కశ్మీర్‌ ప్రశాంతంగానే ఉంది

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా

న్యూఢిల్లీ: 
జమ్మూకశ్మీర్‌లో పరిస్థితిపై ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని, అక్కడంతా ప్రశాంతంగా ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. మంగళవారంనాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్‌షా మాట్లాడుతూ, ఆగస్టు 5 నుంచి ఇంతవరకూ అక్కడ ఒక్క బుల్లెట్‌ పేల్చలేదని, ఒక్క ప్రాణం కూడా పోలేదని అన్నారు. ‘కశ్మీర్‌ ప్రశాంతంగా ఉంది’ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2016లో మెరుపుదాడులు (సర్జికల్‌ స్ట్రైక్స్‌) చేసినప్పుడు యాధాలాపంగా జరిగినట్టుగానే చాలామంది భావించారని, అయితే ఇటీవల 370 అధికరణ రద్దు తర్వాత దేశ రక్షణ విధానాలపై వారందరికీ చాలా స్పష్టత వచ్చిందని అమిత్‌షా అన్నారు. మెరుపుదాడులు, వాయిదాడులు ప్రజలకు సంతోషం కలిగించి ఉండవచ్చనీ, అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే మాత్రం చాలా దైర్యం కావాలని అన్నారు. ఆ నిర్ణయం తర్వాత భారత్‌పై ప్రపంచ దేశాల వైఖరిలో మార్పు వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తూ, యూపీఏ హయాంలో ప్రతిరోజూ అవినీతి, సరిహద్దుల్లో అభద్రత, సైనికుల తలలు నరికివేత, మహిళలకు కొరవడిన రక్షణ, ప్రతిరోజూ రోడ్లపైకి జనం వచ్చి నిరసనలు తెలపడం వంటి వార్తలు చోటుచేసుకుంటూ ఉండేవని అమిత్‌షా విమర్శించారు. ప్రధాని ఒకరు ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ ఆయనను ఖాతరు చేయకుండా తామే ప్రధానులుగా భావించుకుని పాలన సాగించారని కాంగ్రెస్‌ హయాంపై చురకలు వేశారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా మోదీ సర్కార్‌ ఓటు బ్యాంకును ఆశించకుండా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటూవచ్చారని చెప్పారు. గత ప్రభుత్వానికి ఒక నిర్ణయం తీసుకునేందుకు 30 ఏళ్లు పడితే, తమ ప్రభుత్వం గత ఐదేళ్లలో జీఎస్‌టీ, పెద్ద నోట్ల రద్దు, వాయుదాడులు సహా 50కి పైగా కీలక నిర్ణయాలు తీసుకుందని షా చెప్పారు. ఆర్థికంగా భారత్‌ ఎదుగుతోందని, వ్యవసాయరంగం, తలసరి ఆదాయం కూడా పెరుగుతోందని, 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా పురోగమిస్తున్నామని చెప్పారు. 2024 నాటికి ఆ లక్ష్యం సాధించి తీరుతామనే నమ్మకం తనకు ఉందని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. 
భద్రత తిరస్కరించిన షా: 
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌(ఎన్‌ఎస్‌జీ) కమాండోల ద్వారా ఇచ్చే భద్రతను తిరస్కరించారట. తనకు ఎన్‌ఎస్‌జీ భద్రత వద్దని, ప్రస్తుతం ఉన్న సీఆర్పీఎఫ్‌ భద్రతనే కొనసాగించాలని అమిత్‌ షా కోరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 
అమిత్‌ షా హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన భద్రత విషయమై హోంశాఖ వీఐపీ సెక్యూరిటీ అసెస్‌మెంట్‌ కమిటీ సమావేశమైంది. అయితే వీఐపీల భద్రతపై నిర్ణయం తీసుకునేముందు కేంద్ర హోంశాఖ ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) హెచ్చరికలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఉగ్రవాద సంస్థల నుంచి ప్రధాని మోదీ తర్వాత అమిత్‌ షాకే అత్యంత ఎక్కువ ముప్పు ఉందని ఇదివరకే ఐబీ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీన్ని పరిగణనలోకి తీసుకుని అమిత్‌ షాకు ఎన్‌ఎస్‌జీ భద్రత కేటాయించాలని కమిటీ భావించింది. దీనిపై హోంమంత్రి అమిత్‌ షాను అడగగా.. అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. తనకు ప్రస్తుతం ఇస్తున్న సీఆర్పీఎఫ్‌ భద్రతనే కొనసాగించాని ఆయన కమిటీని కోరినట్లు సమాచారం. అయితే దీనిపై హోంశాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సీఆర్పీఎఫ్‌ భద్రత ఉన్న తొలి హోంమంత్రి అమిత్‌ షానే. అంతకుముందు హోంమంత్రిగా ఉన్న రాజ్‌నాథ్‌ సింగ్‌కు జడ్‌ ప్లస్‌ ఎన్‌ఎస్‌జీ భద్రత ఉండేది. సీఆర్పీఎఫ్‌ భద్రత కింద అమిత్‌ షాకు 100 మంది సీఆర్పీఎఫ్‌ కమాండోలు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. హోంమంత్రిగా ఉన్నందున అటు దిల్లీ పోలీసులు కూడా ఆయనకు భద్రత కల్పిస్తున్నారు. ఆయన నివాసం వద్ద దిల్లీ పోలీసు విభాగానికి చెందిన 50 మంది సిబ్బంది పహారా కాస్తుంటారు.