కేటీఆర్కు ప్రిన్స్ మద్దతు
పరిసరాల పరిశుభ్రతపై మంత్రి చర్యలపై సంతృప్తి
హైదరాబాద్: తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు ప్రిన్స్ మహేష్బాబు మద్దతు తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు జ్వరాల బారిన పడి తీవ్రంగా బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇటీవల తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సోషల్మీడియా వేదికగా స్పందిస్తూ .. జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. ‘వైరల్ జ్వరాలు, డెంగీ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మీ ఇంటి ఆవరణలో ఉన్న నీటి తొట్టెలు, పూల కుండీలు, ఎయిర్ కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. దోమల వ్యాప్తికి ఇవే కారణం. నా ఇంటి పరిసరాలను నేను తనిఖీ చేసి నిల్వ ఉన్న నీటిని తొలగించాను. మీరు కూడా ఆ పనిచేసి ఫొటోలను నాతో పంచుకోండి’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే కేటీఆర్ ట్వీట్కు టాలీవుడ్ యువ కథానాయకుడు ప్రభాస్ స్పందించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో టాలీవుడ్ కథానాయకుడు ప్రిన్స్ మహేష్బాబు కేటీఆర్కు సోషల్మీడియా వేదికగా మద్దతు తెలిపారు. ‘డెంగీ, వైరల్ జ్వరాలు ప్రస్తుతం నగరంలో వ్యాపిస్తున్నాయి. మీ చుట్టూ ఉన్న పరిసరాలలో నీటి నిల్వ లేకుండా చూసుకోండి. అప్రమత్తంగా ఉండడంతోపాటు మీ గురించి మీరు జాగ్రత్త తీసుకోండి. హైదరాబాద్ నగరవాసులరా..’ అంటూ మహేష్ ట్వీట్ చేశారు.