సిద్ధించిన చిరకాల స్వప్నం
రంగనాయకసాగర్ ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసే కార్యక్రమం ఆవిష్కృతం
సిద్ధిపేట: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిస్కృతమైంది. చందలాపూర్ శివారులో నిర్మించిన రంగనాయకసాగర్ ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసే కార్యక్రమాన్ని మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రారంభించారు. రిజర్వాయర్లో 134.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు మోటార్లను ఏర్పాటు చేశారు. ఒకే ఒక మోటార్ 24 గంటల్లో 0.25 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యంతో పనిచేస్తాయి. మూడు టీఎంసీల కెపాసిటి కలిగిన రిజర్వాయర్లో నాలుగు మోటార్లు మూడు రోజులు నడవగా రిజర్వాయర్ నిండుతుంది. ఇక్కడి నుంచి మల్లన్నసాగర్, మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులోకి నీటిని తరలిస్తారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో బైపాస్ కాలువ ద్వారా నేరుగా గజ్వేల్ నియోజకవర్గం, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ లోకి నీటిని పంపింగ్ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే శ్రీరంగనాయక సాగర్ లో దశలవారీగా మొదట ఒక టీఎంసీ నీటిని నింపి ప్రాజెక్టు కట్ట సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. అన్ని సవ్యంగా ఉంటే మరో టీఎంసీ, ఆ తర్వాత ఏ సమస్య రాకపోతే పూర్తి రిజర్వాయర్ నింపుతారు. ఈ రిజర్వాయర్ ద్వారా నియోజకవర్గంలో దాదాపు 70కి పైగా చెరువుల్లోకి నీటిని నింపేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాజెక్టుల్లో నీరు నింపడం ద్వారా సిద్దిపేట జిల్లాలో 70వేలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 30వేల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు సిద్దిపేట ఒడిలో గోదారమ్మ జలసవ్వడి చేసింది. చంద్ఘాపూర్ వద్ద రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు మోటార్ ఆన్ చేసి రంగనాయకసాగర్ జలాశయంలోకి గోదావరి జలాలు విడుదల చేశారు. తొలుత చండ్లాపూర్లోని రంగనాయకస్వామి ఆలయంలో మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సొరంగంలోని పంప్ హౌజ్ వద్ద పంపన్ను ప్రారంభించారు. నీటిని ఎత్తిపోసే వ్యవస్థ వద్ద మంత్రులు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, సతీష్, యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు ఫారుక్ హుస్సేన్, వెంకటేశ్వర్లు, కలెక్టర్ వెంకటరామారెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు జలహారతి ఇచ్చారు. కరోనా వైరస్ నేపథ్యంలో సాదాసీదాగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. 2,300 ఎకరాల్లో రూ.3,300 కోట్ల వ్యయంతో మూడు టీఎంసీల సామర్థ్యంతో ఈ జలాశయం నిర్మించారు. జలాశయం ప్రారంభం కావడంతో సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని 1,14,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.