నవోదయ మైగ్రేషన్ విద్యార్థులు క్షేమం

తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దు… రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

హైదరాబాద్, జ్యోతిన్యూస్ : నవోదయ విద్యా కేంద్రాల్లో మైగ్రేషన్ విధానం ద్వారా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో విద్యను అభ్యసిస్తున్న తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు క్షేమంగానే ఉన్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరారు.కరోనా వైరస్ మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో తమ పిల్లలు ఎలా ఉన్నారో అన్న ఆందోళన వ్యక్తం చేస్తూ కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం బోయినపల్లి వినోద్ కుమార్‌కు ఫోన్ చేశారు.ఈ విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్ చేసిన నేపథ్యంలో వినోద్ కుమార్ తక్షణమే స్పందించారు. నవోదయ విద్యా సంస్థల తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్ అనసూయ తో మాట్లాడారు. రాష్ట్రంలోని 9 నవోదయ విద్యా కేంద్రాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులలో కలుగుతున్న ఆందోళన విషయాన్ని రాష్ట్ర కో ఆర్డినేటర్ అనసూయ దృష్టికి తీసుకెళ్లారు. ఇతర రాష్ట్రాలలో చదువుకుంటున్న రాష్ట్ర విద్యార్థుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరినట్లు వినోద్ కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 500 నవోదయ విద్యా కేంద్రాల్లోని దాదాపు మూడు వేల మంది విద్యార్థులు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలో మైగ్రేషన్ విధానం ద్వారా చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో, క్షేమంగానే ఉ న్నారని, విద్యార్థులను ఆయా రాష్ట్రాల అధికారులు కంటికి రెప్పలా చూసుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వ బాధ్యులు తెలిపినట్లు పేర్కొన్నారు.విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని సూచించారు.ఆయా రాష్ట్రాల విద్యార్థులను ప్రత్యేక బస్సుల్లో వారి వారి స్వస్థలాలకు పంపించే అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్న విషయాన్ని నవోదయ విద్యా సంస్థల అధికారులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.కరోనా వైరస్ ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో ఎక్కడి విద్యార్థులు అక్కడే ఉండటం శ్రేయ స్కరమా..? లేదా వారి సొంత ప్రాంతాలకు పంపడం ఉత్తమమా..? అన్న విషయంలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చించారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లోని విద్యార్థులు క్షేమంగానే ఉన్న దరిమిలా వారి తల్లిదండ్రులు నిశ్చింతగా ఉండాలని వినోద్ కుమార్ కోరారు.