అమెరికాలో కరోనా కరాళనృత్యం
24 గంటల్లో 4,491 మంది ఈ వైరస్ ధాటికి బలి.. మొత్తం మృతుల సంఖ్య 34,562
వాషింగ్టన్: కరోనా మహమ్మారి వికృతరూపం దాల్చింది. అమెరికా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గడిచిన 24 గంటల్లో ఆదేశంలో ఏకంగా 4,491 మంది ఈ వైరస్ ధాటికి బలయ్యారు. దీంతో అమెరికాలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 34,562కి చేరింది. వైరస్ మొదలైన నాటి నుంచి ఇంతమంది ఒకే రోజు మరణించడం ఇదే తొలిసారి. అయితే, గురువారం వెల్లడించిన మృతుల సంఖ్యలో కరోనా అనుమానిత మరణాలను కూడా కలిపి లెక్కించడం గమనార్హం. అంతకుముందు ఇలాంటి అనుమానిత కేసుల్ని కలపలేదు. నిన్నటి నుంచే అనుమానిత మరణాలను కూడా కరోనా మృతుల కింద పరిగణించడంతో ఒకేసారి భారీగా మరణాల సంఖ్య పెరిగింది. మరోవైపు న్యూయార్క్ నగర యంత్రాంగం కూడా ఈ వారంలో 3,778 అనుమానిత కేసుల్ని కరోనా మృతులుగా పరిగణిస్తామని వెల్లడించింది. అమెరికాలో మొత్తం బాధితుల సంఖ్య 6,75,243కు పెరగడంతో గత రెండు రోజుల్లోనే రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి. 22,170 కరోనా మరణాలతో ఇటలీ రెండో స్థానం.. 19,516 స్పెయిన్ మూడు, 17,920 ఫ్రాన్స్ నాలుగో స్థానంలో నిలిచాయి. అలాగే అమెరికాలో వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువైన న్యూయార్క్ రాష్ట్రంలోనే అత్యధికంగా 12 వేల మంది మృతిచెందారు. ఇక దేశంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు ఆంక్షలను సడలించే పూర్తి అధికారాల్ని ఆయా రాష్ట్రాల గవర్నర్లకే వదిలేస్తున్నట్లు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. కరోనా పోరులో కలిసి పనిచేస్తాం కరోనా వైరస్ పై పోరులో భారత్ తో కలిసి పనిచేస్తామని అమెరికా మరోసారి స్పష్టంచేసింది. వైద్య విధానం, వ్యాక్సిన్ అభివృద్ధిలో ఇరు దేశాలు సహకరించుకుంటాయని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిముఖ్యమైన సమస్యలపై చర్చలతోపాటు.. సమీప భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ల పై ఇరుదేశాల మధ్య సహకారం కొనసాగుతుందని తెలిపారు. వ్యక్తిగత పరిరక్షణ పరికరాలతో పాటు హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి వాటికి అవరోధం లేదని పాంపియో విలేకరులతో జరిగిన టెలికాన్ఫరెన్స్ లో వెల్లడించారు. ఇరు దేశాల జాతీయ భద్రతకు సంబంధించిన ప్రాధాన్యత అవసరాల సరఫరా పై దృష్టి సారించామన్నారు. ఇదిలా ఉంటే, అమెరికాలో కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అమెరికా వ్యాప్తంగా ఈ వైరస్ తో ఇప్పటివరకూ 34 వేల మంది మృత్యువాతపడ్డారు. గడచిన 24గంటల్లో అక్కడ 4491 మరణాలు సంభవించాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.