భారీ వర్షాలు కురుస్తాయ్!
- – భారతీయ వాతావరణశాఖ వెల్లడి
హైదరాబాద్, జులై24 : రానున్న 24 గంటల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. భారతీయ వాతావరణశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. కొంకన్, గోవా, సబ్ హిమాలయా, పశ్చిమ బెంగాల్, సిక్కీం, బీహార్, కోస్టల్ కర్నాటక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఆల్ ఇండియా వెదర్ వార్నింగ్ బులెటిన్లో ఐఎండీ ఈ విషయాన్ని చెప్పింది. యూపీ, అస్సాం, మేఘాలయా లాంటి రాష్ట్రాల్లో బుధవారం కుండపోత వానపడే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్, అస్సాంలో ఇప్పటికే 170మంది మృతిచెందారు. గత 48 గంటలుగా కురుస్తున్న వర్షాలతో.. అస్సాం అతలాకుతలమవుతున్నది. భారీ స్థాయిలో వరదలు వస్తున్నాయి. దీంతో అక్కడ జనజీవనం స్తంభించిపోయింది. బీహార్లో గత 24గంటల్లో పిడుగులు పడడం వల్ల సుమారు 36 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, బెంగాల్, ఒడిసా రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో పాటు భారీ స్థాయిలో పిడుగులు కురవనున్నట్లు ఎంఐడీ హెచ్చరించింది. అరేబియా సముద్రం తీరం వెంట బలమైన గాలులు కూడా వీయనున్నాయి.
ముంబైని ముంచెత్తిన భారీ వర్షం..
భారీ వర్షాల కారణంగా ముంబై నగరం సముద్రాన్ని తలపిస్తోంది. మంగళవారం అర్థరాత్రి నుంచి కుండపోత వర్షం కురవడంతో నగరమంతా నీటితో నిండిపోయింది. ప్రధాన రహదారులన్నీ జలమయం అయిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపిపోవడంతో పనులకు వేళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వర్షాలతో రైలు ప్రయాణానికి కూడా అంతరాయం ఏర్పడింది. నగరంలోని సియాన్ రైల్వే స్టేషన్లో ట్రాక్పై భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతుంది. భారీ వర్షం కారణంగా కుర్లా, సియాన్ ప్రాంతాలకు మధ్య ప్రయాణించే రైలు 15 నిమిషాల పాటు ఆలస్యంగా వస్తాయని రైల్వే సిబ్బంది పేర్కొంది. విమానయాన సేవలు యథాతదంగా కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా రహదారి కనిపించకపోవడంతో ముంబైలో బుధవారం ఉదయం మూడు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ముంబై, రాయగడ్, రత్నగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇదిలా ఉంటే ముంబయికి సవిూపంలో తుపాను ఏర్పాటు అవుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. గత రెండు రోజులుగా ముంబైలు వర్షాలు కురవలేదు. దీంతో కాస్త ఊపిరి తీసుకున్న నగర వాసులు.. బుధవారం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలకు ఉలిక్కి పడ్డారు. ఈ నెల ప్రారంభంలో ముంబైలో కురిసిన భారీ వర్షాలకు మలాడ్లో ఓ గోడ కూలి 30 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.