ధరణీ క్షేత్రంలో ‘భూమాత’
రెవెన్యూ శాఖకు సరికొత్త పేరు యోచనలో కేసీఆర్
- నూతన రెవెన్యూ చట్టం రూపకల్పనలో సీఎం సంచలన నిర్ణయం
- రెవెన్యూ శాఖలో ఎక్కువ శాతం భూ అంశాలే కావడం కారణం
- బ్రిటీష్ కాలంనాటి రెవెన్యూ శాఖ పేరు మార్పునకు కసరత్తు
- పేరు మార్పుతోబాటు శాఖ తీరు ప్రక్షాళన
- లంచాలు లేని శాఖలా తీర్చిదిద్దాలనే ఆశయం
- ధరణి వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం
- మధ్యవర్తులుల ప్రమేయం లేకుండా చేయడమే లక్ష్యం
- దసరా తర్వాత పాలనలో కొత్త పుంతలు
- అవసరమైతే వీఆర్వో వ్యవస్థ సైతం రద్దు
- కలెక్టర్లకూ పేరు మార్పునకు సంకేతాలు
హైదరాబాద్:
నూతన రెవెన్యూ చట్టం రూపకల్పన నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ శాఖ పేరు మార్చేందుకు కసరత్తులు ప్రారంభిస్తున్నట్లు సమాచారం. గతంలో రెండు రోజులపాటు కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ విషయం చర్చించినట్లు తెలుస్తోంది. రెవెన్యూ శాఖలో సింహభాగం భూములకు సంబంధించిన అంశాలు ఉండటంతో ‘భూమాత’ అనే పేరును కేసీఆర్ పరిశీలిస్తున్నారు. భూమాత శాఖలో కేవలం భూములకు సంబంధించిన అంశాలనే చేర్చాలని భావిస్తున్నారు. రెవెన్యూ అనేది బ్రిటిష్ కాలంలో భూమి శిస్తు, పన్ను వసూళ్లకు సంబంధించిందనీ, ప్రస్తుతం భూములకు ఎలాంటి పన్నులు లేవు కాబట్టి ఆ పదాన్ని మార్చాలని కేసీఆర్ అభిప్రాయ పడుతున్నారు. ఈ విషయంపై మంగళ, బుధవారాల్లో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో కూడా ప్రస్తావించారు.
ఇప్పటికే ధరణి పేరుతో ఒక వెబ్సైట్ ఉండటంతో అదే ధరణి లేదా భూపరిపాలన పేర్లను కూడా ప్రతిపాదనలోకి తీసుకున్నారు. అయితే భూమాత అనే పేరుపైనే ముఖ్యమంత్రి ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది.
బడ్జెట్ సమావేశాల్లోనే కొత్త చట్టం..
రెవెన్యూ శాఖలో తరచూ అవినీతి కేసులు నమోదవుతున్నాయన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. వీఆర్వో వ్యవస్థను కూడా రద్దు చేసి, ఉద్యోగులను మరో శాఖకు కేటాయించాలని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ చివరి వారంలో నిర్వహించనున్న పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాల్లోనే నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు.
తొలుత రెవెన్యూ శాఖను పంచాయతీ రాజ్ లేదా వ్యవసాయ శాఖలో విలీనం చేయాలని భావించినప్పటికీ, భూములకు సంబంధించిన అంశం కాబట్టి నిర్ణయం మార్చుకున్నారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో భాగమైన ఆబ్కారీ, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లలకు మరో కొత్త శాఖను ఏర్పాటు చేసి, భూముల అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా కొత్త శాఖను నెలకొల్పాలని నిర్ణయించారు.
”ధరణి” రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరికార్డుల శుద్ధీకరణ ప్రాజెక్టు. దీని ద్వారా ఏకబిగిన రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములను సాఫ్ట్వేర్ ద్వారా మ్యుటేషన్ చేసి రైతులకు అత్యంత సాంకేతికతతో కూడిన పట్టాదారు పాసుపుస్తకం అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ధరణి వెబ్సైట్ రూపొంది దాదాపు సంవత్సర కాలం గడుస్తున్న భూముల మార్పులు, చేర్పులు, మ్యుటేషన్లు గాడిన పడలేదంటే అతిశయోక్తి కాదు.
సమయానికి తెరుచుకోని వెబ్సైటు, పెండింగ్లో ఉండి సరిచేయాల్సిన వందలాది రికార్డులు, కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణలు, తీవ్ర వత్తిడిలో నిరుద్యోగులు వెరశి ప్రభుత్వం ఆశించిన విధంగా ”ధరణి” నుండి ఫలితాలు రాకపోవడం. అనుకున్నదొక్కటి అయినదొక్కటి అనే చందంగా తయారైంది, పని చేయకు ంటే రైతుల ఆక్రోశం, రికార్డులు పెండింగ్లో ఉంటే పై అధికారుల ఆగ్రహం. రెంటికి చెడ్డ రేవైంది తహశీల్దారు కార్యాలయాల్లో ఉద్యోగుల పరిస్థితి. దాదాపు రాష్ట్రంలోని అన్ని మం డలాల్లో దాదాపు ఇదే పరిస్థితి. ఎన్ని సార్లు ఉద్యోగ సం ఘాలు రిప్రజంటేషన్ల ద్వారా ధరణి ప్రాజెక్టు సరిగా లేదని విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఉద్యోగులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
ధరణికి ముందు భూరికార్డుల నిర్వహణ ఎలా ఉండేది?
ధరణికి ముందు భూరికార్డులు వెబ్ల్యాండ్ సాఫ్ట్వేర్ ద్వారా మార్పులు చేపట్టేవారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రికార్డులలో తప్పు ఒప్పుల సవరణ పూర్తిగా తహశీల్దారు డిజిటల్ సంతకం ద్వారానే పూర్తి చేసేవారు. సదరు భూమికి సంబంధించి విచారణ గ్రామ రెవెన్యూ అధికారి విచారణ త రువాత ఫారం 8 జనరేట్ చేసిన 15 రోజుల తరువాత ఎటువంటి అభ్యంతరాలు రానట్లయితే తహశీల్దారు అట్టి సర్వే నెంబరుకు డిజిటల్ సంతకం ద్వారా ధవీకరణ చేసేవారు. పట్టాదారు పాసుపుస్తకం కార్యాలయంలోనే ప్రింట్ చేసి ఇచ్చేవారు. ఈ విధానం చాలా సులభతరంగా ఉండేది.
ధరణి ప్రత్యేకతలు ఇవీ
ఇంతకు ముందు వెబ్ల్యాండ్లో ఉన్న సమాచారమంతా ధరణి సాఫ్ట్వేర్ లోకి మార్చిన తరువాత పూర్తిగా మార్చిన తరువాత ఈ కొత్త ప్రక్రియలో పూర్తి సమాచార నిర్వహణ బాధ్య త తహశీల్దార్ ద్వారానే జరుగుతుంది. కొత్తగా బ్యాంకుల కు, వ్యవసాయ శాఖకు, నీటి పారుదల శాఖకు ప్రత్యేక ఆప్షన్లు కల్పించారు. కోర్ బ్యాంకింగ్ తరహాలో ధరణి విధానానికి రూపకల్పన చేశారు. అంటే ఒక రైతు తనకున్న భూమిలో కొంత మేరుకు విక్రయించారనుకుంటే ఆ మొత్తం అమ్మినావిరి ఖాతా నుండి కొనుగోలు చేసిన ఖాతాకు మారుతుందన్నమాట. కానీ ఇవేమి ఇంతవరకు నిర్వహణలోకి రాలేదు. ప్రస్తుత తీరు పరీక్షించి చూసినట్లయితే..
-మీసేవ ద్వారా కొనుగోలు, గిఫ్ట్, వారసత్వం తదితర అంశాల వారీగా దరఖాస్తు చేసుకున్న తరువాత తదుపరి ఆ దరఖాస్తు ఆన్లైన్లో తహశీల్దారు పోర్టల్కు చేరుతుంది.
– తహశీల్దారు అట్టి దరఖాస్తుకు సంబంధించిన వివరాలు క్షుణ్ణంగా పరిశీలించిన పిదప ఫారం 8 ని జనరేట్ చేస్తాడు. ఈ తంతు తప్పనిసరిగా తహశీల్దారు డిజిటల్ సంతకంతో పాటు వేలిముద్ర ద్వారా నడుస్తుంది.
– అభ్యంతరాలు స్వీకరణ కోసం తహశీల్దారు కార్యాలయంలో, ఆ భూమి వివరాలు గల గ్రామంలోన గ్రామ పం చాయితీ నోటీసు బోర్డుపైన అతికిస్తారు. 15 రోజుల్లో ఎటువంటి అభ్యంతరాలు రానట్లయితే దరఖాస్తు ధరణి ఆపరేట ర్ లాగిన్లోకి వెళ్తుంది.
– ధరణి ఆపరేటర్ లాగిన్ నుండి సీనియర్ సహాయకులు యొక్క లాగిన్కు ఫార్వర్డ్ చేస్తారు.
– సీనియర్ సహాయకులు సదరు రికార్డు యొక్క ఫైల్ త యారు చేసి గ్రామ రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ స ంతకాలఫైలును డిప్యూటీ తహశీల్దారుకు పంపుతారు.
– డిప్యూటీ తహశీల్దారు సరిచూసుకుని తన లాగిన్ నుండి తహసీల్దారు లాగిన్కు పంపుతాడు. తహశీల్దారు సదరు రికార్డుకు సంబంధించి డిజిటల్ సంతకంతో పాటు, వేలిముద్ర ద్వారా ధ వీకరణ చేస్తాడు.
-తహశీల్దారు ధవీకరణ జరిగిన 30 నుండి 40 రోజులలోపు రైతుకు పట్టాదారు పాసుపుస్తకం అందజేస్తారు.
అయితే పైననుదహరించినవన్నీ వెబ్సైటు సరిగా ఉంటేనే లేకుంటే అంతే సంగతులు. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు బాగానే ఉంటున్న వెబ్సైటు మధ్యాహ్న సమయంలో నత్త నడకన సాగుతుంది. మళ్లీ తిరిగి సాయంత్రం 7 గంటల నుండి వెబ్సైటు బాగానే పని చేస్తుందని ఉద్యోగులు చెబుతున్నారు. కానీ రాత్రి వేళలో పని చేయడం వల్ల నిద్రలేమి ద్వారా ఉద్యోగులు అనారోగ్యాల భారీన పడుతున్నారు. వెబ్సైటు సరిగా పని చేయకున్నా పై అధికారులతో చీవాట్లు తినడం వల్ల ఉద్యోగుల మనోస్థైర్యం దెబ్బతినే ప్రమాదముంది. దీనితో పాటు ఇటీవల నిర్వహించిన సాదాబైనామా ద్వారా పహాణీలలో పొందుపరచిన రికార్డులన్నీ అస్తవ్యస్తంగా ఉండటంతో భూములలో హెచ్చు తగ్గుల గూర్చి రైతులు సర్వేయర్ చుట్టూ, తహసీల్దారు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.