మర్కజ్ మసీదు మూసివేత

నిజాముద్దీన్లో మసీదుకు సీల్ వేసిన ఢిల్లీ అధికారులు

న్యూఢిల్లీ : ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదు దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. మర్కజ్ లో ఈ నెల నిర్వహించిన మతపరమైన ప్రార్థనాల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే మసీదును అధికారులు మూసివేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ ఆదేశాల మేరకు మసీదుకు సీల్ వేశారు. అలాగే మర్కట్లో ప్రార్ధనలు నిర్వహించిన మతపెద్దలపై పోలీసు కేసు నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో మర్కజ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బందోబస్త్ ను ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో అక్కడి పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. కాగా మర్కజ్ ప్రార్ధనలకు ఇండోనేషియా, థాయ్ లాండ్, నేపాల్, మలేషియా, సౌదీ అరేబియా వంటి దేశాలకు చెందిన దాదాపు 280 మంది హాజరయ్యారు. దీంతో ఆ ప్రార్ధనలో పాల్గొన్న వారికి వైరస్ సోకే అవకాశం ఉందని ఢిల్లీ వైద్యులు భావిస్తున్నారు. మరోవైపు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వెలుగుచూసిన కరోనా మూలాలు ఢిల్లీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ సమావేశానికి వెళ్లి వచ్చిన వారిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు మర్కజ్ లో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. దీనిలో తెలంగాణకు చెందిన ఆరుగురు, కశ్మీర్ కు చెందిన ఒకరు మరణించడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మరోవైపు ప్రార్థనల్లో పాల్గొన్న 1200 మందికిపైగా కరోనా అనుమానితులను అధికారులు క్వారెంటైన్ ను తరలించారు. వీరిలో ఇప్పటి వరకు 24 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. మిగిలిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే వీరిలో పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని ప్రభుత్వ కోరుతోంది. ఇక ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారి కోసం అధికారులు జల్లెడపడుతున్నారు. దేశ రాజధానిలో నిజాముద్దీన్ అలజడి కొనసాగుతోంది. నిజాముద్దీన్ లోని మర్కజ్ భవనం నుంచి బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు కరోనా వైరస్ అనుమానంతో 860 మందిని దిల్లీలోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఇంకా 300 మందికిపైగా ఈ భవనంలో ఉన్నట్లు అధికారుల గుర్తించారు. మర్కజ్ భవనంలో ఉన్న వ్యక్తుల్లో చాలా మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఆస్పత్రికి తరలించిన వారిలో పలువురికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇక్కడ జరిగిన సమావేశంలో పాల్గొని వెళ్ళిపోయిన ఇతర రాష్ట్రాలకు చెందిన వారిలో 10మంది కరోనాతో మృతి చెందారు. ఈ నెల 1 నుంచి 15 వరకు జరిగిన మత ప్రార్థనల్లో దాదాపు 2,500 మంది పాల్గొన్నట్టు భావిస్తున్నారు. లాక్ డౌన్ విధించిన తర్వాత మర్కజ్ భవనంలోనే 1200 మంది వరకు ఉన్నట్లు అధికారులు గుర్తంచారు. లాక్ డౌన్ తర్వాత కూడా పెద్ద సంఖ్యలో ఒకే చోట ఉండటంపై చర్యలు తీసుకోవాలని దిల్లీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ఈ నెల 24న నోటీసు ఇచ్చారని… స్వస్థలాలకు వెళ్లేందుకు వాహనాలు లేకపోవడంతో అంతా ఇక్కడే ఉన్నారని మర్కజ్ అధికార ప్రతినిధి తెలిపారు. కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని దిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. జవహర్ లాల్ నెహ్రూ స్టేడియాన్ని క్వారంటైన్ కేంద్రంగా మార్చేందుకు దిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది.