గుర్తించండి…

  • ప్రజలకు వసంతపంచమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
  • యూపిలో వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా పలు కార్యక్రమాలు ప్రారంభం

న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్‌ :
‌ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వసంత పంచమి దేశంలో కొత్త ఆశలను చిగురింపజేయాలని, కొత్త ఉత్సాహాలను నింపాలని, కరోనా మహమ్మారి బాపతు ఆపదలను పూర్తిగా తొలగిపోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ఉత్తరప్రదేశ్‌లో మహారాజా సుహెల్దేవ్‌ ‌మెమోరియల్‌కు, చిత్తౌరా లేక్‌ అభివృద్ధి పనులకు వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ చరిత్ర అనేది దేశానికి బానిసత్వం నుంచి విముక్తి కల్పించిన వారి రచనల్లో, బానిస మస్తత్వం కలిగిన వారి మాటల్లో మాత్రమే లేదని, సాధారణ ప్రజల జానపద పాటలు, కథల్లోనూ దేశ చరిత్ర దాగి ఉన్నదని ప్రధాని మోదీ చెప్పారు. జానపదాల ద్వారానే దేశ చరిత్ర తరతరాలకు అందించబడుతున్నదని ఆయన చెప్పారు. దేశానికి స్వాతంత్య్ర వచ్చి 75 ఏండ్లు కావస్తున్నా మహారాజా సుహెల్‌దేవ్‌ ‌లాంటి యోధుల త్యాగాలను, పోరాట పటిమను,పరాక్రమాన్ని, అమరత్వాన్ని భావితరాలకు చాటిచెప్పే పెద్ద కార్యక్రమాలు ఏవి జరుగడం లేదన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పిం చిన వారికి చరిత్రలో సముచిత స్థానం కల్పించకపోవడం మన దౌర్భాగ్యమని ప్రధాని వ్యాఖ్యానించారు.చరిత్ర సృష్టించిన నిజమైన యోధులకు చరిత్రకారులు అన్యాయం చేశారని, చేయాల్సినంత మోసం చేశారని ఆయన ఆవేద న వ్యక్తంచేశారు. అయితే, ఆ వక్రీకరించిన చరిత్రన ప్రస్తుత భారతదేశం సరిచేస్తున్నదని ప్రధాని చెప్పారు.