కిక్కు దింపిన క…రోనా!!

మద్యం లేక మానసిక రోగాలు కొనితెచ్చుకుంటున్న మందుబాబులు

-లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలన్నీ బంద్ -మందు దొరకక ఇంట్లోనే వింతగా ప్రవర్తిస్తున్న తాగుబోతులు -పల్లెల్లో నిత్యం తాగడానికి అలవాటుపడిన జనం – కల్లు దొరకక మానసిక వ్యధతో కుంగిపోతున్న వైనం -ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు పోటెత్తిన రోగులు -కొన్ని చోట్ల పోలీసుల కళ్లుగప్పి జోరుగా అమ్మకాలు

హైదరాబాద్: అన్నా..రేటు ఎంతున్నా కొంటాం..కాస్త మందు ఉంటే చెప్పండన్నా ఎవరివద్దనైనా..లేదా ఎక్కడైనా సీక్రెట్ గా అమ్మే వాళ్ల అడ్రస్ చెప్పినా తెచ్చుకుంటాం.. మీకు శతకోటి దండాలన్నా..ప్లీజ్… ఇలా గ్రూపుల్లో మెసేజ్ లు పెట్టుకుంటున్నారు మందుబాబులు. కరోనా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కడుపులో సమయానికి ముద్ద లేకున్నా ఫర్వాలేదు కానీ చుక్క పడకపోతే కాళ్లు చేతులు ఆడవు. నాలుక పిడచ కట్టుకుపోతుంది. నరాలన్నీ ఒక్కసారిగా లాగుతూ మందు బాబును నిలబడనీయడంలేదు. ఏ బ్రాండ్ అయినా ఫర్వాలేదు పెగ్గు ఉన్నా చాలు అన్నట్లుంది వారి పరిస్థితి. ఏదో ఒకటి నాలుగు చుక్కలు నోట్లో పడితే చాలన్నట్లు మందు కోసం ఉరుకులు పరుగులు తీస్తున్నారు. చివరకు గుడుంబా, నాటుసారాల వైపు చూస్తున్నారు. అదీ లేకుంటే కల్లు కోసం కల్లు దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాటి వనాల వద్ద ఈ మందు బాబుల హాల్ చల్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. కరోనావైరస్ ప్రపంచమంతా పంజా విసురుతోంది. ఈ మహమ్మారి వల్ల దేశదేశాలే స్తంభించిపోయాయి. భారత్ లో కూడా కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో భారత్ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రవాణా మొత్తం బంద్ అయింది. నిత్యావసర వస్తువులు తప్ప ఏవి ప్రజలకు అందుబాటులో లేకుండాపోయాయి. ఈ కరోనా ఎఫెక్ట్ మందుబాబులపై కూడా పడింది. లాక్ డౌన్ వల్ల మద్యం షాపులన్నీ బంద్ చేశారు. దీంతో తాగడానికి మందులేక లిక్కర్ బాబులు గిలగిల కొట్టుకుంటున్నారు. ఇక లిక్కర్ షాపులన్నీ బంద్ కావడంతో మద్యం ప్రియులు ఆన్ లైన్ అమ్మకాలపై దృష్టి పెట్టారు. ఇదే అదునుగా భావించి.. సైబర్ క్రైమ్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. మద్యం సరఫరా చేస్తామని చెబుతూ రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. ఇలా ఆన్ లైన్లో మద్యం ఆర్డర్ చేసి లక్ష రూపాయలు పొగొట్టుకుంది ఓ జంట. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… ముంబైలోని చెంబూరు చెందిన ఓ దంపతులు మార్చి 24వ తేదీన ఆన్లైన్లో మద్యం కోనుగోలు చేయాలనుకున్నారు. దాని కోసం ఆన్లైన్లో సెర్చ్ చేసి ఓ ఫోన్ నెంబర్‌ను తెలుసుకున్నారు. వెంటనే కాల్ చేయగా.. ఆన్ లైన్ కొనుగోలు కోసం రూ.3,000 చెల్లించాలని ఓ వ్యక్తి వారిని కోరాడు. దీని కోసం ఓ ఓటీపీ వస్తోందని, అది చెప్పమని అడిగాడు. ఆ వ్యక్తి మాటలను నమ్మిన దంపతులు.. ఓటీపీని వారికి చెప్పారు. దీంతో వెంటనే బాధితుడి ఖాతా నుండి రూ.30,000 కట్ చేసుకున్నాడు. బాధితుడు వెంటనే ఆ వ్యక్తికి ఫోన్ చేయగా.. ఆ మొత్తం పొరపాటున కట్ అయ్యాయని.. వెంటనే వాపసు చేస్తామని చెప్పాడు. అలా… సుమారు ఆరుసార్లు ఓటీపీ కోరుతూ రూ. 1.03 లక్షలు దోపిడి చేశారు. ఆ తర్వాత బాధితుడు కాల్ చేయగా తమకు డబ్బు జమ కాలేదని సరుకుని డెలివరీ చేయలేమని.. మరొక కార్డు ఉపయోగించి చెల్లింపులు జరపాలని తెలిపాడు. దీంతో కంగుతిన్న ఆ దంపతులు మోసం చేశారని భావించి తిలక్ నగర్ పోలీసులకు మార్చి 27వ తేదీన ఫిర్యాదు చేశారు. కరోనా వ్యాప్తితో లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు మూసివేయడంతో.. మందు బాబులు విలవిలలాడిపోతున్నారు. మద్యానికి బానిసైన మందుబాబులు అయితే ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు మద్యం చుక్క పడందే రోజు ప్రారంభించని వారికైతే లాక్ డౌన్ ఒక శాపంగానే ఉంది. ధైర్యం చేసి బయటకు వెళితే పోలీసులు బడితె పూజ చేయడంతో మందుబాబులకు అర్థం కావడంలేదు. అయితే కేరళలో ఓ మందుబాబు అయితే రోజుల పాటు గొంతులో చుక్క పడకపోవడంతో ఏకంగా ఆత్మ హత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే త్రిసూర్ జిల్లాకు చెందిన సనోజ్(35)కు గత వారం రోజుల నుంచి మద్యం లేకపోయే సరికి తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేరళ వ్యాప్తంగా ఇప్పటికే మందు బాబులు మందు పడక నరాలు జివ్వుమని లాగుతుండటంతో ఏం చేయాలో అర్థం కాక డీఅడిక్షన్ సెంటర్ లో చేరారు. మందుబాబులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి.. వారిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ మందు బాబు మాత్రం నిత్యావసరాల లాగానే ఇంటికే మద్యం సరఫరా చేసే విధంగా అనుమతివ్వాలని ఓ వ్యక్తి కేరళ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై కోర్టు తీవ్రంగా స్పందించింది. కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడింది. పిటిషనర్‌కు కోర్టు రూ. 50 వేలు జరిమానా విధించింది. ఫైన్ రెండువారాల్లోగా చెల్లించాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. లాక్ డౌన్ నేపథ్యంలో దేశం మొత్తం ఇంటికే పరిమితమైంది. అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని బంద్ అయ్యాయి. దేశం లాక్ డౌన్ అయినప్పటి నుంచీ ‘చుక్క’ లేక నాలుక అల్లాడిపోతుంటే మందు బాబులు విలవిల్లాడిపోతున్నారు. నాలుక ‘తడుపుకునేందుకు’ పడరాని పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా గోవాలో తయారయ్యే సంప్రదాయ మద్యం ‘ఉరక్’, ‘ఫెనీ’లకు అలవాటు పడిన మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు గ్రామాల ప్రజల కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. సాధారణ రోజుల్లో గోవా వెళ్లి ఇష్టమైన ‘పానీయాన్ని’ సేవించే మహారాష్ట్రలోని విర్డీ, తాలెఖోల్ గ్రామాల ప్రజలు గత మూడు రోజులుగా విలవిల్లాడిపోతున్నారు. గోవా వెళ్లే మార్గాలన్నీ మూసుకుపోవడంతో ఇప్పుడు సరికొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. అటవీ దారులను నమ్ముకుని ఎవరికీ కనిపించకుండా నడకందుకుంటున్నారు. ఉద్యోగ, ఉపాధిరీత్యా ఇన్నాళ్లూ హైదరాబాద్ సహా పట్టణాల్లో ఉన్నవారంతా లాక్ డౌన్ పుణ్యమా అని పల్లెబాట పట్టారు. మద్యం లభ్యం కాకపోవడం… దొరికినా భారీ రేట్లు పలుకుతుండడంతో కల్లు సేవించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని తాటి వనాల్లో ఎక్కడ చూసినా మందుబాబుల సందడే కనిపిస్తోంది. దీనికితోడు చికెన్ ధరలు కూడా పడిపోవడంతో కల్లు చుక్క.చికెన్ ముక్కతో ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో మొన్నటివరకు రూ.20 నుంచి 30 వరకు దొరికే కల్లు సీసా ఇప్పుడు రూ.40 నుంచి రూ.50 వరకు పలుకుతోంది. పట్టణాలు, మండలాల్లో కల్లు దుకాణాలు బంద్ కావడంతో కల్లు ప్రియులు గందరగోళంలో పడ్డారు. కల్లు డిపోలు తెరవాలని ముస్తేదార్లపై ఒత్తిడి తెస్తున్నారు. కలుకు బానిసలైన కొంతమంది మాత్రం మానసికంగా బాధపడుతూ ఆస్పత్రుల పాలవుతున్నారు. 

ఆస్పత్రులకు క్యూ కడుతున్న కల్లు బాధితులు నిజామాబాద్ జిల్లాలో కల్లు ప్రియులు ఆందోళనకు గురవుతున్నారు. లా డౌన్ కారణంగా కల్లు దుకాణాలు మూతపడటంతో కత్తీ కల్లు బాధితులు మతి స్థిమితం తప్పి ప్రవర్తిస్తున్నారు. దీంతో చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు … వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా నగరంలోని ముదిరాజ్ గల్లిలో భూషణ్ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందారు. అయితే లాక్ట్రాన్ కారణంగా కల్లు దొరకకపోవడంతో పిట్స్ వచ్చి మృతి చెందాడని స్థానికులు చెబుతున్నారు. వైన్ షాపులో చోరీ ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో మందుబాబులు ఏకంగా వైన్ షాపుకే కన్నం వేశారు. చేతికి అందినన్ని మందు బాటిల్స్ ను పట్టుకెళ్లారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజీగూడెంలోని శ్రీ సాయి వైన్స్ లో ఆగంతకులు షాపు షట్టర్స్ పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఫిర్యాదు అందుకున్న సివిల్, ఎక్సైజ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, విచారణ చేపట్టారు. లా జొనే అసలు పొరుగు గ్రామాల నుంచి కొందరు వ్యక్తులు షిరోలి వచ్చినట్టు గురువారం వల్పోయి సీఐ శివరామ్ వైగాంకరకు సమాచారం అందింది. దీంతో దర్యాప్తు ప్రారంభించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విరి, తాలెఖోల్ గ్రామాల ప్రజలు ఇక్కడి సంప్రదాయ లిక్కర్ తయారీ యూనిట్ల వద్దకు వచ్చినట్టు తేలింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. తర్వాత తెలిసిందేమిటంటే.. వారంతా ఇక్కడ తయారయ్యే ‘ఉరక్’, ‘ఫెనీ’ కోసం ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారని. ఈ విషయం తెలిసిన వెంటనే కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల వద్ద కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసినట్టు సీఐ వైగాంకర్ తెలిపారు. ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి మందుబాబులు క్యూ కడుతున్నారు.. ఇదేంటి ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి ఎందుకు..? మందుబాబులకు అక్కడేం పని..? మద్యం విక్రయాలు చేస్తున్నారా…? ఆగండాగండి.. అదేంకాదండి బాబు.. మద్యం లేక వెర్రి చేష్టలు చేస్తున్న వారందరిని తమ కుటుంబ సభ్యులు అక్కడికి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించారు. దీనికితోడు తెలంగాణలోనూ సీఎం కేసీఆర్ లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. కేవలం ఒక్క నిత్యావసర సరుకులు, ఇతర అత్యవసర సేవలు తప్పితే మిగిలిన వారెవరూ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆదేశాలు ఇచ్చారు. దీంతో పోలీసులుసైతం పకడ్బందీగా విధులు నిర్వహిస్తుండటంతో బయటకు వచ్చేందుకు ప్రజలు వెనకాడుతున్నారు. లా డౌన్ నేపథ్యంలో మద్యం షాపులను పూర్తిగా బంద్ చేశారు. దీంతో ప్రతీరోజూ మద్యానికి అలవాటు పడిన ప్రజలు మందు దొరక్క తిక్కతిక్కగా చేస్తున్నారు. మద్యం కోసం పలువురు ఆడవాళ్లు, మగవాళ్లు ఎక్కడ దొరుకుతుందా అని వెంపర్లాడుతున్నారు. మందు దొరక్కమైండ్ పనిచేయక ఆత్మహత్యలకు పాల్పడ్డుతున్నారు. తాజాగా మద్యానికి బానిసైన ఓ యువకుడు హైదరాబాద్లో నడి రోడ్డుపై గొంతు కోసుకున్నాడు. ఇటీవల మద్యం కోసం ఏకంగా ఒకడు సెల్ టవర్ ఎక్కాడు. అదేవిధంగా వికారాబాద్ జిల్లా తోరుమామిడికి చెందిన మొగులయ్య అర్ధరాత్రి దాటక ట్రాన్సఫార్మర్ ను పట్టుకొని తీవ్ర గాయాలతో మృతిచెందాడు. వెల్లుర్తి మండలం మూసాయిపేటలో చెందిన కాశమైన కిష్టయ్య ఇంట్లోనే దూలానికి ఉరివేసుకొని చనిపోయాడు. మెదక్ జిల్లా చేగుంటకు చెందిన మహిళ కల్లు దొరక్క మతిస్థిమితం కోల్పోయి ఇంట్లోనే కింద పడిపోయి మృతిచెందింది. నిజాంపేటలో కిష్టయ్య అనే వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన సయ్యద్ కల్లు దొరక్కపిచ్చిపిచ్చిగా ప్రవర్తించి కత్తి తెచ్చుకొని పొట్ట భాగంలో కోసుకున్నాడు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మందుకు బానిసలైన వారు మైండ్ పనిచేయక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో వైద్యం కోసం వారి వారి కుటుంబ సభ్యులు పిచ్చిగా ప్రవర్తించే మందుబాబులను ఎర్రడగడ్డలోని మెంటల్ ఆస్పత్రికి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కరోజే 100 మంది ఓపీ ఉన్నట్లు వారిలో అందరూ మందుకు బానిసలై ప్రస్తుతం పిచ్చిగా ప్రవర్తిస్తున్న వారేనని అక్కడి వైద్యులు పేర్కొంటున్నారు.