తెలంగాణ టాప్…
- కరోనా కేసుల కట్టడిలో తెలంగాణ టాప్
హైదరాబాద్,జ్యోతిన్యూస్ :
కరోనా కేసుల కట్టడిలో తెలంగాణ టాప్లో ఉంది. దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ఈ వైరస్ నివారణలో తెలంగాణ రాష్ట్ర టాప్లో నిలిచినట్లు ఆర్థిక సర్వే 2020-21 తేల్చింది. కొవిడ్ బాధితుల మరణాలు కూడా తక్కువే అని స్పష్టం చేసింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంపై ఆర్థిక సర్వే ప్రశంసల జల్లు కురిపించింది. ప్రభుత్వ చర్యలు, పకడ్బందీ ప్రణాళికతోనే ఇది సాధ్యమైందని తెలిపింది. ఆదివారం వరకు నమోదైన కరోనా కేసులను పరిశీలిస్తే.. తెలంగాణలో అత్యల్పంగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో ప్రస్తుతం 1,748 యాక్టివ్ కేసులు ఉంటే, మరణాల సంఖ్య 1,616గా ఉంది. అదే తమిళనాడు రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,275, మరణాల సంఖ్య 12,413గా నమోదైంది. ఇక కేరళలో భారీ స్థాయిలో యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 63,577 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మృతుల సంఖ్య 3,971కి చేరింది. ఏపీలో మాత్రం యాక్టివ్ కేసులు స్వల్పంగా(797) ఉన్నప్పటికీ, కరోనా మరణాలు 7,162 సంభవించాయి. కర్ణాటకలో 5,910 యాక్టివ్ కేసులు ఉండగా, మరణాలు 12,263. మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 33,269 కాగా, మృతుల సంఖ్య 51,489కి చేరింది. కరోనా విజృంభణ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,070 కొవిడ్ ర్యాపిడ్ టెస్టుల సెంటర్లను ఏర్పాటు చేసింది. ఎక్కడికక్కడ కరోనా టెస్టులు నిర్వహించి, వైరస్ నివారణకు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇక కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నవారికి హోం ఐసోలేషన్లోనే ఉంచి మెడిసిన్స్ను అందించింది ప్రభుత్వం. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య వివరాలను తెలుసుకుంటూ తగు సూచనలు, జాగ్రత్తలు చెప్పారు వైద్యాధికారులు. ఇక రద్దీ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ.. పరిశుభ్రతకు పెద్దపీట వేసింది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలని పదేపదే హెచ్చరిస్తూ.. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంది.