రాష్ట్రంలో భారీ ‘విద్యుత్‌’ కుంభకోణం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ 

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీ తీసుకుంటున్న చర్యల వల్లే దేశంలోని 28 రాష్ట్రాల్లో మిగులు విద్యుత్‌ సాధ్యమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. తెలంగాణలో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా సోలార్‌ విద్యుదుత్పత్తిని రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆయన మండిపడ్డారు. భాజపా కార్యాలయంలో లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. 2014లో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ.. దక్షిణ, ఉత్తర విద్యుత్‌ గ్రిడ్లను అనుసంధానం చేయడం వల్లే ఈరోజు రాష్ట్రంలో తక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు అవకాశం లభించిందని చెప్పారు. అయితే ఇదంతా తన ఘనతగా కేసీఆర్‌ చెప్పుకోవడం సరికాదని లక్ష్మణ్‌ దుయ్యబట్టారు. 
అధికారంలోకి వచ్చిన తర్వాత 70 ఏళ్లలో ఏ పార్టీ చేయలేని విధంగా మారుమూల గ్రామాలకు సైతం విద్యుత్‌ వెలుగులు అందించిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ఐదేళ్ల పాలనలో విద్యుత్‌ రంగానికి సంబంధించి ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా చేపట్టలేదని.. ఒక్క మెగావాట్‌ అదనంగా ఉత్పత్తి చేయలేదని లక్ష్మణ్‌ విమర్శించారు. ఈరోజు తెలంగాణలో 24 గంటలు నిర్విరామంగా విద్యుత్‌ అందించగలుగుతున్నామంటే అది కేవలం ప్రధాని మోదీ తీసుకొచ్చిన సంస్కరణల వల్లే సాధ్యమైందని చెప్పారు. జాతీయ సోలార్‌ విధానంలో భాగంగా చౌకగా రూ. 4.30పైసలకు సోలార్‌ ఇస్తానంటే రాత్రికి రాత్రే రూ.5.50పైసలకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని లక్ష్మణ్‌ ఆరోపించారు. తెలంగాణ విద్యుత్‌ రంగంలో భారీ కుంభకోణం జరిగిందని.. సిట్టింగ్‌ జడ్డితో విచారణ జరిపిస్తే పూర్తి వివరాలు బహిర్గతం అవుతాయని ఆయన అన్నారు.