3 నెలలు ఇంటి అద్దె వసూలు చేయొద్దు
ఆ తర్వాత సులభ వాయిదాల్లో తీసుకోవాలి టీ. ప్రభుత్వ ఆదేశాలు
హైదరాబాద్: కరోనా నియంత్రణకు అమలు చేస్తున్న లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి, ఏప్రిల్, మే నెలలకు కిరాయిదారుల నుంచి యజమానులు ఇంటి అద్దెను వసూలు చేయరాదని ఆదేశిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు (జీవో నెం. 184) జారీ చేసింది. మూడు నెలల తరువాత ఆ మొత్తాన్ని సులభ వాయిదాల్లో తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూడు నెలల అద్దె బకాయిలపై ఎలాంటి వడ్డీని వసూలు చేయకూడదని ఆదేశించారు. ‘రాష్ట్రంలోని ప్రజల్లో చాలా మంది అద్దె ఇళ్లలో ఉంటున్నారు. వారి ఆదాయంలో 40 శాతం మేరకు అద్దెలు చెల్లిస్తున్నారు. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని అద్దె చెల్లించకపోతే ఇల్లు ఖాళీ చేయించడడం వంటివి ఇబ్బందికరంగా మారతాయి. ఆంక్షల వల్ల వారు మరో చోటికి వెళ్లడం సాధ్యం కాదు. వీటి దృష్ట్యా ప్రభుత్వం అద్దె ఇళ్లలో వారిని కొనసాగించేలా, ఎక్కడా ఖాళీ చేయించడం వంటివి జరగకుండా ఈ ఉత్తర్వులను జారీ చేసింది. విపత్తు నిర్వహణ చట్టంలోని 2005 సెక్షన్ 38 (2) (1), అంటువ్యాధుల చట్టం 1897 ప్రకారం సంక్రమించిన అధికారాల మేరకు మార్చి, 2020 నెల నుంచి మూడు నెలల పాటు ఇళ్ల అద్దె వసూలు చేయరాదని యజమానులను ఆదేశిస్తున్నాం. ఈ ఆదేశాలను ఉల్లంఘించి, అద్దె కోసం వేధించినా, ఇల్లు ఖాళీ చేయించినా అంటువ్యాధుల చట్టం- 1897లోని సెక్షన్ 3 ప్రకారం, విపత్తు నిర్వహణ చట్టం 2005 సెక్షన్ 51 నుంచి 58 మేరకు కఠిన చర్యలుంటాయి’ అని సీఎస్ తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, పురపాలక కమిషనర్లు ఈ ఉత్తర్వులను విధిగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. మూడు నెలల తర్వాత అద్దె బకాయిలు వాయిదాల రూపంలో చెల్లించే విషయంలో ఇంటి యజమాని, కిరాయిదారు పరస్పర సహకారంతో వ్యవహరించాలని, ఎక్కడైనా సమస్య వస్తే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని ఒక అధికారి ‘ఈనాడు’కు తెలిపారు. దీనిపై అవసరమైతే ప్రభుత్వం వివరంగా మార్గదర్శకాలు జారీ చేయవచ్చని సమాచారం.