ఆఖరి ఛాన్స్…

  • ‌నేటి వరకు పట్టభద్ర ఎమ్మెల్సీ ఓటు నమోదుకు ఛాన్స్

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌పట్ట భద్రుల శాసన మండలి నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో ఇంకా పేరు నమోదు చేసుకోలేక పోయిన వారికి చివరి అవకావం వచ్చింది. శనివారం వరకు పేరు నమోదు చేసుకునే ఛాన్స్ ఉం‌ది. ఓటరుగా నమోదు కావడానికి కు మరో అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం నామినేషన్ల స్వీకరణ తుది గడువుకు 10 రోజుల ముందు వరకు ఓటర్ల నమోదు దరఖాస్తులు స్వీకరించి, సత్వరంగా వాటిని పరిష్కరించి అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురించనుంది. ఈ అనుబంధ ఓటర్ల జాబితాలో చోటు సంపాదించిన వారికి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించనుంది. మహబూబ్‌నగర్‌- ‌రంగారెడ్డి- హైదరాబాద్‌ ‌స్థానంతో పాటు వరంగల్‌,‌ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్‌ ‌ప్రకారం ఈనెల 23తో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది. నామినేషన్ల స్వీకరణ గడువు ముగింపునకు 10 రోజుల ముందు అంటే ఈనెల 13 అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో ఓటరు నమోదు దరఖాస్తులు స్వీకరించి, అర్హులకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ ‌గోయల్‌ ‌తెలిపారు. వరంగల్‌ ‌పట్టభద్రుల మండలి స్థానం పరిధిలో మొత్తం 4,91,396 మంది, ’మహబూబ్‌నగర్‌’ ‌పట్టభద్రుల మండలి స్థానం పరిధిలో 5,17,883 మంది గత నెలలో ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో చోటు సంపాదించారు. ప్రస్తుత ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎన్‌.‌రామచంద్రరావు పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది.