కార్మిక సంఘాలకు కష్టకాలం..!

యూనియన్లు లేకుండా చేయడమే అసలైన వ్యూహం

  • -ఫలించిన సర్కారు చర్యలు
  • -ఆర్టీసీ వ్యవహారంలో ఆచితూచి అడుగులు
  • – డిమాండ్లు పక్కనపెట్టి దిగివచ్చిన కార్మికులు
  • -కార్మిక సంఘాలపై వేటుకు సిద్ధం…టీఎంయూ ఆఫీసుకు తాళం
  • -సమస్యల పరిష్కారానికి ప్రత్యక్ష ప్రణాళిక
  • -ప్రతి డిపోలోనూ సమస్యల పరిష్కారానికి కృషి
  • -ఇకపై ఆర్టీసీలో ఎన్నికలు ఉండనట్లే!
  • -మున్సిపల్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కేసీఆర్‌ నిర్ణయం

హైదరాబాద్‌:
మొండివాడు రాజుకన్నా బలవంతుడు..నిజమే ఈ సామెత అక్షరాలా కేసీఆర్‌కు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. దాదాపు రెండు నెలల సమ్మె…ఆర్టీసీ కార్మికుల బలవన్మరణాలు..కోర్టు తీర్పులు…యూనియన్ల బెదిరింపులు…విపక్షాల ఎదురుదాడి…అన్నింటినీ విజయవంతంగా ఎదుర్కొని…విమర్శలన్నీ తిప్పికొట్టి ఆర్టీసీ కార్మికులను ఎట్టకేలకు తన దరికి తెచ్చుకుని ఎలాంటి డిమాండ్లకూ తలొగ్గక తామంతట తామే కార్మికులు విధుల్లోకి చేరేలా చేయడంలో కేసీఆర్‌ చాణక్య నీతి అవగతమవుతుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందాన అటు ఆర్టీసీ సమస్యను గాడిలోకి పెట్టి మరో పక్క అందుకు కారకులైన యూనియన్ల పని అయిపోయిందనే సంకేతం ఇచ్చినట్లయింది.
కేసీఆర్‌. ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే. పరిస్థితులను రాజకీయంగా…తనకు అనుకూలంగా మలచుకోవటంలో తన ప్రత్యేకత మరోసారి చాటుకున్నారు. ఆర్టీసీకి భవిష్యత్‌ లేదన్నారు. ప్రయివేటీకరణ తప్పదన్నారు. కార్మికులు విధుల్లోకి వస్తామంటే…మీ ఇష్టం వచ్చినప్పుడు కుదరదన్నారు. కానీ, సడన్‌ గా ఒకే ఒక్క మాటతో వాటన్నింటి పైన వచ్చిన వ్యతిరేకతను పోగొట్టుకున్నారు. కార్మికుల మీద ఒత్తిడి.. రియలైజేషన్‌ తెచ్చేందుకే అలా చేసానన్నారు.
కార్మికులు తన బిడ్డలంటూ ఎమోషనల్‌ టచ్‌ ఇచ్చారు. తన మాట వింటే సింగరేణి తరహా బోనస్‌ వస్తుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ప్రకటించారు. ఒకే దెబ్బకు అటు యూనియన్లు..ప్రతిపక్ష పార్టీలకు దిమ్మ తిరిగే స్ట్రోక్‌ ఇచ్చారు. ఇటు కార్మికులే తనకు పాలాభిషేకం చేసేలా చక్రం తిప్పారు. పనిలో పనిగా సాధారణ ప్రజానీకం లో తన మీద వ్యతిరేకత రాకుండా సమ్మె కారణంతో ఆర్టీసీ టిక్కెట్ల ధరలు పెంచేసారు. అసలు..కేసీఆర్‌ ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక కారణం ఏంటి. ప్రభావితం చేసిందెవరు.
ఎమోషనల్‌ టచ్‌..పాలాభిషేకాలు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన మీద గుర్రుగా ఉన్న ఆర్టీసీ కార్మికులను ఒకే ఒక ప్రకటనతో తన వైపు తిప్పుకున్నారు. వారంతా తన బిడ్డలంటూ ఎమెషన్‌ టచ్‌ ఇచ్చారు. వారి కడుపులు కొట్టనని స్పష్టం చేసారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఉద్యోగాలస్తామంటూ వారికి ఆత్మ బంధువు అయిపోయారు. తన మాట వింటే సింగరేణి తరహాలో బోనస్‌ వచ్చేలా చేస్తానని చెప్పారు. అసలు..ప్రయివేటీకరణ విషయంతో తన ఉద్దేశం వేరని..అక్కడా కార్మికులకే మేలు చేయాలనేది తన ఆలోచన అంటూ కార్మికుల మనసులను గెలుచుకొనే ప్రయత్నం చేసారు. అంతే..ముఖ్యమంత్రిని విమర్శించిన వారే ఆయనకు పాలాభిషేకాలు చేసారు. జిందాబాద్‌లు కొట్టారు.
కేసీఆర్‌..ఇక రాజకీయంగా గెలవటంపైన ఫోకస్‌ చేసారు. గవర్నర్‌ వద్దకు వెళ్లారు. పరిస్థితిని వివరించారు. కార్మికుల విషయంలో మానవత్వంతో నిర్ణయం తీసుకోవాలని కోరారు. కానీ, కేసీఆర్‌ వెంటనే స్పందించలేదు. విధుల్లో చేరుతామని అదే రోజు రాత్రి ముందుకు వచ్చిన కార్మికులను..ఆర్టీసీ ఎండీ ససేమిరా అన్నారు. తన ఇమేజ్‌ పెంచుకోవటం కోసం కేసీఆర్‌ వ్యూహంలో ఇదీ ఒక భాగమే. ఇక, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సైతం ముఖ్యమంత్రితో కార్మికులను ఆదుకోండి అంటూ వారి మీద సానుభూతి చూపించారు. దీంతో..వారిద్దరి హోదాలు.. వారికి ఇవ్వాల్సిన గౌరవం.. సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే రాజకీయంగా అటు కార్మికుల్లో..ఇటు ప్రజల్లో వచ్చే మైలేజ్‌ అంచనా వేసారు.అంతే..నిర్ణయం ప్రకటించారు. అదే సమయంలో కార్మికుల గురించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక్కరే సానుభూతి చూపించారంటూ..అక్కడ మరో పేరు మాత్రం ప్రస్తావించలేదు.
అసలు లక్ష్యం… మున్సిపల్‌ ఎన్నికలు..!
ముఖ్యమంత్రి గురువారం రాత్రి ఇంత పెద్ద నిర్ణయం ప్రకటించి..తెలంగాణకు తాను తండ్రి లాంటివాడినంటూ చెప్పుకొచ్చారు. శుక్రవారం హైకోర్టులో తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు అనుకూలం గా నిర్ణయం వలువడే అవకాశం ఉంది. దీంతో..ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజల్లో ఏర్పడ్డ వ్యతిరేకత..కార్మికుల కుటుంబాల్లో గూడు గట్టుకున్న ఆవేదనను..తన మంచితనం..పెద్దరికం.. అనే పేర్లతో తన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేసారు. కార్మికులను మాత్రం తన వైపు తిప్పుకోవటంలో సక్సెస్‌ అయ్యారు. అదే సమయంలో యూనియన్లు..ప్రతిపక్షాలకు ఊహించని దెబ్బ కొట్టారు. ఇక, తన మీద ఈ నిర్ణయం ద్వారా అనుకూలంగా చర్చ జరిగే సమయంలోనే మున్సిపల్‌ ఎన్నికల నగారా మోగించాలని భావిస్తున్నారు. శుక్రవారం..లేదా శనివారం మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయ్యే అవకాశం ఉంది. మంత్రులకు షాక్‌ ఇచ్చేలా.. ఆర్టీసీ సమ్మె ప్రారంభమైన సమయం నుండి కార్మిక సంఘాల విషయంల కఠినంగా వ్యవహరించారు. అసలు మంత్రులు దీని పైన స్పందించవద్దని..తానే చూసుకుంటానని స్పష్టం చేసారు. అటువంటిది అసలు ప్రయివేటీకరణ రిటైర్‌ అయిన కార్మికులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నామని..కొందరు కార్మికులకు తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ పైన ముఖ్యమంత్రి తీరుతో ప్రజల్లో వ్యతిరేకత..రాజకీయంగా నష్టపోతున్నామని లోలోపల మధన పడుతున్న మంత్రులకు సైతం కేసీఆర్‌ షాక్‌ ఇచ్చేలా నిర్ణయం ప్రకటించారు. కార్మికులకు తిరిగి ఉద్యోగాలు వచ్చేసాయి..కేసీఆర్‌ ఆశించిన స్థాయిలో కాకున్న పొలిటికల్‌ మైలేజ్‌ కనిపిస్తోంది. అదే సమయంలో ప్రయాణీల జేబులకు మాత్రం సమ్మె సమయంలోనూ..ఇప్పుడూ జేబులకు చిల్లు తప్పటం లేదు.
ఆర్టీసీ కార్మికులు సమ్మె మొదలుపెట్టగానే యూనియన్లపై నిప్పులు చెరిగాడు. యూనియన్‌ నాయకులు మాటలు విని కార్మికులు మునుగుతున్నారని అన్నాడు. సమ్మె జరుగుతున్న కాలంలో సమీక్షల మీద సమీక్షలు నిర్వహించిన కేసీఆర్‌ ప్రతిసారి యూనియన్ల మీద విరుచుకుపడ్డాడు. యూనియన్లు ఉండొద్దనే తన ఆకాంక్షను పబ్లిగ్గానే తెగేసి చెప్పాడు. తనకు యూనియన్లంటే ఎంత అసహ్యమో పలుమార్లు బయటపెట్టాడు. నిన్న కార్మికులను విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పుడు కూడా యూనియన్లపై ఇంతెత్తున లేచాడు. ‘యూనియన్లను నేను ఎట్టి పరిస్థితిలోనూ సంప్రదించేది లేదు. వారిని ప్రగతి భవన్‌కు రానిచ్చే ప్రసక్తే లేదు. ఇంత చెడగొట్టి, ఇంత నాశనం చేసినవాళ్లను కార్మికుల బతుకులు బజారున పడేసిన వాళ్లను, కార్మికుల మతికి కారకులైనవాళ్లను మేం క్షమించదల్చుకోలేదు. నేను చెప్పిన మాట వింటే బాగుపడ్తరు. ఏ యూనియన్‌ సహాయం చేయదు’ అని చెప్పాడు. తాను ‘వర్కర్స్‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌’ పెడతానని అన్నాడు. ‘వారం రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి డిపో నుంచి అయిదుగురు కార్మికులను హైదరాబాదుకు పిలుస్తా. నేనే స్వయంగా మాట్లాడతా’ అని చెప్పాడు కేసీఆర్‌. కాని ఆయన వారం దాకా ఆగదల్చుకోలేదు. ఆదివారమే అంటే డిసెంబరు ఒకటో తేదీనే కార్మికులతో సమావేశమవుతానని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించాడు. ఇక ఆర్టీసీలో యూనియన్లు ఉండకూడదనే కేసీఆర్‌ నిర్ణయాన్ని వెంటనే అమలు చేస్తున్నారు అధికారులు. కార్మికులు విధుల్లో చేరి 24 గంటలు గడవకముందే నడుం బిగించారు. హైదరాబాదులోని బస్‌ భవన్‌లో ఉన్న ఆర్టీసీ గుర్తింపు సంఘమైన తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ) ఆఫీసుకు తాళం వేసేశారు. అంతేకాదు, ఆ కార్యాలయాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతటితో ఊరుకోలేదు. ఆర్టీసీ యూనియన్ల నాయకులకు ఉన్న రిలీఫ్‌ డ్యూటీ సౌకర్యాన్ని రద్దు చేశారు. ఇక నాయకులకు రిలీఫ్‌ డ్యూటీలనేవి ఉండవు. యూనియన్‌ నాయకులకు కార్మికులకు సంబంధించి రకరకాల పనులుంటాయి కాబట్టి ఆ పనుల సమయంలో వారు విధులకు హాజరు కాకుండా మినహాయింపు ఇస్తారు. దీన్నే రిలీఫ్‌ డ్యూటీ అంటారు. దీంతో నాయకులు డ్యూటీకి రాకపోయినా జీతంలో కోత ఉండకపోయేది. కాని రిలీఫ్‌ డ్యూటీ రద్దు చేశారు కాబట్టి డ్యూటీకి రాకపోతే జీతం కోసేస్తారు. ఈ చర్యతోనే నాయకుల కోరలు పీకినట్లయింది. ముందు ముందు ఇంకేం రద్దు చేస్తారో. ఇంకేేం నిబంధనలు పెడతారో యూనియన్లు ఉండకూడదన్న కేసీఆర్‌ అభిప్రాయంపై ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. యూనియన్లు ఏర్పాటు చేసుకోవడం, నడిపించడం రాజ్యాంగం కల్పించిన హక్కంటున్నారు. ఆర్టీసీలో యూనియన్లు లేకుండా చేయడం కేసీఆర్‌ తరం కాదని, ఆర్టీసీ ఉన్నంతవరకు యూనియన్లు ఉంటాయని జేఏసీ కన్వీనర్‌ అశ్వద్థామ రెడ్డి అన్నాడు. టీఆర్‌ఎస్‌ కూడా కార్మిక విభాగం ఉంది. దాన్నేం చేస్తారని ప్రతిపక్ష నేతలు అడుగుతున్నారు. కొంతకాలం కిందట టీఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఓ పరిశ్రమలో గుర్తింపు యూనియన్‌ కోసం జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ప్రెసిడెంటుగా గెలిచాడు. గతంలో టీఆర్‌ఎస్‌కు చెందిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టిబిజెకేఎస్‌) సింగరేణి ఎన్నికల్లో గెలిచింది. అప్పట్లో కేసీఆర్‌ సంబరాలు చేసుకున్నాడు. కేసీఆర్‌ కూతురు, మాజీ ఎంపీ కవిత తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి, తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘానికి, తెలంగాణ అంగన్‌వాడీ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌కు గౌరవాధ్యక్షురాలిగా పనిచేసింది. సింగరేణి ఎన్నికల్లో ఆమె ప్రచారం కూడా చేసింది. ఇక మంత్రి హరీష్‌రావు గతంలో ఆర్‌టీసీలోని తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌కు గౌరవాధ్యక్షుడిగా ఉన్నాడు. ఆర్టీసీలో యూనియన్లు వద్దంటున్న కేసీఆర్‌ ఇతర ప్రభుత్వ కార్పొరేషన్లలో ఉన్న యూనియన్లను ఏం చేస్తారో చెప్పలేదు. మొత్తం మీద ఆర్టీసీ యూనియన్లని ‘మీ భరతం పడతా చూడు’ అంటూ కేసీఆర్‌ వెంటాడుతున్నాడు.