పీఎం కేర్స్ ఫండ్ కు రూ.500 కోట్లు

ప్రత్యేక నిధి ఏర్పాటుచేసిన పేటీఎం… ఇప్పటికే రూ.100 కోట్ల సేకరణ

న్యూఢిల్లీ: కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు ప్రధాని ఏర్పాటు చేసిన సీఎం కేర్స్ ఫండకు అందించేందుకుగానూ తమ సంస్థ ఇప్పటి వరకు రూ.100 కోట్లు సేకరించినట్లు ప్రముఖ డిజిటల్ లావాదేవీల వేదిక పేటీఎం ప్రకటించింది. రూ.500 కోట్ల సేకరణే లక్ష్యంగా పేటీఎం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. దీనికి ఎవరైనా విరాళాలు అందించేందుకు అనుమతించింది. అలాగే పేటీఎం ద్వారా ఇచ్చే ప్రతి విరాళానికి, చేసే ప్రతి లావాదేవికీ తమ తరఫున అదనంగా రూ.10 కలుపుతామని తెలిపింది. ఇలా 10 రోజుల్లో రూ.100 కోట్లు సమకూరినట్లు సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడు అమిత్ వీర్ తెలిపారు. ఈ నిధికి సంస్థలోని ఉద్యోగులు సైతం విరాళాలు అందజేసినట్లు అమిత్ తెలిపారు. కొంతమంది మూడు నెలల వేతనాలను కూడా విరాళంగా ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రజలంతా ముందుకు వచ్చి పీఎం-కేలో భాగస్వామ్యం కావాలని పేటీఎం పిలుపునిచ్చింది. అలాగే పేదవారి ఆకలి తీర్చడం కోసం కేవీఎన్ ఫౌండేషన్తో కలిసి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి కూడా నిధులు అందజేయాలని కోరారు. కరోనా వైరస్ పోరులో భాగంగా సీఎం కేర్స్ సహాయనిధికి ఇచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు వర్తిస్తుందని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. ఈ నిధికి అందించే విరాళాలకు ఐటీ చట్టంలోని 80జీ కింద నూరు శాతం పన్ను మినహాయింపు ఉంటుందని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇలా తమ యాజమాన్యం ద్వారా ఉద్యోగులు ఇచ్చే విరాళాలకు ప్రత్యేకంగా ఎలాంటి ధృవపత్రాన్ని జారీచేయమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ పేర్కొంది. అయితే యాజమాన్యం ఉద్యోగులకు సంవత్సరం చివరలో ఇచ్చే ఫారం-16లో విరాళం ఇచ్చిన మొత్తాన్ని చూపిస్తాయని తెలిపింది. ఆ టీడీఎస్ పత్రాన్నే విరాళం ఇచ్చిన దానికి రుజువుగా పరిగణిస్తామని పేర్కొంది. చాలా మంది ఉ ద్యోగులు తమ వేతనాల నుంచి విరాళాలు ఇస్తున్న నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) స్పష్టతనిచ్చింది.