వైద్యులకు రక్షణ కల్పిస్తాం

కేంద్ర హోంమంత్రి అమిత్ షా

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో వైద్యుల పాత్ర అమోఘమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. వైద్య సిబ్బందిపై ఎలాంటి దాడులు జరుగకుండా పూర్తి రక్షణ కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. హోంమంత్రి అమిత్ షా ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌తో కలిసి వైద్యులు, ఇండియన్ మెడికల్ అసోషియేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులకు భరోసా కల్పించేలా అమిత్ షా పలు హామీలు ఇచ్చారు. ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో వైద్య సిబ్బంది పై దాడులు జరుగుతుండటంతో బుధవారం దేశవ్యాప్త సింబాలిక్ ప్రొటెస్ట్ నిర్వహిస్తామని వైద్యులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం డాక్టర్లకు పూర్తి రక్షణ కల్పిస్తుందని, ఎలాంటి నిరసనలకు దిగవద్దని హెూంమంత్రి విజ్ఞప్తి చేశారు. ఇంతటి క్లిష్ట సమయంలో నిరసనలకు దిగితే ప్రజలకు తీవ్ర ఇబ్బందుకు కలుగుతాయని చెప్పారు. దీంతో ఆందోళన చేపట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.