మిగతావారి పరిస్థితి ఏమిటి?
వలస కార్మికుల పై తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
హైదరాబాద్: లాక్ డౌన్ నేపథ్యంలో వలస కార్మికుల పరిస్థితి పై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని న్యాయవాది ప్రభాకర్ వాదించారు. అయితే, రాష్ట్రంలో 3లక్షల మంది వలస కార్మికుల్లో 2లక్షల మంది షెల్టర్లలో ఉన్నారని ఏజీ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. మరి మిగతా వలస కార్మికుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. పూర్తి నివేదిక సమర్పించేందుకు గడువు ఇవ్వాలని ఏజీ కోరగా.. ఈ వ్యాజ్యం పై తదుపరి విచారణను మే 6కి వాయిదా వేసింది. లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో వివిధ అంశాలపై దాఖలైన పిటిషన్ల పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆయా పిటిషన్ల పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. కూరగాయల ధరలు పెరిగాయంటూ దాఖలైన వ్యాజ్యం పై తొలుత హైకోర్టు విచారణ జరిపింది. గతేడాది కన్నా 6 శాతం తక్కువ ధరతో కూరగాయలు అందుబాటులో ఉన్నాయని ఏజీ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. కూరగాయల ధరలపై ఈనెల 29లోపు నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైద్య సిబ్బందికి కరోనా రక్షణ కిట్ల సరఫరాపై దాఖలైన పిటిషన్ పైనా ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. వైద్య సిబ్బంది అందరికీ ఎన్ 95 మాస్కులు, పీపీఈ కిట్లు ఇచ్చినట్లు ఏజీ హైకోర్టుకు తెలిపారు. దీని పై పిటిషనర్ల తరఫున న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. చాలా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బందికి కరోనా రక్షణ కిట్లు లేవని చెప్పారు. కరోనా రక్షణ కిట్లు తగినన్ని అందాయా?లేదా? అనే విషయాన్ని ఆస్పత్రుల సూపరింటెండెంట్లు తెలపాలని హైకోర్టు సూచించింది. సూపరింటెండెంట్ల అఫిడవిట్ల ఆధారంగా మే 6లోపు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం లాక్ డౌన్లో వలస కార్మికుల పరిస్థితుల పై దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఏజీ వివరణ ఇస్తూ రాష్ట్రంలోని సుమారు 3లక్షల వలస కార్మికుల్లో 2 లక్షల మంది షెల్టర్లలో ఉన్నారని తెలిపారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ మిగతా కార్మికుల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. దీని పై పూర్తి నివేదిక సమర్పించేందుకు గడువు ఇవ్వాలని ఏజీ కోర్టును కోరారు. అనంతరం ఈ పిటిషన్ పై విచారణను మే 6కి ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.