వందేళ్ల భవనంలో…
- కూలిన పాత అసెంబ్లీ పైకప్పు
- ఆందోళనకు గురైన ఉద్యోగులు
- ముప్పు లేదన్న అసెంబ్లీ కార్యదర్శి
హైదరాబాద్,జ్యోతిన్యూస్ :
రాష్ట్ర అసెంబ్లీ పరిసరాల్లో ప్రమాదం తప్పింది. పాత అసెంబ్లీ భవనం తూర్పు వైపు ఎలివేషన్ పెద్ద శబ్దం చేస్తూ కూలింది. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కార్యాలయ భవనం పైకప్పు గోపురం కూలిపోయింది. దీంతో ఆందోళనకు గురైన భద్రతా సిబ్బంది పరుగులు తీశారు. శిధిలాలు గార్డెన్ ఏరియాలో పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ అసెంబ్లీకి వందేళ్ల చరిత్ర ఉంది. ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ పాలనలో దీని నిర్మాణం ప్రారంభించారు. 1905లో పనులు ప్రారంభం కాగా.. 1913 డిసెంబర్ నాటికి భవన నిర్మాణం పూర్తయింది. ఏడో నిజాం ర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో భవనం అందుబాటులోకి వచ్చింది. మొదట్లో దీన్ని ’మహబూబియా టౌన్హాల్’గా పిలిచేవారు. తర్వాతి కాలంలో ఇదే అసెంబ్లీ అయ్యింది. ప్రజల చందాలతో ఈ భవనాన్ని నిర్మించడం విశేషం. ఇదిలా ఉంటే, కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణాన్ని తెలంగాణ సర్కార్ చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుత సచివాలయ ప్రాంగణంలోనే కొత్త సెక్రటేరియట్, ఎర్రమంజిల్లోని రోడ్లు భవనాల శాఖ ఆవరణలో కొత్త అసెంబ్లీ భవనాలను నిర్మిస్తున్నారు. గతేడాది ఈ నిర్మాణాలకు సంబంధించిన భూమి పూజ చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఇదిలావుంటే తెలంగాణ శాసనసభ పాత భవనం ఘటనపై సభ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహా చార్యులు స్పందించారు. ఏటా గోడలు, సీలింగ్ నుంచి సున్నం, గచ్చు పెచ్చులు జారడం సహజమని పేర్కొన్నారు. అసెంబ్లీ ఇంజనీరింగ్ విభాగం ఆయా ప్రాంతాలను గుర్తించి మరమ్మతులు చేపడతూ ఉందన్నారు. ప్రధాన స్టక్చ్రలో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. పటిష్టంగా ఉన్నదని, అధికారులు, ఇంజనీరింగ్ విభాగం నిత్యం శాసనసభ భవనంతో పాటుగా అనుబంధ కార్యాలయాలు ఉన్న భవనాలను పరిశిలిస్తున్నారని చెప్పారు. ఎల్లవేళలా, అప్రమత్తంగా ఉంటూ, అవసరమైన మేరకు మరమ్మతులు చేపడుతున్నామని ఆయన అన్నారు. పాత భవనం నిర్మించి వందేళ్ళకు పైగా అయిందని, అప్పటి టెక్నాలజీ ప్రకారం డంగు సున్నంతో నిర్మించారని చెప్పారు.