ఆకలి కేకలు తప్పవా!
లాక్ డౌన్లు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత తప్పదంటున్న యుఎఫ్ఓ
- సంక్షోభం నుంచి బయటపడకపోతే ఆహార కొరత
- హెచ్చరిస్తున్న ప్రపంచ ఆహార సంస్థ
- లాక్ డౌన్ భయంతో అవసరం లేకున్నా కొనుగోళ్లు
- ఒక్కో ఇల్లూ మినీ సూపర్ మార్కెట్లని తలపిస్తున్న వైనం
- కృత్రిమ కొరత సృష్టిస్తున్న దళారులు, వ్యాపారులు
- అన్ని దేశాలకూ నిలిచిపోయిన ఆహార దిగుమతులు
- భారతదేశానికి ఆ భయం ఉండదంటున్న నిపుణులు
- నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభానికి తోడు ఆహార కొరత
హైదరాబాద్: కరోనా మహమ్మారిని తరిమికొట్టేలోగా మనిషిని కడుపాకలి కాటేసే ఉపద్రవం చుట్టుముట్టే ప్రమాదం కనిపిస్తోంది. కరోనా సంక్షోభం నుంచి తొందరగా బయటపడకపోతే ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత తప్పదని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఏకకాలంలో హెచ్చరించాయి. చాలా దేశాల్లో లాక్ డౌన్ విధించడం, దాన్ని కొనసాగించాలని భావించడంతో అంతర్జాతీయ వాణిజ్య ఆహార సరఫరా వ్యవస్థలు తీవ్రంగా స్తంభించిపోయాయని ఈ సంస్థలు పేర్కొన్నాయి. కరోనా లాక్ డౌన్ ఎంతకాలం కొనసాగుతుందోనన్న భయాలతో ఇప్పటికే జనం అవసరానికి మించి ఆహార పదార్థాలు కొని నిల్వ చేసుకుంటున్నారు. దాంతో మార్కెట్లో బియ్యం, గోధుమలు ఇతర పదార్థాలకు చాలా చోట్ల కొరత ఏర్పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. నగరాల్లో సూపర్ మార్కెట్లన్నీ ఖాళీ అవుతున్నాయి. ఈ పరిస్థితి చిన్న పట్టణాల నుంచి గ్రామాలకు కూడా పాకే ప్రమాదం కనిపిస్తున్నది. మాంసం, డెయిరీ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు తదితర నిత్యావసరాలు మార్కెట్లకు తరలించేందుకు ఉత్పత్తిదారులు నానా కష్టాలు పడుతుండగా, వినియోగదారులు అవి దొరక్క అంతే కష్టపడుతున్నారు. ఇప్పటికైతే నిత్యావసరాలకు ఎలాంటి కొరత లేదని అధికారులు అంటున్నారు. అమెరికా, యూరప్ ఖండాల్లో ఆహార పదార్థాల ఉత్పత్తి సంస్థలు సాధారణంకంటే ఎక్కువ సమయం నడిపిస్తూ ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకొంటున్నారు. వాయు, జల రవాణా పూర్తిగా స్థంభించటంతో ఆఫ్రికా నుంచి యూరప్ కు కూరగాయల రవాణా, దక్షిణ అమెరికా నుంచి ఉత్తర అమెరికాకు పండ్ల రవాణా పూర్తిగా ఆగిపోయింది. కూలీలు దొరకక పండ్లన్నీ చెట్ల పైనే పాడయ్యే పరిస్తితి వచ్చింది. భారత్ లో ఇప్పడు మామిడి పండ్లు, ద్రాక్ష సీజన్. కానీ పండ్లు కోసేందుకు కూలీలు దొరకటంలేదు. వరి, గోధుమ వంటి పంటలను హార్వెస్టర్లతో నూర్పిడి చేయవచ్చు. కానీ పండ్ల తోటలకు కచ్చితంగా కూలీలు కావాలి. దాంతో పండ్ల తోటల రైతులు ఆందోళలో ఉన్నారు. పరిస్తితుల్లో వీలైనంత త్వరగా మార్పు రాకుంటే ఆహార పదార్థాలకు కొరత ఏర్పడి ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఈ సంక్షోభం మరికొంతకాలం కొనసాగితే, ఆకలి సృష్టించే అనంత బీభత్సాన్ని ఎలా ఎదుర్కొనగలుగుతాం? ఇప్పటికే పలు దేశాల్లో సూపర్ మార్కెట్లు ఖాళీ అయిపోయాయనీ, అందువల్ల సరఫరా వ్యవస్థలు ఈసరికే వట్టిపోయాయని ఆ మూడు సంస్థలు వివరించాయి. భవిష్యత్తులో ఆహార లభ్యతలో అస్థిర పరిస్థితులు అనివార్యమని కూడా పేర్కొన్నాయి. ప్రపంచీకరణ ఫలితంగా ప్రపంచ జనాభాలో ప్రతి ఆరుగురిలో ఒకరు ఆహారం కోసం దిగుమతుల పై ఆధారపడటమే దీనికారణమంటున్నది. ఈ నేపథ్యంలో ఉత్పత్తి దేశాలు ఎగుమతులను తగ్గిస్తే తీవ్ర ఆహార సంక్షోభానికి , దారితీయకతప్పదు. ఆఫ్రికాలోని అనేక దేశాలు, ఆసియాలో కొన్ని దేశాలు తమ సొంత ఆహారోత్పత్తి సరిపోక దిగుమతుల పై ఆధారపడుతున్నాయి. ఇప్పటికే ఆ దేశాల్లో ప్రజలు తిండి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇది ముందుముందు తీవ్రతరమయ్యే ప్రమాదం ఉంది. అమెరికా, జర్మనీ, బ్రిటన్, చైనా వరుసగా అత్యధిక స్థాయిలో ఆహార ఉత్పతులను ఎగుమతి చేసే దేశాలు. ఇవి కరోనా కోరల్లో చిక్కుకున్నాయి. అంతేకాదు, వాతావరణ మార్పుల ప్రభావం పై జరిగిన ఒక పరిశోధన ఇంతకుముందే ఒక హెచ్చరిక చేసింది. 2050నాటికి సగానికి పైగా ప్రపంచ జనాభా దిగుమతి చేసుకునే ఆహారం పై ఆధారపడాల్సిన దుస్థితి తలెత్తుతుందని చెప్పింది. ఈ ప్రమాదాన్ని కరోనా మరింత వేగవంతం చేస్తుందనే భావన కలుగుతున్నది. మరోవైపు సంపన్నదేశాలు తమ వాణిజ్యావసరాల కోసం ఆహార ఉ త్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో లాక్ డౌన్ వల్ల ఉత్పత్తి దెబ్బతిని పేద దేశాలు ఎక్కువగా ఆహార కొరతను ఎదుర్కొనే పరిస్థితి దాపురిస్తుంది. సంపన్న దేశాలు తమ అవసరాల కోసం ఆహార దిగుమతులను చేసుకొంటూ ఎగుమతులను తగ్గించే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితి తలెత్తితే, పేద దేశాల ప్రజలు బతికి బట్టకట్టేదెలా? పరాధీనత మరింత పెరిగే ప్రమాదం తలెత్తుతుంది. అగ్రరాజ్యాల అదుపాజ్ఞల్లోకి పేదదేశాలు వెళ్లిపోయే అవకాశాలు ఏర్పడుతాయి. ఇప్పటికే ప్రపంచంలో కోట్ల మంది జనం పోషకాహారలేమితో బాధపడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితులు దాపురించకుండా సరైన పరిష్కార మార్గాన్ని కనుగొనాల్సిన బాధ్యత మన ప్రభుత్వాల పైనే ఉంది. మన దేశం విషయానికి వస్తే కరోనా మహమ్మారి మరింతగా విజృంభించకుండా కట్టడి చేసే బాధ్యత, ప్రజలను కనిష్ఠ నష్టంతో బయటపడే సే కర్తవ్యం కేంద్ర ప్రభుత్వానిదే. మన రాజ్యాంగం ఆ మేరకు అధికారాలు, ఆర్థిక వనరులను దానికి దఖలు చేసింది. అయితే తొలినాళ్లలోనే కరోనాను మన సరిహద్దుల్లోకి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను నిర్వర్తించడంలో కేంద్రం ఘోర వైఫల్యం చెందింది. తమ స్వార్థ రాజకీయాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి, ఇప్పుడు మనల్ని చావుబతుకుల మధ్య ఊగిసలాడేలా చేసింది. అంతేకాదు, కరోనాతోపాటు ఆకలి రూపంలో కాచుకు కూర్చున మరో వైరస్ కు మన పేదసాదలను అప్పగిస్తున్నది. వాస్తవానికి మన దేశంలో ఎప్పటినుంచో పేదరికం, నిరుద్యోగం తద్వారా ఉత్పన్నమైన ఆకలి ఉండనే ఉంది. కరోనా విపత్తు విరుచుకుపడటంతో ప్రస్తుత ఆరోగ్య విపత్తు కన్నా రేపు ఆకలి విపత్తు అత్యంత దారుణంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తీవ్ర సమస్య గురించి కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టలేదని స్పష్టమవుతున్నది. చిట్కా వైద్యాలతో కరోనా పై పోరు జనాన్ని ఐక్యం చేశాం, రేపు మన ఓటుబ్యాంకు మరింతగా పెరిగిపోతుంది అనే అంచనాలు, ఊహల్లో తేలియాడుతున్నారే తప్ప ఈ విషమ పరిస్థితిని శాస్త్రీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదుర్కొనడం ఎలా అనే దాని పై దృష్టి కేంద్రీకరించడం లేదు. లాక్ డౌన్తో విలవిల్లాడుతున్న వలస కూలీలు, పేదలు, అనాథల కనీస ఆకలి తీర్చేందుకు తగిన నిధులను కేటాయించాలన్న ఆలోచన కూడా మన ప్రధానికి రాకపోవడం దారుణం. పేదలను పనికి దూరం చేసిన పాలకులు వారి ఆకలి తీర్చే ఏర్పాట్లు చేయకపోతే ఎలా? ఆ సంక్షోభ సమయంలో పలు దేశాలు తమ జీడీపీలో పదిశాతం వరకూ ఆర్థిక ప్యాకేజీలు ప్రకటిస్తుంటే, మోడీ మాత్రం ఒక్క శాతంతోనే సరిపెట్టడమే ఆయన ఆలోచన ఏమిటన్నది బోధపడుతున్నది. ఈ లాక్ డౌన్తో దేశ కార్మికశక్తిలో సగానికి సగం మందికి పనిలేకుండా పోయింది. అసంఘటితరంగంలోని 40 కోట్ల మంది ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ కాలంలో 12కోట్ల ఉ ద్యోగాలు ఊడిపోయాయని లెక్కలు వేస్తున్నారు. ఉన్న ఉద్యోగుల్లోనూ చాలామందికి జీతాల్లో కోత పెడుతున్నారు. భవన నిర్మాణ, గృహ సేవా రంగాల్లో పనిచేస్తున్నవారు, సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల్లో పనిచేస్తున్న వారి లక్షలాది కుటుంబాలు కనీస అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులేక అల్లాడుతున్నాయి. దేశంలో వ్యవసాయరంగం పై ఇప్పటికీ సగానికి సగం మంది ఆధారపడి జీవిస్తున్నారు. చేతికొచ్చిన పంట కోసేందుకు, అమ్మేందుకు వీల్లేక తీవ్రంగా నష్టపోయే ప్రమాదం తలెత్తింది. పరిస్థితి ఇంత విషమంగా ఉంటే పాలకులు మాత్రం కష్టజీవులను ఆదుకునేందుకు కాకుండా, కార్పొరేట్ శక్తుల లాభాలను కాపాడేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఆకలి వైరస్ పేదలను, వలస, వ్యవసాయ, అసంఘటిత రంగ కార్మికులను బలితీసుకునే ప్రమాదం ఉందని స్పష్టమవుతున్నది. కరోనా సంక్షోభం ఆకలి సంక్షోభంగా మారకుండా ఇప్పటికైనా మన పాలకులు తగు చర్యలు తీసుకొనేలా ఒత్తిడి చేసేందుకు తగిన సమయం ఇది! ఊహించని ఉపద్రవం ప్రపంచాన్ని ఆవేదనకు గురి చేస్తుంది . అతివృష్టి , అనావృష్టి పరిస్థితులను తట్టుకుని , పంటలకు వచ్చే చీడపీడలను ఎదుర్కొని ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే కరోనా కాటు వేసింది. ఏ దేశంలో చూసినా పండించిన పంట అమ్ముకునే పరిస్థితి లేకుండా చేసింది . ఎగుమతులు లేవు. దిగుమతులు లేవు. వర్తక వాణిజ్యాలు దెబ్బ తిన్నాయి. ఇక తాజా పరిస్థితులు ఆహార సంక్షోభానికి కారణం అవుతాయనే భావన వ్యక్తం అవుతుంది. ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతుండగా మరి కొన్ని రోజులు లాక్ డౌన్ కొనసాగితే ప్రజలకు ఆహార కొరత ఏర్పడే ప్రమాదం కనిపిస్తుంది. గాంధీ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్ బాధితులకు పౌష్టికాహారం … మెనూ ఇదే ఇక ఇప్పటికే కరోనా సంక్షోభాన్ని అన్ని దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది . ఇక ఈ విపత్తును సమర్థంగా ఎదుర్కోకపోతే ప్రపంచ ప్రజలకు ఆహార కొరత ప్రమాదం పొంచివున్నదని మూడు అంతర్జాతీయ సంస్థల అధిపతులు ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాని అడ్డుకునేందుకు లాక్ డౌన్ ని ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్యం, ఆహారసరఫరా ఊహించని విధంగా తగ్గుముఖం పట్టింది. లాక్ డౌన్ కారణంగా భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడుతుందనే భయంతో అనేక దేశాల్లోని ప్రజలు ముందుగానే సరుకులను కొని పెట్టుకోవడంతో సూపర్ మార్కెట్లు తదితర షాపుల్లో వస్తువుల సరఫరా నిలిచిపోయింది. ఇక పలు నిత్యావసరాలను సప్లై చేసే వాళ్ళు సైతం భవిష్యత్ లో ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందన్న భావనలో నిత్యావసరాలను బ్లాక్ చేస్తున్నారు . ఇది ఒక్క భారత్ లోనే కాదు ప్రపంచ దేశాలు అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉంది . ఆహార లభ్యత పై ఏర్పడుతోన్న సందిగ్ధత అంతర్జాతీయ ఎగుమతులపై ఆంక్షలకు కారణమౌతోంది. ఇది ప్రపంచ మార్కెట్ లో ఆహార కొరతకు దారితీస్తోందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అధిపతి క్యూ డొంగ్యూ హెచ్చరించారు. ఇప్పుడు ఈ విపత్తును సమర్థంగా ఎదుర్కోవాలని, రానున్న కష్టకాలాన్ని సంఘటితంగా ఎదుర్కోవాలని పేర్కొన్నారు .