ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాల్సిందే

జనగామ,జూలై29: ప్రతీ ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, అందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి ఇచ్చిన సూచనల మేరకు గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. సర్పంచ్‌లు కడా ఇందుకు మరుగదొడ్లు కట్టించుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. ప్రతీ ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలని, నిర్మించుకోని వారుంటే వెంటనే నిర్మించుకోవాలన్నారు. గ్రామంలో ఆరుబయటకు వెళ్తున్న వారిని గుర్తించి మరుగుదొడ్డి నిర్మించుకోవడానికి కృషి చేయాలన్నారు. లేకుంటే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మిషన్‌ భగీరథ నీరు గ్రామాల్లోకి సరిగా వచ్చే విధంగా గేట్‌వాల్వ్‌లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి ఒక్కరూ హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. బహిరంగ మలవిసర్జన నిర్మూలన కోసం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్‌ కోరారు. గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. వీటితోపాటు ఇళ్లలో నుంచి వెలువడే 
మురుగు నీరు వీధుల వెంట ప్రవహించకుండా ఎక్కడికక్కడే ఇంకిపోయేలా ఇంకుడుగుంతలు తవ్వుకోవాలని కోరారు. పశువుల పేడ, వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా ప్రభుత్వం మంజూరు చేస్తున్న కంపోస్టు పిట్స్‌లో వేసుకొని సేంద్రియ ఎరువును తయారు చేసుకోవాలని సూచించారు. ఈ మూడు పథకాలలో ప్రభుత్వం నుంచే నిధులు మంజూరు చేస్తున్నందున ఎవరికీ ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదన్నారు. రోగాలు లేని జీవితం కోసం ఈ మూడు నిర్మాణాలను ప్రతి ఇంట్లో తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో పారిశుధ్య పనులు నిర్వహించాలని సూచించారు. తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయాలని, పంచాయతీ కార్యాలయాలకు, ట్యాంకులకు 
రంగులు వేయాలని సూచించారు. డ్రైనేజీలను శుభ్రపరచాలని, మురుగు నీరు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.