడ మందులు కొన్నట్లు అధికారులు గుర్తించారు. ఖాళీగా ఉండే సమయాల్లో అష్టాచెమ్మా ఆడటం, తెలిసిన వాళ్లందరి దగ్గరకు వెళ్లి పలకరించడం ఈమెకు అలవాటు. ఇదే కొంపముంచింది. ఈ విధంగా కిరాణాషాపు వ్యక్తితో పాటు మొత్తం 31 మందికి వైరస్ సోకడానికి ఈమే కారణమైంది. ఈ ఘటన తర్వాత మొత్తం 200 మందిని గుర్తించి క్వారంటైన్ కు తరలించారు. వీరిలో మార్కెట్ లో పాజిటివ్ వచ్చిన వారిని కలిసిన 20 మందితో పాటు మార్కెట్ లో పనిచేసేవారి కుటుంబసభ్యులు, వారి సన్నిహితులు ఉన్నారు. 200 మందికి పరీక్షల నిర్వహించగా.. ఏకంగా 31 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో సదరు మహిళ కోడలు కూడా ఉంది. మరో 40 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. కరోనా మహమ్మారి ఎంత ప్రమాదకరమో.. వైరస్ సోకకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఉదంతం తెలుపుతోంది. ప్రస్తుతం 31 మంది రోగులను కలిసిన వారిని గుర్తించి పరీక్షలు నిర్వహించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లా యంత్రాంగంతో డబ్ల్యూ హె వో ప్రతినిధులు కూడా ఉన్నారు.