ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
కరోనా నియంత్రణ ప్రదేశాలలో పర్యటించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తో కలిసి గురువారం జీహెచ్ఎంసీ పరిధిలోని కరోనా నియంత్రణ ప్రదేశాల్లో పర్యటించారు. హైదరాబాద్ లో కరోనా విజృంభిస్తోన్న కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలో 123 కంటైన్మెంట్ క్లస్టర్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా మంత్రి కేటీఆర్ కంటైన్మెంట్ ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడ తీసుకుంటున్న చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో గురువారం కమిషనర్ లోకేష్ కుమార్ తో కలిసి ఖైరతాబాద్, విజయ్ నగర్ కాలనీ, మల్లేపల్లిలో పర్యటించారు. నియత్రంణ ప్రదేశాల్లో ఉన్న వాళ్లను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నియంత్రణ ప్రదేశాల్లో ఉన్న ప్రజలకు నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులను అందిస్తున్న విధానాన్ని లోకేష్ కుమార్ కేటీఆర్ కు వివరించారు. కరోనా పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కంటైన్మెంట్ జోన్లలో నిత్యవసర వస్తువులు అందుబాటులో ఉంచామని కేటీఆర్ వెల్లడించారు. ప్రజలంతా ఇళ్లలోనే లాక్ డౌనకు సహకరించాలని కేటీఆర్ సూచించారు. ఇక ఎయిర్ పోర్టులోనే కరోనా నిర్ధారణ రక్త పరీక్షలతో కేవలం 10 నిమిషాల్లోనే ఫలితం! ఎమిరేట్స్ లో ప్రారంభం దుబాయ్: విమానయానంతో ఎంత వేగంగా ప్రయాణించామో, కరోనా వైరస్ కూడా ప్రపంచదేశాలకు అంతే వేగంగా పాకింది. విమాన ప్రయాణాలు చేసే వారిలో వైరస్ ఎవరికి ఉందో? లేదోనని తెలుసుకోలేకపోవడం వైరస్ ఇంత వేగంగా వ్యాపించడానికి ఓ కారణం. ఇప్పటివరకూ విదేశీ ప్రయాణం చేసేవారికి కేవలం స్క్రీనింగ్ మాత్రమే నిర్వహించి కరోనా లక్షణాలు గుర్తించేవారు. కానీ, కరోనా వైరస్ ను అతి తక్కువ సమయంలోనే గుర్తించే సాంకేతికత ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. విమానాశ్రయాల్లో రాపిడ్ కిట్ల సాయంతో కేవలం పది నిమిషాల్లోనే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష నిర్వహించే సదుపాయాన్ని ప్రముఖ విమానయాన సంస్థ ఎమిరేట్స్ తాజాగా ప్రారంభించింది. ఇలా విమానాశ్రయాల్లో కొవిడ్-19 నిర్ధారణ పరీక్ష చేయడం ఇదే తొలిసారని సదరు సంస్థ వెల్లడించింది. దుబాయ్ లో విమాన సర్వీసులు ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఏర్పాట్లు చేశామని ప్రకటించింది. ప్రస్తుతం అక్కడ ఉన్న విదేశీయులు వారి స్వదేశాలకు వెళ్లాలనుకునే వారి కోసమే ఈ సర్వీసులను నడుపుతోంది. దీనిలో భాగంగా తొలుత దుబాయి నుంచి టునీషియా వెళ్లిన ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. విమాన ప్రయాణం ప్రారంభం కాకముందే ప్రయాణీకుల రక్త నమూనాలు సేకరించి కరోనా వైరస్ పరీక్ష చేస్తారు. వీటి ఫలితం కేవలం పది నిమిషాల్లోనే వస్తుందని ఎమిరేట్స్ సంస్థ తెలిపింది. రాబోయే రోజుల్లో ఇదే పద్ధతిని అన్నిరకాల విమానాల్లో అమలు చేస్తామని విమానయాన అధికారులు పేర్కొన్నారు. అరబ్ దేశాల్లో ఇప్పటివరకు దాదాపు 5వేల మందికి కరోనా సోకగా 28మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు లాక్ డౌన్ తో పాటు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.