ప్రీస్కూళ్లుగా అంగన్‌వాడీల అభివృద్ధి

పురపాలక సంఘాల నిధులతో సదుపాయాలు 
ఏలూరు,ఆగస్ట్‌2-: అంగన్‌వాడీలకు నిధుల రాకతో పాటు ప్రోత్సాహం కారణంగా అవి ప్రీస్కూళ్లుగా మారుతున్నాయి. నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ప్రీస్కూల్‌ బోధన ప్రారంభించారు. 3 ఏళ్ల వయస్సున్న చిన్నారులను నర్సరీ, 4ఏళ్ల చిన్నారులను ఎల్‌కేజీ, 5 ఏళ్ల చిన్నారులను యూకేజీలో చేరుస్తూ తరగతులుగా విభజించి ఆంగ్లమాధ్యమం కూడా బోధిస్తున్నారు. దీనిపై కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ప్రీస్కూల్‌ విధానం ప్రవేశపెట్టడంతో అక్కడ పిల్లల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఐసీడీఎస్‌, పురపాలక సంఘాల అధికారులు చెబుతున్నారు. పురపాలక సంఘాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు కొత్త రూపుతో కనిపిస్తున్నాయి. ఈ కేంద్రాలకు కొత్తకొత్త సామగ్రి సమకూరుస్తున్నారు. ముందుగా పురపాలక సంఘాల్లోని కేంద్రాల్లో పనులు చేపడుతున్నారు. పురపాలక సంఘాల నిధులతో పలు చోట్ల సదుపాయాలు కల్పించారు. దీనికితోడు దాతలు ముందుకొచ్చి తమవంతు సాయం చేస్తున్నారు. శిథిలావస్థ భవనాలు.. ఇరుకు గదులు.. చాలీచాలని వరండాలతో ఇంతకాలం అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వీటిలో మార్పు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక సంస్థల నిధులను వీటికోసం ఖర్చు చేయడంతో పాటు దాతల సహాయం తీసుకుని అభివృద్ధి బాటలో నడిపించాలని ముఖ్యమంత్రి అభిలషించారు. సీఎం చంద్రాబు ఆలోచనలకు తగ్గట్లుగానే అంగన్‌వాడీ కేంద్రాల స్వరూపమే మారిపోతోంది. కార్పోరేట్‌ స్థాయిలో ఆ కేంద్రాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. దీంతో పురపాలక సంఘాల నిధులతో వాటి పరిధిలోని కేంద్రాలకు సకల సదుపాయాలు కల్పిస్తున్నారు. కేంద్రాల్లో చిన్నారులకు కూర్చునేందుకు కుర్చీలు, టేబుళ్లు, ఎల్‌ఈడీ టీవీలు, యూనిఫామ్‌ , ఆట పరికరాలు సమకూరుస్తున్నారు. భవనాలకు రంగులు వేసి వాటిపై ఆకర్షణీయమైన బొమ్మలు వేస్తున్నారు. సదుపాయాలు కల్పించారు. జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్‌, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, పాలకొల్లు, నిడదవోలు, కొవ్వూరు పురపాలక సంఘాలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ ఉన్నాయి. వీటిల్లో సుమారుగా 300 కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో కొన్నింటిని పక్కనున్న కేంద్రాల్లో కలిపారు. మూడు కేంద్రాలను ఒకటిగా మార్చారు. 
కొన్నిచోట్ల రెండేసి కేంద్రాలను కలిపారు. మిగిలినవి పాతవాటినే కొనసాగిస్తున్నారు. 
నినీ 
కార్పోరేట్‌కు దీటుగా పాఠశాలల అభివృద్ది 
విశాఖపట్టణం,ఆగస్ట్‌2-: కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దు తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు శ్రీనివాస్‌ అన్నారు. ఇందుకోసం ప్రజలకు ప్రభుత్వవిద్యను చేరువ చేసే లక్ష్యంతో సిఎం వైఎస్‌ కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఉండేందుకు గాను నిధులు కేటాయించనున్నట్లు చెప్పారు. అలాగే పిల్లల ఆరోగ్యంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. ఈ మేరకు చిన్నారులకు రుబెల్లా, తట్టు వ్యాధుల్ని నిరోధించే వ్యాక్సిన్ల శిబిరాన్ని ప్రారంభించామని అన్నారు. రాష్ట్రంలోని పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు. భారతదేశంలోనే ఏపీని ఓ రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం శ్రమిస్తున్నారని తెలిపారు. రుబెల్లా, తట్టు వ్యాధులు రాకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యాక్సిన్లను పిల్లలకు వేయించడానికి సంకల్పించిందని, తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు.