క్లోరోక్విన్ పై ఆంక్షలు ఎత్తివేత

అవసరమున్న దేశాలకు సరఫరా చేస్తామన్న భారత విదేశాంగశాఖ

న్యూఢిల్లీ: కొవిడ్-19 చికిత్స కోసం ప్రపంచ దేశాల నుంచి హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధానికి డిమాండ్ పెరుగుతోంది. దీని ఎగుమతుల పై భారత్ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఒత్తిడి ఎక్కువవుతోంది. కరోనా ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో భారత్ పెద్దమనసుతో వ్యవహరించింది. మానవతా దృక్పథంతో క్లోరోక్విన్ సహా అవసరమైన ఇతర ఔషధాల ఎగుమతుల పై ఉన్న నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేస్తున్నట్లు విదేశాంగశాఖ ప్రకటించింది. ఆయా దేశాలకు అససరమైన మేర కొన్ని రకాల మందుల్ని సరఫరా చేసేందుకు అంగీకరించింది. అలాగే పొరుగుదేశాలకు పారాసిటమాల్, హైడ్రాక్సీక్లోరోక్విన్ అవసరమైన మొత్తానికి లైసెన్స్ అనుమతులు కూడా ఇస్తున్నట్లు తెలిపింది. ఈ అంశాన్ని రాజకీయం చేస్తూ భారత్ పై ఆరోపణలు చేసే ప్రయత్నాల్ని ఇంతటితో ఆపాలని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి కొవిడ్-19 చికిత్సకు ఎలాంటి టీకాగానీ, ఔషధంగానీ లేవు. అయితే మలేరియాను నయం చేయడానికి వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ ఆశాజనక ఫలితాలు ఇస్తోందని పరిశోధకులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వీటిని రోగులకు దగ్గరగా ఉండే వ్యక్తులు వాడొచ్చని అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎడీఏ), భారత వైద్య పరిశోధన మండలి సూచించింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఈ మందుకు డిమాండ్ పెరిగింది. అయితే భారత అవసరాలకు సరిపడిన తర్వాత అదనంగా మరో 25 శాతం నిల్వలను ఉంచుకొని.. మిగిలిన హైడ్రాక్సీక్లోరోక్వినిని ఇతర దేశాలకు సరఫరా చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఆయా దేశాల అవసరాల్ని నిశితంగా పరిశీలించి ఎంతమేర సరఫరా చేయాలో నిశ్చయించనున్నట్లు తెలుస్తోంది. నేడు రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో మంత్రుల బృందం సమావేశమై దీని పై అధికారిక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేయకుండా.. కేవలం కొన్ని మినహాయింపులు మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది.