వివాహేతర సంబంధంతో భర్త హత్య తల్లిని ఉరితీయాలంటూ పిల్లల ఫిర్యాదు

చండీఘడ్‌,జూలై23: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్న భర్తను భార్య హత్య చేసింది. అనంతరం ఇద్దరు పిల్లలను తన తండ్రి వద్ద విడిచిపెట్టిన ఆ మహిళ.. ప్రియుడితో వెళ్లిపోయింది. మా నాన్నను చంపిన అమ్మను ఉరి తీయాలని ఆమె ఇద్దరు పిల్లలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సంఘటన పంజాబ్‌లోని తర్న్‌ తరణ్‌ గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. రాజ్‌ప్రీత్‌ సింగ్‌, సిమ్రాన్‌ కౌర్‌కు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
అయితే గత కొంత కాలం నుంచి సిమ్రాన్‌.. లవ్‌ప్రీత్‌ సింగ్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయంలో పలుమార్లు రాజ్‌ప్రీత్‌, సిమ్రాన్‌ మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ వివాహేతర సంబంధాన్ని అడ్డుకునేందుకు సిమ్రాన్‌ తల్లిదండ్రులు కూడా ప్రయత్నించారు. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకోవాలని సిమ్రాన్‌కు సూచించినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. మొత్తానికి ఆదివారం రాత్రి రాజ్‌ప్రీత్‌కు ఆహారంలో విషమిచ్చింది. అయితే అతను కొనఊపిరితో ఉండడంతో ఉరేసి చంపేసింది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలను తీసుకొని తన తండ్రి వద్దకు వెళ్లి అక్కడి విడిచిపెట్టింది. అనంతరం తన ప్రియుడితో కలిసి సిమ్రాన్‌ వెళ్లిపోయింది. ఇక జరిగిన విషయాన్ని ఆ ఇద్దరు పిల్లలు తన తాతకు చెప్పారు. నాన్నను ఉరేసి చంపిందని, అమ్మపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పిల్లలు డిమాండ్‌ చేశారు. తమ నాన్నను ఎలాగైతే ఉరేసి చంపిందో.. అలాగే అమ్మను కూడా ఉరేయాలని పిల్లలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లవ్‌ప్రీత్‌, సిమ్రాన్‌ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.