తెలంగాణలో కరోనా ఘంటికలు

  • రాష్ట్రంలో మరో ముగ్గురి మృతి..ఒక్కరోజే 30 కొత్త కేసులు
  • మొత్తం బాధితులు 127 మంది…9కి పెరిగిన మృతులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో బుధవారం మరో ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య తొమ్మిదికి చేరింది. కొత్తగా 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 127కు చేరుకుంది. బుధవారం జరిపిన పరీక్షల్లో 30 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రాత్రి నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులు ఈ వివరాలు వెల్లడించారు. ‘గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు, యశోదా ఆసుపత్రిలో ఒకరు బుధవారం కరోనా వైరస్ కారణంగా మరణించారు. నిజాముద్దీన్ మర్కజ్ కు వెళ్లాచ్చిన వారికి, వారి వల్ల కుటుంబ సభ్యులకు మాత్రమే కొత్తగా వైరస్ సోకుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింద’ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలిపారు. ‘బుధవారం వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన 30 మంది, చనిపోయిన ముగ్గురు కూడా దిల్లీ వెళ్లి వచ్చిన వారే’నని వివరించారు. ‘సోమవారం మరణించిన ఆరుగురిలో అయిదుగురు మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారే. మొదట్లో విదేశాల నుంచి వచ్చిన వారిలో కొంతమందికి, వారి ద్వారా మరికొంత మందికి వైరస్ సోకింది. వారంతా క్రమంగా కోలుకుంటున్నారు. వారిలో చాలా మంది డిశ్చార్జి కూడా అయ్యారు. ఎవరి పరిస్థితి ఆందోళనకరంగా లేదు. ఈ నేపథ్యంలో మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారిలో మరో 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది’ అని వెల్లడించారు. వైద్యపరీక్షలు చేయించుకోవాలి దిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు, వారితో సన్నిహితంగా ఉన్నవారు ఇంకా ఎవరైనా వైద్య పరీక్షలు నిర్వహించుకోకుండా ఉంటే వెంటనే ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. పరీక్షల అనంతరం ఎవరికైనా వైరస్ సోకినట్లు తేలినా, వారి ప్రాణాలు కాపాడడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. ప్రజలు సహకరించాలి రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, దీనికి ప్రజలు కూడా సహకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నిర్వహిస్తున్న లాక్ డౌన్ ను విజయవంతం చేయాలని కోరారు. మరికొద్ది రోజుల పాటు ప్రజలు సహకరిస్తే, రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ఆయన తెలిపారు. వైద్య సిబ్బందికి అవసరమైన పీపీఈ కిట్స్, ఎన్ 95 మాస్కులు, హైడ్రాక్సి క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ మాత్రలు సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. వైద్య పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన మెడికల్ కిట్స్ కూడా సిద్ధంగా ఉంచామని సీఎం వెల్లడించారు. ఆ 160 మంది ఎక్కడ? బుధవారం దాదాపు 500 మంది నుంచి నమూనాలు సేకరించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. దిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి సంబంధీకుల్లో పలువురిని వివిధ ఆసుపత్రుల్లో చేర్చారు. చార్మినార్ వద్ద నిజామియా ఆసుపత్రిలో 80 మందిని, అమీర్ పేటలోని ప్రకృతి వైద్యశాలలో 200 మందిని, మెహిదీపట్నంలోని సరోజినీదేవి ఆసుపత్రిలో 110 మందిని ఉంచారు. దిల్లీ వెళ్లి వచ్చిన 1030 మందిలో 160 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడం ఆందోళనకరంగా మారింది. వీరి ద్వారా సుమారు రెండు వేల మందికి పైగా కరోనా వైరస్ వ్యాప్తి చెంది ఉండొచ్చని వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి.